భారత రాజ్యాంగం సర్వోన్నతమైంది, కానీ భారత రాజకీయాలు విచిత్రమైనవి. దీనికి తాజా ఉదాహరణ గత సర్కారు నియమించిన గవర్నర్లను రాజీనామా చేసి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు పంపడం. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అయినంతగా మరేదీ కాలేదు. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ ప్రతినిధిగా పని చేయాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. అయితే కొంత మంది కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను అన్యాయంగా బర్తరఫ్ చేయడం వంటి పరిణామాలతో గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు తరచూ వినపడుతుంటాయి. కానీ రాజ్యాంగపరంగా కీలకమైన ఇటువంటి పదవుల చుట్టూ ఇలాంటి వివాదాలు రావడం ఎంతవరకు సమంజసం?
గవర్నర్ పదవి- రాజ్యాంగ స్థానం:
రాజ్యాంగంలోని ఆరో భాగం (ప్రకరణలు 152 నుంచి 167 వరకు) గవర్నర్ల నియామకం, పదవీ కాలం, అర్హతలు, అధికార విధుల గురించి విస్పష్టంగా పేర్కొంది. గవర్నర్.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అధిపతిగా, వైవిధ్యమైన పాత్ర పోషించాలి.
పదవీ భద్రత- తాజా వివాదం:
ప్రకరణ 155 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. అయితే ప్రకరణ 156 (1) ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో కొనసాగుతారనే అంశం స్పష్టంగా ఉంది. అంటే గవర్నర్లను రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. దీనికి ఎలాంటి ప్రాతిపదిక లేదా ప్రక్రియనుగానీ రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఇలా తొలగించే పద్ధతిని న్యాయ పరిభాషలో డాక్ట్రీన్ ఆఫ్ ప్లెజర్ (ఈౌఛ్టిటజ్ఛీ ౌజ ఞ్ఛ్చటఠట్ఛ) అంటారు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయని, ఇది గవర్నర్లకు వర్తించదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
గతమంతా వివాదాస్పదమే:
తాజా పరిణామం కారణంగా రాజ్భవన్పై రాజకీయ రగడ తారస్థాయికి చేరుకోవడం మొదటిసారేమీ కాదు. అలాగని ఈ తంతు గవర్నర్ పదవికే పరిమితం అనుకుంటే పొరపాటే. కేంద్రంలో అధికారపక్షం మారగానే వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని తప్పుకోమని ఆదేశించడ ం లేదా తప్పించడం సర్వసాధారణమైంది. తమకు అనుకూలమైన వారికి ఉన్నత పదవులను కట్టబెట్టడం పరిపాటైంది. ఈ వ్యవస్థ అమెరికాలో కూడా ఉంది. అక్కడ అధ్యక్షుడు మారగానే వైట్హౌస్లోని పదవుల్లోనూ తమ అనుచరులను నియమించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిని స్పాయిల్ సిస్టమ్ (ఞౌజీ టడట్ట్ఛఝ) అంటారు.
జనతాతో మొదలు:
1977లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం తొలిసారిగా గవర్నర్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అంతకుముందు ఇలాంటి సంప్రదాయం లేదు. అంతమాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి ప్రకారం వ్యవహరించిందని చెప్పలేం. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటం అదే ప్రథమం. జనతా ప్రభుత్వం నెలకొల్పిన ఈ సంప్రదాయాన్ని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రభుత్వం అనుసరించింది.
2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఎన్డీఏ సర్కారు నియమించిన గవర్నర్లు విష్ణుకాంత్ శాస్త్రి (ఉత్తరప్రదేశ్), కైలాసపతిమిశ్రా (గుజరాత్), బాబూ పరమానంద్ (హర్యానా), కేదార్నాథ్ సాహ్న (గోవా)లను తొలగించింది. ఇదే ధోరణిని ప్రస్తుతం కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరావృతం చేస్తూ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర, నాగాలాండ్ గవర్నర్లు తమ పదవుల నుంచి తప్పుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఇలా ఒక్కో సర్కారు కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గవర్నర్..కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ ప్రతినిధిగా పని చేయాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అపకీర్తిని తెచ్చిపెడుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పులు- మార్గదర్శకాలు:
రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికపై గవర్నర్లను తొలగించడాన్ని ప్రశ్నిస్తూ 2010లో బి.పి.సింఘాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పును వెలువరించింది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లేదా ఉద్యోగి కాదని, ప్రభుత్వం మారగానే సరైన కారణం చూపకుండా వారిని తొలగించరాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణ 156 (1)ని ఉటంకిస్తూ ఈ అధికరణ కింద గవర్నర్లను ఎప్పుడైనా తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉన్నా, ఆ అధికరణాన్ని ఏకపక్షంగా, నిర్హేతుకంగా ఉపయోగించరాదని వ్యాఖ్యానించింది. కేంద్రంలో ప్రభుత్వం మారడమనేది గవర్నర్ల తొలగింపునకు ప్రాతిపదిక కారాదు. విచక్షణారహితంగా గవర్నర్లను తొలగిస్తే బాధితులు కోర్టుకెక్కితే, రాష్ట్రపతి నిర్ణయంలోని హేతుబద్ధతను తాము సమీక్షిస్తామని రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మారిన ప్రభుత్వ విధానాలకు, సిద్ధాంతాలలో గవర్నర్లు ఇమడటం లేదనే కారణాలతో తొలగించవచ్చు అనే వాదనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
