– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్సిటీ): తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు ఏర్పడి రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ మాటతప్పినా..సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాష్ట్ర భవిష్యత్తును సీఎం తాకట్టుపెట్టారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఏపీకి మోసం చేశాయని విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా సాధనకు కంకణం కట్టుకున్నారని, ఆయన పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నామని, అన్నివర్గాలూ సహకరించాలని కోరారు . వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు.