కొత్త ఏడాదిలోనూ.. అదే వరుస | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలోనూ.. అదే వరుస

Published Tue, Jan 3 2017 10:41 PM

కొత్త ఏడాదిలోనూ.. అదే వరుస

నగదు కోసం బ్యాంకులో  బారులు తీరిన ఖాతాదారులు
పనిచేయని ఏటీఎంలు   తప్పని వేతన యాతన


మంచిర్యాల అగ్రికల్చర్‌ :ఎంతో సంబరంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికినా.. సోమవారం ఎంతో ఆశతో బ్యాంకులకు చేరుకున్న ఖాతాదారులకు మాత్రం కష్టాలు తప్పలేదు. కొత్త ఏడాదిలో అయినా ఇబ్బందులు తప్పుతాయనుకుంటే బారులు తీరాల్సిన పరిస్థితే వచ్చింది. అందులోనూ వేతనాలు డ్రా చేసుకునే సమయం.. ఇంకేముంది ఇటు ఉద్యోగులు, అటు ఖాతా దారులు వందలాదిగా తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. గత నెల ఒకటో తారీ ఖున ఎదుర్కొన్న ఇబ్బందులనే సోమవారం పడ్డారు.

రూ.4 వేలతో సరి..
ఉద్యోగులకు వేతనాలు వచ్చే రోజు కావడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలవారీ నగదు చెల్లింపులు ఉండటంతో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్దకు పరుగులు తీశా రు. శనివారం మధ్యాహ్నం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయడం.. ఆదివారం సెలవు కావడంతో సోమవారం బ్యాంకులు తెరుచుకున్నాయి. ఒకటో తారీఖు నుంచి ఏటీఎంలలో రూ.4500 తీసుకునేందుకు వెసులుబాటు కల్పించినా.. ఏ ఏటీఎంలలో కూడా నగదు కనిపించలేదు. 90 శాతం ఏటీఎంలలో నగదు పెట్టలేదు. జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు, పింఛన్‌ కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బారులు తీరాల్సి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచే క్యూలో ఉన్నా.. రూ.4 వేలే ఇవ్వడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ పలు బ్యాంకులు నాలుగు వేల నగదు చెల్లింపులు చేయగా.. పలు ఆంధ్రా బ్యాంకుల్లో సరిపడా నగదు రాలేదని రూ.2 వేలతో సరిపెట్టారు.

ఏటీఎంలదీ అదే పరిస్థితి..
కనీసం ఏటీఎంలోనైనా నగదు తీసుకోవాలన్న ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఏటీఎంలో విత్‌డ్రా పరిమితి రూ.4,500 పెంచడంతో వీటి ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. శనివారం పెట్టిన క్యాష్‌ అయిపోవడంతో సోమవారం బ్యాంకులు పనిచేసే సమయంలోనై క్యాష్‌ పెడుతారని ఏటీఎం కేంద్రాల ఎదుట పెద్దఎత్తున క్యూ కట్టారు. ప్రధాన్‌ బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో నగదు పెట్టగా.. మిగితా ఆయా కూడళ్ల వద్ద ఏటీఎంలో క్యాష్‌ కనిపించలేదు.  

నరకం చూపిస్తున్న పింఛన్లు..
ప్రతినెలా ఒకటో తారీఖున వచ్చే పింఛన్లు పొందేందుకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులేమో పింఛన్‌ సొమ్ము బ్యాంకుల్లో జమ అవుతుందని అంటున్నారు. బ్యాంకులకు వెళ్తే గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అయినా.. చేతికి నగదు అందుతుందా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు. కనీసం అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో కూడా చూసుకునే పరిస్థితి బ్యాంకు వారు కల్పించడం లేదు. దీనికితోడు రూ.500 నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో పింఛన్‌ సొమ్ము చెల్లించేందుకు బ్యాంకు వారు తలలు పట్టుకుంటున్నారు. రెండు వేల నోట్లే అధికంగా వస్తుం డడంతో.. వెయ్యి రూపాయల పింఛన్‌ ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధాప్యంలో ఉండి.. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారు బ్యాంకులకు వెళ్లి పింఛన్‌ ఎలా తీసుకోగలరని.. ప్రత్యేక వెసులుబాటు ఏదైనా ఇవ్వాలని వృద్ధులు అంటున్నారు.

మరింత పెరగనున్న రద్దీ
జిల్లాలో 1వ తారీఖు నుంచి వారం రోజులపాటు ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కోట్లల్లో నగదు చెల్లింపు ఉంటుంది. దీనికితోడు సింగరేణి కార్మికులు కూడా రూ.33 కోట్లను బ్యాంకుల ద్వారా తీసుకోనున్నారు. అయితే.. 1వ తేదీ సెలవు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు 2వ నుంచి వేతనాలు బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్నాయి. సింగరేణి కార్మికులకు ప్రతినెలా 3వ తేదీ నుంచి బ్యాంకుల్లో జమ అవుతాయి. నెల మొదటి వారం నుంచి నెలవారి అప్పులు చెల్లింపులు, ఫీజులు, చీటీలు, తదితర ఇంటి అవసరాల ఖర్చులు ఉంటాయి.  దీంతో వేతనాలు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్మికుల రద్దీ మరింత పెరుగుతుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement