సదాశివపేట, న్యూస్లైన్: తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బెదిరిస్తున్న సమైక్యవాది, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించి, రాజకీయంగా గోరికట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి చింత ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను సమైక్యవాదినని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని, తెలంగాణ ఏర్పాటైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సోనియాగాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డి సన్యాసం ఎందుకు తీసుకోవడం లేదని చింత ప్రభాకర్ ప్రశ్నించారు. తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ప్రగల్భాలు పలుకుతున్న జగ్గారెడ్డి పోలింగ్ బూత్లను దౌర్జన్యంగా హస్తగతం చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయనను గెలిపించి చట్టసభలకు పంపితే రౌడీగా, సీమాంధ్ర ఫ్యాక్షనిస్టుగా ప్రవర్తించడమేమిటన్నారు.
ఆయనను సీమాంధ్రకు తరిమివేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఓటమి భయంతో జగ్గారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు నిరంతరం ఉద్యమం నడిపిందని, దాని ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సత్యనారాయణ, యువత అధ్యక్షుడు విరేశం, నాయకులు సుకుమార్, చిన్న, ప్రవీణ్గౌడ్, కలీమ్, చిన్న, గౌస్మియా, ఫయాజ్ పాల్గొన్నారు.