పర్యావరణంపై నిర్లక్ష్యం! | Sakshi
Sakshi News home page

పర్యావరణంపై నిర్లక్ష్యం!

Published Fri, Jun 20 2014 1:05 AM

sheer neglegence over environment

ప్రకృతి పట్ల మనిషి చేసిన అపచారం పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లో పెను విషాదం సంభవించి అప్పుడే ఏడాదైంది. నిరుడు జూన్ 15 కాళరాత్రి మొదలైన కుంభవృష్టి ఆ మర్నాడంతా కొనసాగడంతో ఆ రాష్ట్రంలోని చమోలీ, రుద్రప్రయాగ, ఉత్తరకాశి, పితోర్‌గఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని అనేకానేక నదులు కట్టలు తెంచుకుని జనావాసాలపై విరుచుకుపడ్డాయి. దాదాపు పదివేలమంది మరణించారని జాతీయ విపత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) అంచనావేయగా... 4,251 మంది చనిపోయారని, మరో 1,497 మంది ఆచూకీ లేకుండా పోయారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లినవారితోసహా ఎన్నో రాష్ట్రాల యాత్రికులు న్నారు. యాత్రికులు మాత్రమే కాదు...వీరిపై ఆధారపడి జీవికను వెతుక్కునే స్థానికులు వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విలయంపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. మందా కిని, అలక్‌నందా నదులపై ఉన్న 24 జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్లనే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉన్నదా అనే సంగతిని తేల్చమన్నది. కమిటీలోని మెజారిటీ సభ్యులు ఈ ప్రాజెక్టులన్నిటినీ నిలిపేయవలసిం దేనని అభిప్రాయపడ్డారు. దీనిపై పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పంద నేమిటో ఇంకా తెలియాల్సే ఉన్నది. ఈ ఏడాదికాలంలో బాధిత కుటుం బాలకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా విఫ లమైంది. కానీ, పునర్నిర్మాణం కోసమని వేల కోట్లరూపాయలు ఖర్చు చేశారు. రహదారులు, వంతెనల నిర్మాణం పనులు సాగుతున్నాయి.
 
 కానీ, విషాదమేమంటే ఈ పునర్నిర్మాణమంతా ఎప్పటిలానే పర్యా వరణాన్ని పట్టించుకోకుండా... దానికి వీసమెత్తు విలువీయకుండా సాగుతున్నది. పర్యావరణాన్ని కాపాడాలంటే, దాని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు అవసరమో ఏకరువు పెట్టిన అంశాలన్నీ కాగితాల్లో భద్రంగా ఉండిపోయాయి. వాటిని ఎవరైనా చదివారో లేదో కూడా అనుమానమే. ఈ విలయం మానవ తప్పిదం పర్యవసానమేనని గుర్తించి ఒక్క ఉత్తరాఖండ్‌ను మాత్రమే కాదు... హిమవ న్నగాల సమీపాన ఉండే రాష్ట్రాలన్నిటా ఎక్కడెక్కడ హఠాత్తుగా వర దలు పోటెత్తవచ్చునో అంచనా వేయాలనుకున్నారు. అలాంటి ప్రాంతాల్లో తగిన మార్పులు చేయాలనుకున్నారు. కానీ అవేమీ అమలుకాలేదు. రోడ్ల నిర్మాణం మొదలుకొని జల విద్యుత్తు ప్రాజెక్టుల వరకూ అభివృద్ధి ప్రక్రియలో విజ్ఞానశాస్త్ర భాగస్వామ్యాన్ని పెంచాలను కున్నారు. అందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని నదుల గమనాన్ని అధ్యయనం చేయించారు. నదీ గమనానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్తు ప్రాజెక్టుల గురించిన వివరాలూ రూపొందాయి. అయితే ఆ ప్రాజె క్టులను పూర్తిగా తొలగించడానికి లేదా కనీసం కుదించడానికి పాల కులు అంగీకరించలేదు. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిపు ణులు రెండు కీలకమైన సూచనలు చేశారు. అడ్డూ ఆపూ లేకుండా విస్త రిస్తున్న జల విద్యుత్తు ప్రాజెక్టులకూ, యాత్రికుల కోసమంటూ నిర్మి స్తున్న రహదారుల నిర్మాణానికీ కళ్లెం వేయాలని చెప్పారు. మిగిలిన వాటి సంగతలా ఉంచి ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తలు తీసు కుంటే మరో ప్రమాదాన్ని నివారించడానికి వీలవుతుందని సూచిం చారు. అయితే, జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ఆలోచన ఆగలేదు. యమునా వ్యాలీలో ఈమధ్య ఒక జల విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతి లభించడమే ఇందుకు తార్కాణం. ఉన్నవాటినే తగ్గించాలని చెబు తుంటే కొత్త ప్రాజెక్టులు అవతరిస్తున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్ అనే కాదు... అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసమని నిర్మించే సొరంగాలు, జలాశయాలు నదుల సహజ గమ నాన్ని అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు మొత్తుకున్నా ఫలితం లేదని దీన్నిబట్టి అర్థమవుతుంది.  
 
 పుణ్య క్షేత్రాలనూ, తీర్థాలనూ సందర్శించి పునీతులమవుదామని వచ్చేవారివల్ల ఉత్తరాఖండ్‌కు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తు న్నది. పర్యాటకం అనేది ఇప్పుడక్కడ ప్రధాన ఆదాయ వనరైంది. కానీ అలాంటివారి ప్రాణాలకు పూచీపడేలా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఒక ఘోరకలి జరిగిన తర్వాతనైనా కర్తవ్య నిర్వహ ణపై శ్రద్ధవహించొద్దా? కొత్త జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో ఇంత ఆసక్తి కనబరిచిన ఉత్తరాఖండ్ వాతావరణ స్థితిగతులను అంచ నావేసే రాడార్లను సమకూర్చుకోవడంలో విఫలమైంది. నిరుడు ప్రమా దం సంభవించినప్పుడు కీలకమైన ప్రాంతాల్లో రాడార్లను ఏర్పాటుచే స్తామని, వాతావరణ అధ్యయనానికి అవసరమయ్యే ఇతర యంత్రా లను తెప్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇంతవరకూ వాటి ఆచూకీ లేదు. వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి ఇప్పటికీ న్యూఢిల్లీ, పాటియాలాల్లోని వాతావరణ కేంద్రాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతున్నది. అరణ్యాల విధ్వంసం, కొండలనూ, గుట్టలనూ నా శనం చేయడం, నదుల ప్రవాహాన్ని అడ్డుకోవడం వంటి చర్యలవల్లనే ప్రకృతి కన్నెర్రజేస్తున్నదని చెబుతున్నా అది ప్రభుత్వాల ముందు బధిర శంఖారావమే అవుతున్నది. ఏ నదికైనా అటూ ఇటూ ఉండే 10 కిలో మీటర్ల దూరాన్ని పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా పరిగణించా లన్న నిబంధనలున్నా వాటి అమలును పర్యవేక్షించే నాథుడు లేడు. ఉత్తరాఖండ్ విషాదం నుంచి మనం ఎలాంటి గుణపాఠాలూ నేర్చు కోలేదని అక్కడ సాగుతున్న తంతు నిరూపిస్తున్నది. అక్కడ మాత్రమే కాదు... అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈ విష యంలో జనం చైతన్యవంతమై ప్రభుత్వాలను నిలదీస్తే తప్ప వారిలో మార్పు రాదు. అందుకు అవసరమైన కార్యాచరణే ఉత్తరాఖండ్ మృతులకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది.

Advertisement
Advertisement