బాబూ డ్రామాలు కట్టిపెట్టు | Sakshi
Sakshi News home page

బాబూ డ్రామాలు కట్టిపెట్టు

Published Thu, Oct 20 2016 1:48 AM

బాబూ డ్రామాలు కట్టిపెట్టు - Sakshi

- చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది..
- బలవంతపు భూసేకరణ వద్దంటే అభివృద్ధి నిరోధకులు అంటారు
- చంద్రబాబు.. అభివృద్ధి నిరోధకులు మీరా? మేమా?
- ఆక్వా ఫుడ్ పార్క్ బాధితుల సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, భీమవరం: ‘‘అయ్యా.. చంద్రబాబూ మీకు అబద్ధాలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బందరు పోర్టుకు వేల ఎకరాలు భూ సేకరణ చేస్తారు. అమరావతిలో బలవంతంగా భూములు లాక్కుంటారు. భోగాపురం విమానాశ్రయానికి కూడా భూములు బలవంతంగా తీసుకుంటారు. ఇప్పుడు తుందుర్రులో కనీసం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చేసారు. అదేమని ప్రశ్నించే ప్రజలపై హత్యాయత్నం కేసులు పెడతారు, జైళ్లకు పంపుతారు. ప్రజలను భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకుంటారు. ఇది సరైంది కాదని ఎదిరిస్తే అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసారు. చంద్రబాబూ... పచ్చని పొలాలను నాశనంచేసే అభివృద్ధి నిరోధకులు మీరా? మేమా? ఇప్పటికైనా తీరు మార్చుకో. డ్రామాలు కట్టిపెట్టి రాష్ట్రం కోసం పనిచేయడం నేర్చుకో’ అంటూ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా మెగా ఫుడ్ పార్క్ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడతామని వ్యతిరేకిస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి పోలీసు వేధింపులకు దిగడంతో బాధితులకు అండగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తణుకు వెళ్లి అక్కడ సబ్‌జైలులో ఉన్న తుందుర్రుకు చెందిన ఆరేటి సత్యవతిని పరామర్శించి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం తణుకు నుంచి రేలంగి, అత్తిలి, భీమవరం మీదుగా తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. కంసాలి బేతపూడిలో ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులను ఉద్దేశించి మాట్లాడారు.
జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

 ఎన్నికల నుంచి అబద్ధాలే చెబుతున్నారు
 చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం అబద్ధాలు ఆడినట్టే చివరకు ఫ్యాక్టరీ విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నారు. ఎన్నికల సందర్భంలో ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం అప్పులు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు రద్దు చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని అబద్ధాలు చెప్పి ఏ ఒక్కటి సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ఫ్యాక్టరీని ప్రజలు అడ్డుకుంటుంటే మళ్లీ మోసం చేయడానికి పైపులైన్ వేస్తానని అబద్ధాలు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే రూ.20 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చుపెట్టి షెడ్లు వేసుకున్నట్టు చెబుతున్నారు. అలాంటి ప్రైవేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీకి ప్రభుత్వ నిధులతో ఎలా పైపులైన్ వేస్తారు? ఒక పక్కన ఆ ఫ్యాక్టరీ వల్ల జీరో పర్సంట్ కాలుష్యం అని చెబుతున్న చంద్రబాబు ఫ్యాక్టరీ కలుషిత వ్యర్థాలను సముద్రంలోకి పంపించేలా పైపులైన్ వేస్తానని చెబుతున్నారు. అంటే ముడుపుల కోసం ఏ పని చేసేందుకైనా చంద్రబాబు వెనుకాడరు. లేదంటే ప్రజలను మోసం చేయడానికి పైపులైన్ వేస్తానని కొత్త డ్రామాలు అడుతున్నారు. చంద్రబాబు గారూ.. పైపులైన్ డ్రామాలు కట్టిపెట్టండి.

 సీఫుడ్ ఫ్యాక్టరీ కాలుష్యం అని తెలీదా?
 కాలుష్య నియంత్రణ చట్టం సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరీలో ఉంది. ఇది కాలుష్య కారకమని చంద్రబాబు తెలీదా? ఈ ఫ్యాక్టరీలో రోజుకు మూడు వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది? కాలుష్యం ఉందని తెలుసు కాబట్టే పైపులైను పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఫ్యాక్టరీ యజమానులకు పది కిలోమీటర్ల దూరంలోని సముద్రతీరంలో 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత భూమిని ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది.
 
 బాబును నమ్ముకుంటే బంగాళాఖాతమే..!
 పరిశ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయని కొందరు మద్దతిస్తున్నారు. కానీ గ్రామాల మధ్య, పచ్చని పొలాల మధ్య పెడితే... కాలువలు కలుషితం కావడంవల్ల చేను బతకదు, పొలాలు మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు. ఈ విషయమే వారికి వివరించి నచ్చజెప్పా. ఏదైనా ఫ్యాక్టరీని పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదృష్టితో ఉండాలి. ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ఇప్పటికే రూ. 15-20 కోట్లు పెట్టామంటున్నారు. ఈ షెడ్లును ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు. మహా అయితే పునాదులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు. మీరు ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు. ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు. ఊళ్లో 144 సెక్షన్ విధించి, పోలీసులతో నింపేసి యుద్ధవాతావరణం సృష్టించారు. యాజమాన్యం పెద్ద మనసుతో ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తరలించాలని విజ్ఞప్తిచేస్తున్నా. కాదు కూడదని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. ఫ్యాక్టరీని తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తాం. చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ప్రజల అభీష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తాం.
 
 కాలుష్యాన్ని అడ్డుకుంటే జైల్లో పెడతారా?
 తణుకు సబ్‌జైలులో ఆరేటి సత్యవతికి జగన్ పరామర్శ
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల గ్రామాలు కలుషితమవుతాయంటే అరెస్టులు చేస్తారా? పంటలు నాశనమవుతాయని ఆందోళన చేస్తుంటే హత్యాయత్నం చేసులు నమోదు చేస్తారా? ఫ్యాక్టరీ వద్దన్న గ్రామాల్లో 144 సెక్షన్ పెడతారా? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని దుయ్యబట్టారు. గోదావరి ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతూ అరెస్టై 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతిని తణుకు సబ్‌జైల్‌లో కలుసుకుని పరామర్శించారు. పోలీసుల వైఖరిని, అక్కడ ఫ్యాక్టరీ వద్దంటూ జరుగుతున్న పోరాట వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. సత్యవతి చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపి, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత సత్యవతి కూతురు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement