లాతరీలో.. అన్నీ మోషాలే.. | Sakshi
Sakshi News home page

లాతరీలో.. అన్నీ మోషాలే..

Published Mon, Apr 10 2017 11:30 PM

wine shops draw issue

  • మద్యం షాపుల లాటరీ మాయాజాలం l
  • సిండికేట్లతో అధికారుల లాలూచీ l
  • అమలాపురంలో నాలుగు షాపుల తీరు గందరగోళం
  •  
    సీసీ కెమెరాలు... ఎంట్రీ పాస్‌లు... గుర్తింపు కార్డులు... టోకెన్లు... నఖశిఖ పర్యంతం తనిఖీలు... పారదర్శకతకు అద్దం పట్టేలా.. సవాలక్ష నిబంధనల నడుమ జిల్లాలో మద్యం షాపులకు నిర్వహించిన లాటరీ విధానం వివాదా స్పదమైంది. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు... కోర్టుల్లో కేసుల వరకూ దారి తీస్తోంది.
     
    అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : 
    కాకినాడలో గత నెల 31న మద్యం షాపుల కేటాయింపునకు నిర్వహించిన ఈ లాటరీ విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని లాటరీలో అడ్డగోలు చర్యల వల్ల షాపులు కోల్పోయిన దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు, బడా సిండికేట్లకు అధికారులు తెరచాటు సహకారం అందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అమలాపురంలో నాలుగు షాపులకు సంబంధించిన లాటరీల్లో కేటాయింపులు వివాదాస్పదం కావడంతో బాధిత దరఖాస్తుదారుల్లో కొందరు జిల్లా కలెక్టర్, ఎక్సైజ్‌ కమిషనర్‌ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. మరికొందరు ఎక్సైజ్‌ అధికారుల చేసిన తప్పిదాలపై కోర్టులను ఆశ్రయించారు. 
    బినామీల రంగప్రవేశం
    అమలాపురంలో నాలుగు షాపుల కేటాయింపులపై చెలరేగిన దుమారంతో జిల్లాలో మి గిలిన ప్రాంతాల్లో కూడా లాటరీ లోపాలు, అధికారుల తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. అమలాపురంలో  190, 191, 192, 193 షాపుల కేటాయింపు వివాదా స్పదం అయిన సంగతి తెలిసిందే. ఒక షాపులో మొదటి దరఖాస్తుదారుడికి లాటరీలో వచ్చినప్పటికీ సంబంధిత సిండికేటర్‌ దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని అధికారుల ముందు నిర్ణీత సమయంలో హాజరు పరచలేకపోయారు.
    మరో షాపునకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని హాజరుపరచి అతనే అసలు వ్యక్తిగా నమ్మించి అతడితో సంతకం పోర్జరీ చేయించారు. 193 షాపునకు ఒకటో దరఖాస్తుదారుడు కాకుండా మరో వ్యక్తి (బినామీ) డ్రాలో పాల్గొన్నాడు. దరఖాస్తులో ఉన్న వ్యక్తి సంతకాన్ని అతడే చేశాడు. 193 షాపులో రెండో దరఖాస్తుదారుడు జవ్వాది వెంకట కృష్ణ నాగేశ్వరరావు ఈ తప్పిదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. 192 షాపు వ్యవహారం కూడా ఇలాంటి వివాదంపైనే కోర్టు వరకూ చేరింది. 
     
    పాటించని నిబంధనలు..
    లాటరీ డ్రా నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత షాపు దరఖాస్తుదారుడు విధిగా హాజరై ఉండాలి. ఈ నిబంధనను అధికారులు కచ్చితంగా పాటించి ఉంటే లేదా ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. లాటరీ డ్రాలో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడికి ఫోటో గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. దరఖాస్తుదారుడికి బదులు మరో వ్యక్తి డ్రాలో పాల్గొని ఫోర్జరీ సంతకం చేయడంపై  ఎక్సైజ్‌ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపుల నిర్వహణలో ఏళ్ల తరబడి బలంగా పాతుకుపోయిన సిండికేటర్లు, ఎక్సైజ్‌ అధికారుల మధ్య ఉన్న సంబంధాలతోనే ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఆ రోజు లాటరీ డ్రా సమయంలో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. లాటరీ డ్రాకు ఎక్సైజ్‌ శాఖ విధించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించి తిరిగి డ్రాలు నిర్వహిస్తే ఆ షాపులు తమకే దక్కుతాయని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు.  
     

Advertisement
Advertisement