ఇద్దరు విద్యార్థుల దుర్మరణం | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Published Thu, Sep 15 2016 12:07 AM

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం - Sakshi

    సిండికేట్‌నగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం
    మృత్యువులోనూ వీడని స్నేహబంధం
    మరో ఏడుగురికి గాయాలు


అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం మండలం సిండికేట్‌నగర్‌ సమీపాన బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. సిండికేట్‌నగర్‌ వైపు నుంచి నగరంలోకి వస్తున్న ద్విచక్రవాహనం, రాచానపల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నగరంలోని అజాద్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ మారెన్న కుమారుడు మహేష్‌(20), ఇందిరానగర్‌కు చెందిన నాగరాజు కుమారుడు హేమంత్‌(21) అక్కడికక్కడే వృతి చెందారు. ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న గౌస్‌(ఆజాద్‌నగర్‌), ఆటోడ్రైవర్‌ విజయ్‌(రాచానపల్లి), ప్రయాణికులు ఆది (జ్యోతిబసుకాలనీ), హబీబ్‌(రాచానపల్లి), సూరి (దర్గాకాలనీ), రవిశంకర్‌రెడ్డి (సంగమేశ్వరనగర్‌), మధు(రాచానపల్లి) తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో మధు, ఆది, విజయ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరుకు పంపించారు.

వృత్యువులోనూ వీడని బంధం
మహేష్, హేమంత్‌ ఇద్దరూ మంచి స్నేహితులు. మహేష్‌ నలంద కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. హేమంత్‌ అనంతలక్ష్మి కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. ఎక్కడికి వెల్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. ఇటీవల మహేష్‌ యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌ కొన్నాడు. బుధవారం సాయంత్రం సిండికేట్‌నగర్‌లో మరో స్నేహితున్ని పలకరించేందుకు గౌస్‌ను వెంటబెట్టుకొని వెళ్లారు. అనంతరం నగరంలోకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement