జల జగడం | Sakshi
Sakshi News home page

జల జగడం

Published Wed, Feb 22 2017 12:11 AM

జల జగడం - Sakshi

- కృష్ణా జలాలను తరలించేందుకు వైఎస్సాఆర్‌ కడప జిల్లా రైతుల యత్నం
- అడ్డుకున్న యల్లనూరు రైతులు

యల్లనూరు : నీటి కోసం అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల రైతుల మధ్య వివాదం రాజుకుంది. గండికోట ఎత్తి పోతల పథకం నుంచి యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువుల ద్వారా గోడ్డుమర్రి ఆనకట్ట మీదుగా కృష్ణా జలాలను పార్నపల్లి రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువులకు పంపింగ్‌ చేస్తున్నారు. అయితే గోడ్డుమర్రి ఆనకట్ట పనులతో పాటు పంప్‌ హౌస్‌ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీటిని గడ్డంవారిపల్లి చెరువు నుంచి చిత్రావతి నదికి మళ్లించారు.

అయితే వైఎస్‌ఆర్‌ జిల్లా ఆర్‌ఎస్‌ కొండాపురం మండలంలోని రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామల రైతులు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న చిత్రావతి నదిలోకి నీటిని మళ్లించుకునేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. యల్లనూరు చెరువు తూముకు అడ్డుగా ఇసుక మూటలను వేయడంపై వివాదం చెలరేగింది. నీటిని మళ్లించడం కోసం ప్రయత్నించారని తెలుసుకున్న యల్లనూరు రైతులు మంగళవారం ఉదయం ఇసుక మూటలను తొలగించారు. అధికారులు తమకు హామీ ఇచ్చారంటూ రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామాల రైతులు పోలీసుల సహకారంతో మరోమారు యల్లనూరు చెరువు వద్ద  నీటిని వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని మంగళవారం ప్రయత్నించారు.

విషయం తెలుసుకున్న యల్లనూరు మండల ప్రజలు చెరువు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తాడిపత్రి రూరల్‌ సీఐ సురేంద్రనా«ధ్‌రెడ్డి, డీఈ ఆనందరావు అక్కడి చెరుకోని యల్లనూరు మండల రైతులతో చర్చించారు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement