Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Published Wed, Nov 23 2016 12:51 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

ఎస్‌.ఉప్పరపల్లె(రైల్వేకోడూరు రూరల్‌): తిరుమలకు వెళ్లి కలియుగం ధైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్యులు దుర్మరణం చెందారు.  రైల్వేకోడూరు మండలం ఎస్‌.ఉప్పరపల్లె వద్ద మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్‌ మానస, ఆమె భర్త కళ్యాణ్‌( చిన్న పిల్లల డాక్టర్‌) వీరి బంధువులు సురేష్‌ బాబు(58), జగదీష్‌(60)లు ఏపీ 09 బీఆర్‌ 7236 నెంబరు గల కారులో తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో రైల్వేకోడూరు మండలం ఎస్‌.ఉప్పరపల్లె వద్ద కడప–తిరుపతి జాతీయ రహదారిపై కోడూరు నుంచి తిరుపతి వైపు బజాజ్‌ ఆటోల లోడుతో వెళుతున్న  ఏపీ 29 టీఏ 7502 నెంబరు గల లారీ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొంది. ఈ సంఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న డాక్టర్‌ మానసకు కుడి కన్నుకు,, కుడి కాలుకు తీవ్ర గాయమైంది. కారు నడుపుతున్న ఆమె భర్త కళ్యాణ్‌ తలకు గాయమైంది. అందులో ఉన్న సురేష్‌ బాబు, జగదీష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు వెంటనే 108కు ఫోన్‌చేసి, కారులో ఇరుక్కు పోయిన వారిని తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. మానస, కళ్యాణ్‌ను 108లో కోడూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా మెరుగైన వైద్యం కోసం 108లో తిరుపతికి తరలించారు. మృతులిద్దరూ డాక్టర్లే నని, హైదరాబాద్‌లో ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలిసింది. గాయపడిన మానస  వైఎసార్‌ జిల్లా మైదుకూరుకు చెందిన డాక్టర్‌ పార్వతి కుమార్తె. గుంటూరుకు చెందిన కళ్యాణ్‌ను వివాహం చేకుసుకున్నారు.  దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ భక్తవత్సలం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి «దర్యాప్తు చేస్తున్నారు.  


 

Advertisement
Advertisement