యూజీడీ... ట్రాజెడీ | Sakshi
Sakshi News home page

యూజీడీ... ట్రాజెడీ

Published Tue, Jul 19 2016 10:12 PM

యూజీడీ... ట్రాజెడీ

– ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు
– నిధుల విడుదలకు ఆసక్తి చూపని ప్రభుత్వం
– పట్టించుకోని పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు
– అవస్థలు పడుతున్న జనం

 

కడప కార్పొరేషన్‌:
 కడప నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి.యూజీడీ(అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) పనుల్లో ఏర్పడిన లోపాలు, అసంపూర్తి నిర్మాణాల వల్ల నగర వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూజీడీ పథకం డీపీఆర్‌(డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌)లో
పగులగొట్టిన రోడ్లను మరమ్మతులు చేసేందుకు వ్యయం కనబరచకపోవడంతో ఈ పథకం తీవ్ర విమర్శలపాలైంది. అధికారుల పర్యవేక్షణ లేక చాలా చోట్ల పైపులకు మధ్య కనెక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడక్కడా యూజీడీకి ఇండ్లనుంచి కనెక్షన్లు ఇచ్చుకోవడంతో పనులు అసంపూర్తిగా ఉన్నచోట ఆ మురికినీరంతా మ్యాన్‌హోల్స్‌ ద్వారా ఉప్పొంగి రహదారులపైకి వస్తోంది. రూ.108 కోట్లకు పరిపాలనా అనుమతులు వచ్చినా...
రూ.72 కోట్లతో యూజీడీ పనులు మొదలుపెట్టినప్పటికీ  ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు  
పంపగా ప్రభుత్వం మొత్తం రూ.108 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఈమేరకు ఇంకా రూ.36 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే అన్ని నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 1,2 జోన్లలో ఎస్‌టీపీ, ట్రంప్‌మైన్స్‌ నిర్మాణం, 19 కీ.మీల మేర రోడ్లను
పునరుద్ధరించడానికి పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు రూ.29.20కోట్లతో అంచనాలు  పంపారు. అలాగే 3,4జోన్లలో 9.56 కీ.మీలు ఉన్న అంతరాలు(గ్యాప్స్‌)ను సరిదిద్దడానికి రూ.4.80 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటికి కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది.

కొత్త ఏజెన్సీ వచ్చేదెప్పుడు... ఇక్కట్లు తీరేదెప్పుడు..?
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో కడపను 4 జోన్లుగా విభజించారు. మొత్తం 312కీ.మీల మేర యూజీడీ పనులు చేయాలని నిర్ణయించగా ప్రస్తుతం 286కీ.మీలు పూర్తి అయ్యింది. ఇందులో 3,4 జోన్లలో యూజీడీ పనులు దాదాపు పూర్తి అయి 16 ఎకరాలలో మురుగునీటి శుద్ది కేంద్రం (సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్‌టీపీ)కూడా పూర్తయ్యింది. 1,2 జోన్లలో పనులు జరిగినా అక్కడ ఎస్‌టీపీకి స్థల సేకరణ సమస్య రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బుగ్గవంక చివర గూడూరు గ్రామపొలంలో 2.47ఎకరాలలో ఎస్‌టీపీ నిర్మాణానికి స్థలసేకరణ పూర్తయింది. ఈ ఫైల్‌ ఆర్డీఓ వద్ద ఈ పెండింగులో ఉన్నట్లు తెలిసింది. యూజీడీ పనులు నిర్వహించి ఐదేళ్లు పూర్తి కావడంతో పనులు చేసిన సంస్థను పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు టెర్మినేట్‌ చేశారు. ప్రస్తుతం పనుల నిర్వహణకు పబ్లిక్‌ హెల్త్‌ అధికారుల వద్ద ఏ ఏజెన్సీ లేదు. మ్యాన్‌హోళ్లపై వేయడానికి మూతలుగానీ, వేయడానికి సిబ్బందిగానీ వారి వద్ద లేనట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు పంపిన అంచానాలకు అనుమతులు వచ్చి కొత్త ఏజెన్సీని
నియమిస్తే తప్పా నగరవాసులకు ఈ అవస్థలు తప్పేట్లు కనిపించడం లేదు.

– కడపలో నాలుగు
జోన్లు కలిపి 11,450 మ్యాన్‌హోళ్లు, 13,350 ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించాల్సి ఉండగా 10,195 మ్యాన్‌హోళ్లు, 12,495 ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు పూర్తి అయ్యాయి. కాగా సిమెంటు మూతలు నాణ్యత సరిగా లేక 40 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. మరికొన్నింటిపై మూతలే
లేకపోవడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఆర్టీసీరీజనల్‌ మేనేజర్‌ కార్యాలయం సమీపంలో మ్యాన్‌హోళ్లు దెబ్బతిని ఏడాదిపైనే అయ్యింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం తటాకాన్ని తలపించే రీతిలో ఉంటుంది. వాననీటిని బయటికి పంపేందుకు ఇక్కడి మ్యాన్‌హోళ్లను తెరవడం  ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో మ్యాన్‌హోల్‌ తెరిచి ఉందనే విషయం తెలియక వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
– ఎన్‌జీఓ కాలనీలోని రత్న సభాపతి వీధిలో ఇటీవల సిమెంటు రోడ్డు నిర్మించారు. కానీ యూజీడీ ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లను మాత్రం అలాగే వదిలేయడంతో అవి ప్రమాదకరంగా ఉన్నాయి.  ఓంశాంతినగర్‌లో ఇటీవల నగరపాలక అధికారులు వేసిన పైపులు నెలరోజులైనా కాకమునుపే పగిలిపోయి బొరియలు ఏర్పడ్డాయి. ఇక్కడ పలు మ్యాన్‌హోళ్లనుంచి మురికినీరు ఉబికి వస్తోంది.  
నగర శివార్లలోని ఆర్టీసీ కాలనీ వెనుక ఉన్న బహుజన నగర్‌లో ఇదే పరిస్థితి.

రెండు నెలల్లో పూర్తి చేస్తాం : పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ
భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి తాము పంపిన ప్రతిపాదనలకు ఎస్‌ఈ అభ్యంతరాలు లేవనెత్తగా వాటిని నివృత్తి చేశామని పబ్లిక్‌ హెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శివనాగేంద్ర తెలిపారు. అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టి అన్ని గ్యాప్స్‌ పూర్తి చేస్తామని
చెప్పారు. ఇందుకు రెండు నెలలు సమయం పట్టవచ్చని తెలపారు.
 

Advertisement
Advertisement