కార్మికోద్యమ పితామహుడు పర్సా సత్యనారాయణ | Sakshi
Sakshi News home page

కార్మికోద్యమ పితామహుడు పర్సా సత్యనారాయణ

Published Sat, May 23 2015 1:11 AM

కార్మికోద్యమ పితామహుడు పర్సా సత్యనారాయణ - Sakshi

ఉద్యమాలనే ఊపిరిగా చేసుకుని కార్మికుల హక్కు ల కోసం రాజీలేని పోరాటం చేసిన ఉద్యమ కెరటం నింగికేగింది. కార్మిక ఉద్యమ ధ్రువతారగా వెలిగిన పర్సా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక ఉద్య మం వేళ్లూనడానికి, కార్మికులు తమ హక్కులకోసం ప్రశ్నించే చైతన్యం రావడానికి పర్సా సత్యనారా యణ చేసిన కృషి అనిర్వచనీయం. 1924 జూన్ 2వ తేదీన జన్మించిన పర్సా కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు.

కార్మిక ఉద్యమ వ్యూహలను రూపొందించడంలో దిట్టగా పేరున్న  ఆయన తన జీవితమంతా ఉద్య మాలకే ధారపోసారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన తొలి నాళ్లలోనే  నైజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి  సాయుధ పోరుకు సిద్ధం కావడమే కాకుండా పాల్వంచ ఏరియా దళ కమాండర్‌గా పనిచేసి నిజాం అకృత్యాలపై పోరు సలిపిన నేతగా పేరొందారు. కార్మికులకు ప్రత్యే కంగా సంఘం ఉండాలని, కార్మికుల హక్కుల సాధన నిరంతర పక్రియ అనీ భావించిన పర్సా సి.ఐ.టి.యు. కార్మిక సంఘం వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడిగా నిలిచారు.

శత్రు వుకు తలవంచడం అంటే తెలి యని పర్సా కార్మికుల జీవితాలలో వెలుగు నింప డానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నాడు. ఈక్రమంలోనే సింగ రేణి కార్మికులెదుర్కొంటున్న సమస్య లపై సమర శంఖం పూరించడానికి ఆయన ఆద్యు డిగా నిలిచారు. ఇందుకుగాను పర్సా సింగరేణి కాల రీస్  ఎంపాయిస్ యూనియన్ ను స్దాపించారు. గని కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటా లను ఈ యూనియన్ ద్వారా నిర్వహించారు. కార్మి కులకు మెరుగైన వేతనం ఇప్పించడానికి ఆయన చేసిన కృషి గని కార్మికులు ఇప్పటికీ చెప్పు కుం టారు.

గుంటూరు జిల్లాకు చెందిన పర్సా ఖమ్మం జిల్లా  కొత్తగూడెంలో 1943 లో స్థిరపడ్డారు. ఆయ నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిజాంకు వ్యతిరే కంగా పోరాడుతున్న క్రమంలో అరె స్టయిన పర్సా 2 సార్లు  ఔరం గాబాద్ జైలు గోడలు దూకి తప్పిం చుకున్నాడు. దీంతో పర్సా సత్యనా రాయణ ఉద్యమ కదలికలపై ప్రత్యే క నిఘా పెట్టిన నైజాం సర్కార్ ఆయనను డేంజరస్ ప్రిజనర్‌గా ప్రక టించింది. సాధారణంగా ఖైదీలను ఉంచే చెర సాలలో కాకుండా ఆయనను 6 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తున్న చీకటి చెరసాలలో నెలల తరబడి బంధించింది.

కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన నాటి నుండి కార్మిక శ్రేయస్సు కోసం పాటుబడిన పర్సా 1970 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ర్ట అధ్యక్షుడిగా సుధీర్ఘకాలం పనిచే శారు. అలాగే సిఐటియు అఖిల భారత కమిటీ ఉపా ధ్యక్షుడిగా పనిచేసిన పర్సా దేశంలోని కార్మికచట్టాలు కార్మికులకు ఉపయోగపడేలా ఉద్యమాలు నిర్వహిం చారు. సిపిఎం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన 1962లో పాల్వంచ శాసనసభా నియోజక వర్గంనుంచి ఎంఎల్‌ఏగా గెలుపొందారు.

1984లో ఖమ్మం లోక్‌సభా స్థానం నుండి జలగం వెంగళరా వుపై పోటీచేసి ఓడిపోయారు. సుదీర్ఘకాలం కమ్యూ నిస్ట్ ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన పర్సా కార్మిక పక్షపాతిగానే గుర్తింపు పొందారు. వృద్ధాప్యం దరి చేరినా ఉద్యమాల్లో తన క్రియాశీలతను మాత్రం తగ్గించలేదు. పార్టీ సభలు సమావేశాలు ఎక్కడ ఉన్నా క్రమంతప్పకుండా హజరుకావడం కమ్యూ నిస్ట్ పార్టీపట్ల ఆయనకు గల నిబద్ధతకు నిదర్శనం. 91 సంవత్సరాలపాటు కమ్యూనిస్ట్‌గా జీవించిన పర్సా మే 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూ రులో కుమార్తె ఇంటివద్ద తుది శ్వాస విడిచారు.
 
- పి.రాజారావు
(సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు  మొబైల్: 9441209559)

Advertisement
Advertisement