ఇళ్లు కోల్పోయిన వారికి ‘డబుల్‌’ ఇళ్లు | Sakshi
Sakshi News home page

ఇళ్లు కోల్పోయిన వారికి ‘డబుల్‌’ ఇళ్లు

Published Fri, Oct 7 2016 10:05 PM

ఇళ్లు కోల్పోయిన వారికి ‘డబుల్‌’ ఇళ్లు - Sakshi

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
జిన్నారం :రోడ్డు వెడల్పు చేయటంలో ఇళ్లు కోల్పోతున్న వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హామీ  ఇచ్చారు. జిన్నారం, కొడకంచి, వావిలాల  గ్రామాల్లో డబుల్‌రోడ్డు వేస్తుండటంతో ఇళ్లు కోల్పోతున్న లబ్దిదారులతో ఎమ్మెల్యే శుక్రవారం మాట్లాడారు. స్థానికంగా ఉన్న ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో ఆయన స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్‌ రోడ్డు అన్ని గ్రామాలను కలుపుతూ వేయించేలా ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. 

గ్రామాల నుంచి డబుల్‌రోడ్డు వెళ్తుండటంతో కొంత మంది ఇళ్లు కూల్చివేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న డబుల్‌బెడ్‌రూంలను మొదటి ప్రాధాన్యతగా వారికే అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, రోడ్డు వేసేందుకు ప్రజలు సంబంధిత అధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసేలా రాష్ర్ట ప్రభుత్వం అనేక నిధులను కేటాయిస్తుందన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిలో అన్ని పార్టీల నాయకులు కూడా భాగస్వాములు  కావాలని పిలుపునిచ్చారు.   కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌రెడ్డి, తహశీల్దార్‌ శివకుమార్‌, నాయకులు వెంకటేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
వేడుకలను ధూంధాంగా నిర్వహించాలి
కొత్తగా ఏర్పాటు కానున్న గుమ్మడిదల మండలంలో ఆవిర్భావ వేడుకలను ధూంధాంగా నిర్వహించాలని ఎమ్మెల్యే   పిలుపునిచ్చారు. జిన్నారం మండలంలోని గుమ్మడిదలలో మండల ఆవిర్భావ వేడుకలను నిర్వహణకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడారు. ఈ నెల 10న ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని స్థానిక నాయకులు, ప్రజలు నిర్ణయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుమ్మడిదల మండల ఏర్పాటుకు తాను చాలా కృషి చేశానన్నారు. ప్రజల సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొత్త మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల ఆవిర్భావ వేడుకలను ఈ నెల 10వ తేదీన ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, తహశీల్దార్‌ శివకుమార్‌, నాయకులు వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

పార్టీలో చేరికలు :
 మండలంలోని సోలక్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ మండల యువత అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. లంబాడి గోపీనాయక్‌తో పాటు మరో 20మంది వరకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలను వేసిపార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీసీ రోడ్డుకు శంకుస్థాపన
సోలక్‌పల్లిలో రూ. 3లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే  శంకుస్థాపనలు చేశారు.  గ్రామాల అభివృద్ధికి తనవంతుకృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ రవీందదర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌, సర్పంచ్‌ రాములుయాదవ్‌, ఉపసర్పంచ్‌ సుధాకర్‌యాదవ్‌, నాయకులు రవీందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, పోచయ్యయాదవ్‌తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement