మూడో కన్ను..అడవికి దన్ను | Sakshi
Sakshi News home page

మూడో కన్ను..అడవికి దన్ను

Published Wed, Jan 11 2017 10:25 PM

అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలకు చిక్కిన ఎలుగుబంట్లు - Sakshi

-నల్లమలలో 600 కెమెరాల ఏర్పాటు
- ఎర్రచందంనం అక్రమ రవణాకు చెక్‌
- 66 పెద్ద పులుల గుర్తింపు
- చిమ్మచీకట్లోనూ ఇన్‌ఫ్రారెడ్‌ రేస్‌తో  చిత్రాలు సేకరణ
 
కల్లూరు (రూరల్‌): వన్యప్రాణుల రక్షణ కోసం..అటవీ సంపద పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని నల్లమల అడవిలో వరల్డ్‌ వైల్డ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)తో వీటిని ఏర్పాటు చేశారు. నంద్యాలలోని చెలమ రేంజ్, బీచ్, బసాపురం, పెద్దకంబలూరు, పచ్చర్ల, దొంగబావి, అహోబిలం, రుద్రవరం, గుండ్ల బ్రహ్మేశ్వరం, బైరేనీ, ఎన్‌ఆర్‌ కుంట, ఓంకారం వంటి ప్రాంతాల్లో..600 కెమెరాలను అమర్చారు. చిమ్మచీకట్లోనూ ఇన్‌ఫ్రారెడ్‌ రేస్‌తో ఇవి చిత్రాలను తీయగలవు. కెమెరా ఏదైనా జంతువు నిల్చుంటే చాలు ఆటోమేటిక్‌గా ఇవి చిత్రాలను తీస్తాయి. అటవీ జంతువులు  వర్షాకాలంలో ఎత్తయిన ప్రదేశాల్లో, ఎండాకాలంలో చల్లని నీటి కుంటల వద్ద సంచరిస్తూ ఉంటాయి. టైగర్‌ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 66 పెద్ద పులులను అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంత విస్తీర్ణం 355 చదరపు కిలో మీటర్లు ఉంది. 
 
ప్రత్యేక చిప్‌..
ఇన్‌ఫ్రారిడ్‌ కెమెరాల్లో ప్రత్యేక చిప్‌ ఉంటుంది. వాటి ముందు నిల్చుంటే చాలు ఇన్‌ఫ్రారిడ్‌ రేస్‌ ఇట్టే పట్టేస్తాయి. జంతువు/మనిషి ప్రతిబింబం ఇన్‌ఫ్రారిడ్‌ రేస్‌ క్యాప్చర్‌ చేసేస్తాయి. ఆ కెమెరాల్లో అమర్చిన చిప్‌తో చిత్రాలను అటవీ శాఖ అధికారులు డౌన్‌లోడ్‌ చేసుకుంటూ అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి జంతువులు సంచరించాయి, డేట్, టైమ్‌తో పాటు ఫోటోలో క్చాప్చర్‌ అవుతోంది. వీటి ద్వారా అటవీ ప్రాంతంలో ఎవరెవరూ గుట్టు చప్పుడు కాకుండా సంచరిస్తుంటారో తెలుసుకోవచ్చు..
 
రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనం సీజ్‌
ఇప్పటి వరకు గుట్టుగా తరలిపోతున్న రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనం అక్రమ తరలింపుకు చెక్‌ పడినట్లైంది. అర్థరాత్రి వేళలోనూ ఇన్‌ఫ్రారెడ్‌ కాంతి కిరణాల ద్వారా స్పష్టంగా ఛాయాచిత్రాలు, అనుమతి లేకుండా సంచరించే వారిని ఈ కెమెరాలు ఇట్టే పడేయడంతో అక్రమ వ్యాపారానికి కొంత చెక్‌ పడింది. అందులో భాగంగానే రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల అటవీ ప్రాంతంలో రూ.241 లక్షలు విలువ చేసే  366 టన్నుల ఎర్ర చందనాన్ని అటవీ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. మొత్తం 548 కేసులు నమోదు చేసి, 719 మందిని అరెస్ట్‌ చేసి, 235 వాహనాలను  సీజ్‌ చేశారు. అలాగే కడప–పొద్దుటూరులో రూ.26 కోట్లు విలువ చేసే  3,800 టన్నుల ఎర్ర చందనాన్ని సీజ్‌ చేశారు. 3,600 కేసులు నమోదు చేసి 50,300 మందిని అరెస్ట్‌ చేసి, 1900 వాహనాలను సీజ్‌ చేశారు. తిరుపతిలోని సెంట్రల్‌ గోడౌన్‌కు ఎర్రచందనాన్ని తరలించారు. అక్కడ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా వేలం వేసి అమ్మేస్తారు.
 
అటవీప్రాంతంలో గట్టి నిఘా : జేఎస్‌ఎన్‌ మూర్తి, ఫారెస్ట్‌ కన్సర్‌వేటర్, కర్నూలు
ఎర్రచందనం అక్ర రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. వన సంపద కొల్లగొట్టే అక్రమార్కులపై కొరడా ఝుళిపించనున్నాం. వన్యప్రాణుల పరిరక్షణ మా బాధ్యత..ఇందుకు ఇన్‌ప్రారెడ్‌ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాం. 
 

Advertisement
Advertisement