- ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, వై. ఐజయ్య
- క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపు
- అట్టహాసంగా రాష్ట్రస్థాయి హ్యండ్బాల్ పోటీలు ప్రారంభం
కర్నూలు(టౌన్):
క్రీడ ఏదైనా నిరంతరం సాధన చేయడం ద్వారా పట్టు సాధించి అందులో రాణించేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఐజయ్య అన్నారు. ఆ దిశగా కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. స్థానిక బి.క్యాంపు క్రీడా మైదానంలో గురువారం ఆంధ్రప్రదేశ్ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల హ్యండ్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, వై. ఐజయ్యకు క్రీడాకారులు గౌరవ వందనం చేసి మార్చ్ ఫాస్టు, క్రీడా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. శారీరక దారుడ్యం, మానసిక ఉల్లాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజకీయ వేత్తల కన్నా క్రీడాకారులుగా రాణిస్తేనే మంచి గుర్తింపు వస్తుందన్నారు. జయాపజయాలను సమంగా స్వీకరించాలని సూచించారు. జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు విజయ్కుమార్, కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి పోటీలను విజయవంతం చేయాల్నారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్గేమ్స్ కార్యదర్శి లక్ష్మినరసయ్య, పీఈటీల సంఘం అధ్యక్షులు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్హుసేన్, పీడీలు డీవీ సుబ్బారెడ్డి, శ్రీధర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో కర్నూలుతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, క్రిష్ణాజిల్లా, ఈస్ట్, వెస్ట్గోదావరి, ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలు పాల్గొన్నాయి. అనంతరం వివిధ జిల్లాల మధ్య పోటీలను నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.