పిఠాపురం టౌన్(తూర్పుగోదావరి): రాష్ట్రంలో ఇసుక మాఫియాను నిరోధించడంలో ప్రభుత్వం విఫలం చెందడం తమ తప్పేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వచ్చిన ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇసుక ధరను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపడుతున్నామని, ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారని అన్నారు.
ఇసుక రీచ్లకు ధర నిర్ణయించి, బహిరంగ వేలం ద్వారా అమ్మకాలు చేయడానికి విధాన నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. దీనివల్ల నష్టపోయే డ్వాక్రా సంఘాలకు కొంత శాతం నిధులు సమకూరుస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం తప్పనిసరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీకి చెందిన ఒకరిద్దరు నేతలు టీడీపీని విమర్శించడం వల్ల పెద్దగా నష్టం ఉండదని, అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, బీజేపీ కలయికను నమ్మి ఓట్లేశారని, దీనిని అందరూ గౌరవించాల్సి ఉందని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు.