యువతి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

యువతి దారుణ హత్య

Published Sat, Aug 20 2016 1:21 AM

యువతి దారుణ హత్య

 
  •  చంపేసి..ముఖం చెక్కేసి.. 
  • కాలువలో కుక్కేసి జిల్లేడు కొమ్మలతో కప్పేశారు
కోవూరు :  గుర్తు తెలియని ఓ యువతి (30) దారుణ హత్యకు గురైంది. చంపేసి.. ముఖం చెక్కేసి కాలువలో కుక్కేశారు. పైన జిల్లేడు కొమ్మలతో మృతదేహం కనపడకుండా కప్పేశారు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని పడుగుపాడు సమీపంలో సాయి ఎన్‌క్లేవ్‌ లే అవుట్‌లో వెలుగుచూసింది. నిర్మానుష్యమైన ఈ ప్రాంతంలో మృతదేహం పడి ఉండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. శుక్రవారం అటుగా వాకింగ్‌కు వెళ్తున్న కొందరికి సమీపంలో దుర్గంధం రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా యువతి మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్‌ డీఎస్పీ డాక్టర్‌ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ మాధవరావు, ఎస్‌ఐ వెంకట్రావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా దారుణంగా చెక్కేసి ఉంది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండు..మూడు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. మృతురాలు పింక్, గ్రీన్‌ కలర్స్‌ టాప్, పింక కలర్‌ ఫ్యాంట్, వైట్‌ చున్నీ ధరించి ఉంది.
డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు 
యువతి హత్యోదంతాన్ని ఛేదించేందుకు నెల్లూరు నుంచి బిందు అనే జాగిలంతో తనిఖీలు చేపట్టారు. జాగిలం మృతదేహం ఉన్న దగ్గర నుంచి దాదాపు 300 మీటర్లు పరిధిలో జాతీయ రహదారిపైన లే అవుట్‌ పరిసర ప్రాంతాల్లో సంచరించింది. దీన్ని బట్టి పరిశీలిస్తే మృతురాలిని బయట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకు వచ్చి ఎవరికి అనుమానం రాకుండా లే అవుట్‌లో ఉన్న సైడు కాలువలో తొక్కిపెట్టి జిల్లేడు చెట్లు వేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిపై అఘాయిత్యం చేసి అనంతరం హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌ టీం మృతదేహంపై ఉన్న వేలిముద్రలను సేకరించింది. మృతదేహం పరిసర ప్రాంతాల్లో పడి ఉన్న రెండు మద్యం బాటిళ్లు, డిస్పోజల్‌ గ్లాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాతనే ప్రాథమిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.  ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement