టార్గెట్ మార్నింగ్ అంటున్న పోలీసులు! | Sakshi
Sakshi News home page

టార్గెట్ మార్నింగ్ అంటున్న పోలీసులు!

Published Wed, Nov 16 2016 12:13 AM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉదయం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు... హడావుడిలో పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే అవకాశం లేదని భావించిన ఓ ఘరానా దొంగ తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తిస్తాడు. 10.30 నుంచి 12.30 మధ్య సమయంలో చోరీ చేస్తాడు. కేవలం 15 నిముషాల్లోనే పనిపూర్తి చేసి ఆ ప్రాంతాన్ని వదిలేస్తాడు.

ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ ఘరానా దొంగను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 20 తులాల వెండి, 4 ల్యాప్‌టాప్‌లు, 2 చేతిగడియారాలు, ఒక కెమెరా, రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

50 ఇళ్లలో రూ.40 లక్షల సొత్తు చోరీ...
సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అవేజ్‌ అహ్మద్‌ ఎంబీఏ చదవి ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. ఐఎస్‌ సదస్సులో ఇండియా సర్వీసెస్‌ కన్సల్టెన్సీని నిర్వహించి నష్టాలు రావడం, సులువుగా డబ్బులు సంపాదించాలని చోరీల బాటను ఎంచుకున్నాడు. 2008 సంవత్సరం నుంచి చోరీలు మొదలు పెట్టిన అతడు 2009లో పోలీసులకు పట్టుబడి ఆ తర్వాత జైలుకు వెళ్లాడు.

దాదాపు నాలుగేళ్లపాటు చోరీల జోలికి వెళ్లలేదు. తిరిగి 2015 సంవత్సరంలో చోరీకి పాల్పడి హుస్సేనీఆలం పోలీసులకు చిక్కాడు. డిసెంబర్‌లో జైలు నుంచి వచ్చాక వరుసగా 11 నెలల పాటు 50 చోరీలు చేసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ దొంగను పట్టుకున్న మేడిపల్లి ఇ¯ŒSస్పెక్టర్‌ జగన్నాథరెడ్డి, డీఎస్‌ఐ జయరాంతో పాటు పోలీసు సిబ్బందికి కొత్త కరెన్సీలో మహేష్‌ భగవత్‌ రివార్డులు అందించారు.

‘ఎగ్జిక్యూటివ్‌’ అవతారంతో పనికానిచ్చేస్తాడు...
అవేజ్‌ అహ్మద్‌ తన ఆనవాళ్లు ఎవరికీ కనపడకండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇంట్లో నుంచి బయలుదేరే సమయంలో ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా డ్రెస్సు వేసుకుని బయలుదేరుతాడు. అతడికి బాగా తెలిసిన ప్రాంతాలైన ఉప్పల్, కుషాయిగూడ, మల్కాజిగిరి, మేడిపల్లి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. ఇంటికి తాళం వేసి ఉంటే ఇంట్లోకి చొరబడతాడు. 15 నిమిషాల్లో పని పూర్తి చేసుకొని బయటపడతాడు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలోనే ఈ చోరీలు చేస్తుంటాడు.

ఈ సమయంలో చాలా మంది గృహిణులు తమ పిల్లలకు స్కూల్‌లో టిఫిన్ ఇవ్వడానికి, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లడం, ఆఫీసులకు, బంధువుల ఇళ్లకు వెళ్లడం వంటి పనుల్లో బిజీగా ఉంటారని, త్వరగా ఇంటికి తిరిగి వస్తామని అల్మారాలు, కబోర్డులకు తాళాలు వేసి అక్కడే వదిలేసి వెళ్లడం వంటివి జరుగుతాయని అవేజ్‌ పసిగట్టాడు. దీంతో ఆ సమయాన్ని లక్కీ టైంగా ఎంచుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.

 

Advertisement
Advertisement