మాగ్నస్ కార్ల్‌సన్.. ప్రపంచ చెస్ చాంపియన్ | Sakshi
Sakshi News home page

మాగ్నస్ కార్ల్‌సన్.. ప్రపంచ చెస్ చాంపియన్

Published Thu, Jan 2 2014 1:59 PM

Magnus Carlsen World Champion of Chess

 2013- క్రీడలు
 
రంజీల్లో ఎదురులేని ముంబై.. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి నూతన సారథి.. క్రికెట్‌కు సచిన్ గుడ్‌బై.. చెస్ ప్రపంచానికి కొత్త చాంపియన్.. క్రీడ రంగాన్ని ప్రభావితం చేసిన అంశాలు
 
శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే, టీ20)లో కలిపి 400 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
 
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు అందజేసే ‘గోల్డెన్ బాల్’ (ఫిఫా-బాలాన్ డిఓర్) పురస్కారాన్ని వరుసగా నాలుగో సంవత్సరం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గెల్చుకున్నాడు.
 
రంజీట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను ముంబై జట్టు 40వసారి గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే మ్యాచ్‌లో ముంబై ఆటగాడు వసీమ్ జాఫర్ రంజీచరిత్రలో అత్యధిక శతకాలు (32) చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు.
 
భారత్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ క్రికెట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.
 
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ (187 పరుగులు) సాధించాడు. తద్వారా తొలి మ్యాచ్‌లోనే అత్యంతవేగంగా (85 బంతుల్లో) శతకాన్ని సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.
 
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెలుచుకుంది. 81 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. ద్వైపాక్షిక సిరీస్‌లో నాలు గు టెస్ట్ మ్యాచ్‌లను గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.
 
ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది.  పిన్నవయసులో ఈ ఘనత సాధించిన భారతీయ క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది.
 
దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వంద టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
 
ఐపీఎల్ తరహా టెన్నిస్ లీగ్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు మహేశ్ భూపతి శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట నిర్వహించనున్న ఈ టోర్నీకి ప్రపంచ నంబర్‌వన్ నోవక్ జోకోవిచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. పారిస్‌లో 2014 చివర్లో ఈ లీగ్ జరగనుంది.
 
కోల్‌కతాలో మే 26న జరిగిన ఐపీఎల్-6 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ తొలిసారి ఐపీఎల్ విజేతగా  నిలిచింది.
 
ఫ్రెంచ్‌ఓపెన్: పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్) సాధించాడు. పురుషుల విభాగంలో ఒక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  మహిళల సింగిల్స్‌విజేత: సెరెనా విలియమ్స్ (అమెరికా). ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా గుర్తింపు పొందింది.
 
ఇంగ్లండ్ వేదికగా జరిగిన  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ రెండో సారి గెలుచుకుంది.
 
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి జూన్ 28న ముగిసిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది.
 
వింబుల్డన్ 2013 విజేతలు: పురుషుల సింగిల్స్ విజేతగా ఆండీముర్రే (బ్రిటన్), మహిళల సింగిల్స్‌ను మరియన్ బర్తోలీ (ఫ్రాన్స్) కైవసం చేసుకున్నారు.
 
జూలై 10-14 తేదీల్లో జరిగిన యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్టన్ ఎగర్ (98 పరుగులు) రికార్డు సృష్టించాడు.
 
గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 46వ బెయిల్(స్విట్జర్లాండ్) ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో మాస్టర్స్, ర్యాపిడ్ కేటగిరీ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.
 
చైనాలోని గ్వాంగ్‌జులో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.
 
 టీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రీడాకారుడిగా ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 63 బంతుల్లో 156 పరుగులు చేసి ఫించ్ ఈ ఘనత సాధించాడు.
 
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి విజేతగా హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది.
 
ఒలింపిక్స్ క్రీడలు-2020ను నిర్వహించే అవకాశం జపాన్‌కు దక్కింది.
 
2013 యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ై టెటిల్‌నురఫెల్‌నాదల్ (స్పెయిన్) టైటిల్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట కైవసం చేసుకుంది.
 
2012లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందున క్రికెట్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వీరు ఫిక్సింగ్‌కు పాల్పడినందున ఈశిక్ష అమలుచేసింది. వీరితోపాటు రాజస్థాన్ జట్టు మాజీ సభ్యుడు అమిత్‌సింగ్‌పై ఐదేళ్లు, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ త్రివేదిపై ఏడాదిపాటు నిషేధం విధించింది.
 
జాక్వస్ రోగే స్థానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త అధ్యక్షుడిగా జర్మనీకి చెందిన థామస్ బాచ్ ఎన్నికయ్యారు.
 
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీనివాసన్ తిరిగి 2014 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు.
 
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్ పత్రిక ‘2013 స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ అవార్డు లభించింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్ చంద్ (క్రికెట్), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లి (క్రికెట్) ఎంపికయ్యారు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.
 
చాంపియన్స్‌లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
 
వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 52 బంతుల్లో 100 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
 
భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితానికి గుడ్‌బై చెప్పాడు. ముంబైలో వెస్టిండీస్‌తో ఆడిన 200వ టెస్టు ఆయన కెరీర్‌లో చివరి మ్యాచ్. తన ఆటతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన సచిన్ క్రికెట్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తన 40వ ఏట క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే సచిన్‌కు భారతరత్న పురస్కారం లభించడం విశేషం.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి పుణె వారియర్స్‌ను తొలగించారు. ఈ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అక్టోబర్ 26న ప్రకటించింది. ఓవరాల్‌గా ఐపీఎల్ నుంచి తప్పుకున్న మూడో జట్టుగా పుణె పేరు తెచ్చుకుంది. గతంలో వివిధ కారణాల రీత్యా కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్‌పై కూడా వేటు పడింది. దీంతో ఐపీఎల్‌లో ఎనిమిది జట్లే మిగిలాయి.
 
భారత షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. జర్మనీలో మ్యూనిచ్‌లో నవంబర్ 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2003లో అంజలి భగవత్, 2008లో గగన్ నారంగ్ తర్వాత ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారత వ్యక్తిగా హీనా ఘనత సాధించింది.
 
జమైకా స్ప్రింట్ క్రీడాకారులు ఉసేన్ బోల్ట్, షెల్లీ అన్ 2013 సంవత్సరానికి ఐఏఏఎఫ్ పురుషుల, మహిళల వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
 
నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ (22) కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. చెన్నైలో నవంబర్ 21న ముగిసిన పోటీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించాడు.
 
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరానికి ఐసీసీకి చెందిన ఎల్‌జీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ (2010) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత క్రికెటర్ ధోనియే.
 
ప్రపంచకప్ మహిళల కబడ్డీ టైటిల్‌ను భారత్ జట్టు గెలుచుకుంది. జలంధర్‌లో డిసెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది.
 
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2013 సంవత్సరానికి అవార్డులను దుబాయ్‌లో ప్రకటించింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా (సర్ సోబర్‌‌స ట్రోఫీ) టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు మైకేల్ క్లార్‌‌క (ఆస్ట్రేలియా) ను వరించాయి. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: చటేశ్వర్ పుజారా (భారత్). వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: కుమార సంగక్కర (శ్రీ లంక), ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)లను ఎంపికచేసింది. ఎల్‌జీ పీపుల్స్ చాయిస్ అవార్‌‌డను ఎంఎస్ ధోనికి ప్రకటించింది.
 
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ను 2013 సంవత్సరానికి సి.కె.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారంతో బీసీసీఐ గౌరవించింది.
 
భారత్ తరఫున 50 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎంఎస్ ధోని రికార్డు నెలకొల్పాడు.
 
ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ సచిన్ టెండ్కూలర్‌ను ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ గౌరవంతో సత్కరించింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హెడ్ నోమిని జనెట్ యెలెన్, చైనా  అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement