కాల్వలో పడిన ఆటో.. ముగ్గురు చిన్నారుల మృతి | Sakshi
Sakshi News home page

కాల్వలో పడిన ఆటో.. ముగ్గురు చిన్నారుల మృతి

Published Thu, Oct 22 2015 1:02 AM

Three children died falling in canel

ఉండ్రాజవరం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో బుధవారం రాత్రి ఆటో బోల్తాపడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తణుకు నుంచి ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామానికి వస్తున్న ఆటో వడ్లూరు గ్రామ పరిధిలో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న అత్తిలి కాలువలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కోమటి అశ్వంత్ (3), బెజవాడ జ్యోతి (11), బెజవాడ క్రాంతి (10) మరణించారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలం ఎన్‌ఆర్ పాలెం గ్రామానికి చెందిన బెజవాడ ధనలక్ష్మి దసరా పండగ నేపథ్యంలో ఉండ్రాజవరం మండలంలోని సత్యవాడ గ్రామంలోని తన పుట్టింటికి దసరా పండగకు తన కుమార్తె జ్యోతి, కుమారుడు క్రాంతిని తీసుకుని బయలుదేరింది.  

ధనలక్ష్మి వదిన కోమటి రాజేశ్వరి తన కుమారుడు అశ్వంత్‌ను మార్టేరులో ఉంటున్న తన పినతల్లి ఇంటినుంచి సత్యవాడలోని తన ఇంటికి తీసుకొస్తోంది. వారంతా అనుకోకుండా తణుకులో తారసపడ్డారు. అందరూ కలసి ఒకే ఆటోలో బయలుదేరారు. ఆటో వడ్లూరు గ్రామానికి వచ్చేసరికి అదుపుతప్పి అత్తిలి కాలువలో బోల్తా పడింది. ప్రమాదంలో ధనలక్ష్మి కుమారుడు క్రాంతి, రాజేశ్వరి కుమారుడు అశ్వంత్ అక్కడికక్కడే మరణించారు. కొనఊపిరితో ఉన్న ధనలక్ష్మి కుమార్తె జ్యోతిని ఉండగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement