వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Published Sat, Jul 30 2016 9:00 PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి - Sakshi

కొలనుపాక(ఆలేరు)
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్‌(ఎం) మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన కొందరు భవన నిర్మాణ కార్మికులైన ఆరుగురు మహిళలు రాజాపేట మండలం సోమారంలో స్లాబ్‌ వేసేందుకు పని నిమిత్తం ట్రాలీ ఆటోలో బయల్దేరారు. అయితే ట్రాలీ ఆటోకు మిల్లర్‌ను కట్టారు. డ్రైవర్‌ ఆటోను వేగంగా నడుపుతుండడంతో కొలనుపాకలోని జైనదేవాలయం వద్ద మిల్లర్‌ ఊడిపోయి ఓ స్తంభానికి తాకి ఆటోకు తగిలింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పొల్కంపల్లి లక్ష్మినర్సమ్మ(51) అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రేగు సరిత తలకు తీవ్ర గాయమై  పరిస్థితి విషమంగా  మారింది. మరో ఇద్దరు ఎడవల్లి లక్ష్మి, కాలె వినోదలకు కూడా గాయపడ్డారు. రేగు సరితను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగత ఇద్దరిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నర్సింహులు తెలిపారు. 
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన విప్‌ 
మండలంలోని కొలనుపాకలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన పొల్కంపల్లి లక్ష్మినర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత పరామర్శించారు. ఆమె వెంట ఎంపీపీ గడ్డమీది స్వప్న, కర్రె వెంకటయ్య తదితరులున్నారు.
బైక్, టాటాఎస్‌ ఢీకొట్టుకోవడంతో..
ఆత్మకూరు(ఎం):
తుర్కల రేపాక గ్రామానికి చెందిన మూల రాజు(23) వదిన సంతోష హైదరాబాద్‌లో ఉంటుంది. శనివారం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి రావడం కోసం కప్రాయపెల్లి స్టేజీ వద్ద బస్సు దిగింది. దీంతో వదినను తీసుకరావడానికి రాజు బైక్‌పై తుర్కల రేపాక నుంచి కప్రాయపెల్లి స్టేజీ వద్దకు వెళ్లాడు.  అక్కడి నుంచి బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న టాటాఏస్‌ వాహనం ఢీకొనడంతో రాజు, సంతోషకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజు మృతిచెందాడు.  గ్రామ సర్పంచ్‌ జక్కు ఉర్మిళాసోంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 
 
 
 

Advertisement
Advertisement