విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ నాయకులు దొంగ నాటకాలాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆదివారం విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద విద్యార్థులు రహదారిని దిగ్బంధించి విశాలాంధ్ర మహాసభ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారిస్తున్న తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక పాకేజీ వద్దు ప్రత్యేక హోదానే ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తమకు బాధ కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకుండా శాంతియుతంగా పోరాడాలని ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు ప్రజలకు సూచించారు. విద్యార్థులు ఆందోళనతో కోట జంక్షన్ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.