మేల్కోకపోతే ముప్పే | Sakshi
Sakshi News home page

మేల్కోకపోతే ముప్పే

Published Fri, Aug 19 2016 12:52 AM

మేల్కోకపోతే ముప్పే

→  సీబీఆర్‌లో డెడ్‌స్టోరేజీకి పడిపోయిన నీటిమట్టం
→ మూడు మున్సిపాలిటీలు.. వేలాది గ్రామాలకు తాగునీటి కష్టాలు


చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌     (సీబీఆర్‌)... ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలతోపాటు సత్యసాయివాటర్‌ సప్లైపాజెక్ట్, వైఎస్సార్‌ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్‌కు నీరందించే ప్రధాన రిజర్వాయర్‌. కానీ ఈ రిజర్వాయర్‌లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతూ డెడ్‌స్టోరేజీకి చేరుతోంది. ఇదిలాగే కొనసాగితే మూడు మున్సిపాలిటీలు..వేలాది గ్రామాల వారు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

«ధర్మవరం/ తాడిమర్రి : ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండల సరిహద్దు, వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై 1993లో సీబీఆర్‌ను నిర్మించారు. ఇటు అనంతపురం, అటు వైఎస్సార్‌ జిల్లాలకు తాగునీరు, సాగునీరు సౌకర్యాల కోసం 10 టీఎంసీల సామర్థ్యంతో ఈ డ్యాంను నిర్మించారు. అయితే పనులు నాసిరకంగా ఉండడంతో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పనులను నిలుపుదల చేశారు. 1999లో అప్పటి వరకు చేసిన పనులను తొలగించి తిరిగి మొదటి నుంచీ పనులను చేయడానికి రూ. 93.87 కోట్లు వ్యయాన్ని విడుదల చేశారు.

2004లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే అదనంగా రూ.50 కోట్లు విడుదల చేయించి 2006లో నిర్మాణం పూర్తి చేయించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి సమీపంలో 6 టీఎంసీల లక్ష్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అక్కడ నుంచి యల్లనూరు మండలం, వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం, పులివెందుల, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఆర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, శానిటేషన్‌ శాఖలు సంయుక్తంగా పులివెందుల, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలతో పాటు ఆ నియోజకవర్గాల్లోని గ్రామాలకు తాగునీటిని సరఫరా కోసం పంపు హౌస్‌లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు వైఎస్సార్‌ జిల్లా తుమ్మల దగ్గర ఏర్పాటు చేసిన యురేనియం ఫ్యాక్టరీకి నీటిని అందించడానికి మరో పంపును ఏర్పాటు చేశారు.

వర్షాలు లేక.. సీబీఆర్‌లోకి నీరు చేరక : కొంతకాలంగా వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో సీబీఆర్‌లోకి నీరు చేరకపోవడంతో ఉన్న నీరు అడుగంటిపోతోంది. నెల రోజుల క్రితం 284.81 మీటర్ల మేర 0.87 టీఎంసీలు ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 284.31 మీటర్లమేర 0.711 టీఎంసీలకు పడిపోయి  డెడ్‌ స్టోరేజీకి చేరింది. ఫలితంగా సాగు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  
రంగుమారిన నీరు: ఇప్పటికే ధర్మవరం మున్సిపాలిటీలో మూడు రోజులకోసారి వదిలే తాగునీరు ఐదు రోజులకోసారి వదులుతున్నారు. పంప్‌హౌస్‌ల చుట్టూ చేరిన పూడికను జేసీబీలతో తొలగించి..నీటిని మోటార్ల వద్దకు పంపుతున్నారు. దీంతో నీరంతా రంగుమారి సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ  అధికారులు  పట్టణ ప్రజలకు మొదటి హెచ్చరికను చేరవేశారు. పాలకులు అధికారులు పట్టించుకుని చిత్రావతిలోకి నీరు వదలకపోతే లక్షలాది మంది ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోవాల్సి వస్తుంది.  

టీబీ డ్యామ్‌ నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలి
తుంగభద్ర ట్రిబ్యునల్‌ ప్రకారం టీబీ డ్యామ్‌లో 100 టీఎంసీలు ఉంటే 5 టీఎంసీలు విడుదల చేయాలి. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సక్రమంగా కురవక ఏటికేడు డ్యామ్‌లోకి నీరు చేరడం తగ్గుతోంది. దీంతో మనవాటా 2 టీఎంసీలకు కుదించారు. రెండేళ్లుగా కేవలం 1.5 టీఎంసీ నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈఏడాది 3 టీఎంసీలను విడుదల చేయిస్తామని వైఎస్సార్‌ కడప జిల్లా ప్రజా ప్రతినిధులు అంటున్నారు. అలా జరిగితే తాగునీటికి ఇబ్బందులు ఉండక పోవచ్చు.
– జయకుమార్, డీఈ సీబీఆర్, పార్నపల్లి

Advertisement

తప్పక చదవండి

Advertisement