భర్త కళ‍్లలో కారంకొట్టి నరికి చంపిన భార్య | Sakshi
Sakshi News home page

భర్త కళ‍్లలో కారంకొట్టి నరికి చంపిన భార్య

Published Mon, May 22 2017 11:21 AM

wife killed her husband at Machilipatnam

మచిలీపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతని భార్య కళ్లలో కారం కొట్టి  కత్తితో నరికి చంపేసింది. ఈ సంఘటన మచిలీపట్నం బలరామునిపేటలో జరిగింది. ఆర్‌పేట ఎస్‌ఐ అష్ఫాక్‌ తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నానికి చెందిన పరాట మురళీధర్‌ (42) మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన దివ్యలత 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మురళీధర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. వీరికి వెంకటసాయి శివరామకృష్ణ అనే పదమూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

మురళీధర్‌ మరో మహిళను వివాహం చేసుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని దివ్యలతకు అనుమానం. ఈ విషయంపై భార్య, భర్తలు తరచూ గొడవ పడుతుండేవారు. నెల రోజులుగా వీరి మధ్య వివాదం మరింత రాజుకుంది. ఆదివారం మురళీధర్‌ స్నేహితులు దివ్యలత వద్దకు వచ్చి అతనికి సంబంధించిన ల్యాప్‌టాప్, ఇతర డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. కొంతసేపటికి మురళీధర్‌ తన భార్య వద్దకు వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మురళీధర్‌ తన భార్య, కుమారుడిని చంపేస్తానని బెదిరించాడు.

కళ్లల్లో కారం కొట్టి..
మురళీధర్, దివ్యలత మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగటం, నెల రోజులుగా తనను, తన కుమారుడిని చంపేస్తానని బెదిరిస్తుండటంతో మురళీధర్‌ను హతమార్చేందుకు దివ్యలత పక్కా ప్రణాళిక రూపొందించింది. ఆదివారం తన భర్తతో వాగ్వాదం పెట్టుకుని కళ్లలో కారం కొట్టింది. గదిలోనే ఉన్న కత్తితో అతని మెడపై పలుమార్లు దాడి చేసింది. దీంతో మురళీధర్‌ అక్కడికక్కడే మరణించాడు. తనను, తన కుమారుడిని చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని, భయపడి తానే నరికి చంపేశానని పోలీసుల ఎదుట దివ్యలత అంగీకరించింది. భర్తను భార్య నరికి చంపిన సంఘటన మచిలీపట్నంలో సంచలనం కలిగించింది. దివ్యలత ఒక్కరే ఈ హత్యలో పాల్గొందా?, మరెవరైనా ఉన్నారా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement