కల్లు తాగించి చోరీలు చేస్తున్న కి‘లేడీ’లు | Sakshi
Sakshi News home page

కల్లు తాగించి చోరీలు చేస్తున్న కి‘లేడీ’లు

Published Mon, Apr 25 2016 10:17 PM

Two women arrested for theft

► ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన ఆర్‌జీఐఏ పోలీసులు
► ఐదు తులాల బంగారం స్వాధీనం

శంషాబాద్(రంగారెడ్డి జిల్లా):
ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలకు కల్లు తాగించి వారు మత్తులోకి జారుకున్న తర్వాత బంగారం చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆర్‌జీఐఏ క్రైమ్ డీఐ జావిద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హుమాయున్‌నగర్ ప్రాంతానికి చెందిన అరుణాబాయి(50) రేఖాబాయి(50) నిత్యం శంషాబాద్ పట్టణంలోని కంపౌండ్‌లో కల్లు తాగడానికి వస్తుంటారు. కంపౌండ్‌లో ఒంటరిగా కల్లు తాగుతున్న వృద్ధులైన మహిళలను ఎంచుకుంటారు. వారితో మాటలు కలిపి బాగా కల్లు తాగించి స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆ తర్వాత వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను తీసుకుని పరారవుతుంటారు.

రెండు నెలలుగా శంషాబాద్ పట్టణంలో జరిగిన రెండు సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం కల్లు కంపౌండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన అరుణాబాయి, రేఖాబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన నేరాలను అంగీకరించారు. వీరి నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండేళ్ల కిందట కూడా వీరు ఇదే కల్లుకంపౌండ్‌లో చేసిన నేరాలకు జైలుకు వెళ్లి వచ్చారు. అయినా తీరు మారలేదు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement