విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందని టీడీపీకి భయం పట్టుకుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అందుకే పోలవరం ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగడం లేదని ఆయన విమర్శించారు.బీజేపీతో కలిసి ఉండటం ఇష్టంలేకపోతే నేరుగా చెప్పాలని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. గురువారం విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబును చూసి మోదీ భయపడుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలవి తప్పుడు ఆరోపణలు అని అన్నారు. ప్రత్యేక హోదా సంజీవిని అన్నది మీరు కాదా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. లోటు బడ్జెట్ ఉందంటున్న చంద్రబాబు ... ప్రత్యేక విమానాల పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.