ఆ యువతి ఎవరు..! | Sakshi
Sakshi News home page

ఆ యువతి ఎవరు..!

Published Mon, Oct 24 2016 12:00 AM

who is the lady

చెన్నూరు: కడప నగర శివారులో ఓ యువతిని ఐదు రోజుల క్రితం దారుణంగా హత్య చేసి, దహనం చేశారు. ఇప్పటి వరకు ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. హంతకులకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించక పోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. పలు విధాలుగా దర్యాప్తు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. హంతకులు పక్కా పథకం ప్రకారం, పకడ్బందీగా ఈ హత్య చేశారు. బుధవారం హత్య జరగ్గా, గురువారం వెలుగులోకి వచ్చింది. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లు ఆనవాళ్ల కోసం పరిశీలన చేసినా ప్రయోజనం లేకపోయింది.
హత్య కాబడ్డ యువతి ఎవ్వరూ ?
చెన్నూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగ్రిగోల్డ్‌ వెంచర్‌లో ఆ యువతి దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లన్నింటికీ హతురాలి వయస్సు (సుమారు 21) ఆధారంగా సమాచారం అందించారు. హంతకులు ఆమె తలపై రాడ్డుతో బలంగా కొట్టి చంపి ఓ వాహనంలో సంఘటనా స్థలానికి తెచ్చి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. జిల్లాతోపాటు పక్క జిల్లాల్లో నెల రోజులుగా కనిపించని యువతులెవరైనా ఉన్నారా అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
హంతుకులెవ్వరో ?
 హంతకులు కరుడు కట్టిన నేరస్తులే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నగరానికి చెందిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యా స్థలాన్ని పరిశీలిస్తే మద్యం సేవించి, నింపాదిగా కాల్చి, ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకొన్నారంటే సామాన్యులతో అయ్యే పని కాదంటున్నారు. పెట్రోల్‌ పోసి అంటించారు కాబట్టి.. సమీపంలోని టోల్‌ ప్లాజా, వాహనాల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న వారికి మంటల వెలుతురు, పొగైనా కనిపించే అవకాశం ఉండవచ్చు. పెట్రోల్‌ బంకుల వద్ద బాటిళ్లలో పెట్రోలు ఎవరు పోయించుకున్నారనే వివరాలిచ్చేందుకు జాప్యం జరుగుతోంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తేనే మిస్టరీని ఛేదించవచ్చు. ఈ విషయంపై చెన్నూరు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ను వివరణ అడగగా.. ఈ కేసుపై ప్రత్యేక దష్టి పెట్టామని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని చెప్పారు.

Advertisement
Advertisement