అక్కడి వాడు.. ఇక్కడికొచ్చి శవమయ్యాడు! | Sakshi
Sakshi News home page

అక్కడి వాడు.. ఇక్కడికొచ్చి శవమయ్యాడు!

Published Sun, Apr 3 2016 12:55 PM

అక్కడి వాడు.. ఇక్కడికొచ్చి శవమయ్యాడు! - Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం
సింగరాయకొండ సమీపంలో ఘటన..

 సింగరాయకొండ : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన స్థానిక జాతీయ రహదారిపై జీవీఆర్ ఆక్వా కంపెనీ ఎదురుగా ఉన్న ఫ్లయిఓవర్ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. మృతుడు కొత్తపట్నం మండలం రాజుపాలేనికి చెందిన పొక్కలంగారి రవీంద్ర (22). పోలీసుల క థనం ప్రకారం.. రవీంద్ర స్వగ్రామంలో తన తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తుంటాడు. ఈయన కుటుంబానికి రెండు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. ఏం జరిగిందో ఏమోగానీ జీవీఆర్ ఆక్వా కంపెనీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై మృతదేహమై కనిపించాడు.

ఒంగోలు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం రవీంద్ర బైకును ఢీకొని ఉంటుందని, ఆ ప్రమాదంలో ఆయన చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బైకు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. తన కొడుకు రవీంద్ర పొలంలో పని ఉందని చెప్పి వెళ్లాడని మృతుని తండ్రి శ్రీను చెబుతున్నాడు. రాత్రి పొలంలోనే పడుకుంటానన్న కొడుకు.. తెల్లవారే సరికి ఇక్కడ శవమై కనిపించాడని ఆయన విలపించాడు. రవీంద్ర జేబులో ఉన్న రూ.5,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వైవీ రమణయ్య తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement