'గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఉంటాం' | Sakshi
Sakshi News home page

'గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఉంటాం'

Published Sun, Aug 30 2015 8:49 PM

'గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఉంటాం' - Sakshi

రాజంపేట (వైఎస్సార్ జిల్లా): గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారికి అండగా నిలుస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. పుల్లంపేట మండలం దేవసముద్రానికి చెందిన సంపతి నరసింహులు అనే వ్యక్తి ఇటీవల కువైట్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కుమారుడు మధుకు ఆదివారం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి స్వగృహంలో కువైట్ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం కింద రూ.20వేలు చెక్కును ఎంపీ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గల్ఫ్‌దేశాల్లో రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన వారు మృతి చెందితే చెన్నై నుంచి వారి మృతదేహాలను స్వగ్రామాలకు ఉచితంగా చేర్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జీవనోపాధి కోసం కువైట్, తదితర ప్రాంతాలకు వెళ్లిన వారి సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కువైట్‌లో మృతి చెందినా, ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే కువైట్ వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించి వారికి అండగా ఉంటుండటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement