చొప్పెల్ల (ఆలమూరు) :
గ్రామానికి చెందిన వివాహిత షేక్ రజియా బేగం (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం స్థానిక దంగేటి వారి వీధిలో షరీఫ్, రజియా బేగం దంపతులు గత కొంత కాలంగా నివాసముంటున్నారు. వివాహమై 15 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడం, అప్పుల బాధ ఎక్కువ ఉండడంతో భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో రజియా బేగం బెడ్ రూమ్లో సోమవారం మృతి చెంది ఉంది. రజియా బేగం మెడపై గాయాలు కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదా హత్యకు గురైందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త షరీఫ్ ఆదివారం రాత్రి నుంచి కనిపంచకపోవడంతో రజియా బేగం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రామచంద్రపురం డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, మండపేట సీఐ వి.పుల్లారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రజియా బేగం తల్లి అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.