సమీక్షలు-సర్కారియా కమిషన్ సూచనలు:
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సమగ్రంగా సమీక్షించిన జస్టిస్ సర్కారియా కమిషన్ (1983-1987) గవర్నర్ల నియామకం గురించి కొన్ని కీలక సూచనలు చేసింది. రాజ్యాంగపరంగా గవర్నర్ల నియామకానికి సంబంధించి సాధారణ/ప్రాథమిక అర్హతలైన గొప్ప వ్యక్తిత్వం, సచ్ఛీలత, విధాన పరిపాలనా అనుభవం, ప్రజాసమస్యల పట్ల అవగాహన మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ ప్రాతిపదికన గవర్నర్లుగా నియమితులైన వారు చాలా తక్కువ. తమ నాయక శ్రేణుల్లో అసంతృప్తులుగా ఉన్నవారిని ుజ్జగించడానికో, అవసరార్థం కీలక పదవుల నుంచి తప్పించిన వారికి పునరావాసం కోసమో, తమ తాబేదార్లుగా వ్యవహరించి రిటైరైన వారికో గవర్నర్ పదవులను కట్టబెట్టడం కేంద్రంలో ఉండే అధికార పక్షానికి రివాజైంది. రోశయ్య, షీలా దీక్షిత్, హెచ్.ఆర్.భరద్వాజ్, జేబీ పట్నాయక్, మార్గరెట్అల్వా, కమలాబేణివాల్.. ఇలా అందరూ ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా పనిచేసి పునరావాసంలో భాగంగా గవర్నర్లుగా నియమితులైయ్యారు. ఇలాంటి పరిస్థితిని అరికట్టేందుకు సర్కారియా కమిషన్ తగు సూచనలు చేసింది. వాటిలో ప్రధానమైనవి.
గవర్నర్గా నియమించే వ్యక్తి ఏదో ఒక రంగంలో నిష్ణాతుడై ఉండాలి.తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు.నియమించడానికి ముందు రెండేళ్లు క్రియాశీల రాజకీయల్లో, పార్టీలతో అనుబంధం ఉండరాదు.గవర్నర్ను నియమించే విషయంలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
యూపీఏ ప్రభుత్వం నియమించిన వీరప్పమొయిలీ నేతృత్వంలోని పాలన సంస్కరణల కమిషన్ సైతం ఇవే సూచనలను చేసింది. 1994లో ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కూడా రాజకీయ నేతలకు గవర్నర్ పదవులు పునరావాసంగా మారవద్దని సూచించింది. ఇలా ఎందరు ఎన్ని విధాలుగా పేర్కొన్నా గవర్నర్ల వ్యవస్థలో కొంచెమైనా మారింది లేదు. ఈ సిఫార్సులకు విలువిచ్చిన దాఖలాలు లేవు. ఇందులో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. అన్నీ ఆ తానుముక్కల్లానే వ్యవహరిస్తున్నాయి.
ఎన్నుకునే వ్యవస్థ ప్రత్యామ్నాయ పరిష్కారమా?
సాధారణంగా సమాఖ్య వ్యవస్థలో ముఖ్యంగా అమెరికావంటి దేశంలో గవర్నర్లను ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు. రాజ్యాంగ పరిషత్ ముసాయిదా రాజ్యాంగంలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా గవర్నర్ల ఎంపిక జరగాలని సూచించినప్పటికీ..చివరకు నియమించే పద్ధతివైపు మొగ్గు చూపారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. భారత్లో పార్లమెంటరీ వ్యవస్థ ఉండటం వల్ల గవర్నర్లను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఎంపిక చేసుకోవడం సాధ్యపడదు. ముఖ్యమంత్రి కూడా ఎన్నికైన అధిపతి కాబట్టి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఎక్కువ.
గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటూ, రాష్ట్రంలో రాజ్యాంగపాలన కొనసాగేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా, నిరంతర పరిపాలన కొనసాగేలా తన బాధ్యతలను నిర్వహించాలి. ఈ పరిస్థితుల్లో ఎంపికయ్యే గవర్నర్ల వ్యవస్థ సమంజసం కాదు. అంతేకాకుండా ఎన్నికైన గవర్నర్లు ఏదో ఒక పార్టీకి, సిద్ధాంతానికి చెంది ఉంటారు. అందువల్ల రాజకీయంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవచ్చు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రాంతీయ, వ్యక్తిగత ప్రయోజనాలు, భావోద్వేగాల ప్రభావం ఉంటుంది.
దేశ ఐక్యతకు, సమగ్రతకు, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. దీంతో నియమించే గవర్నర్ల వ్యవస్థను ఎంచుకోవడం జరిగింది.
నియామకంలో నిబద్ధతే పరిష్కారం:
ప్రస్తుత దురవస్థ నుంచి బయటపడాలంటే గవర్నర్ల నియామక పద్ధతిని పూర్తిగా సంస్కరించాలి. నిష్పాక్షికంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించే కార్యదర్శులను ఓ నిపుణుల కమిటీ గుర్తించడం, ఇందులో సర్కారియా కమిషన్ సూచించినట్లుగా ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, పౌర సమాజం నుంచి ఓ నిష్ణాతుడు, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీ సూచించిన ఒక వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఈ తరహా ఏర్పాట్లతోనే భవిష్యత్లో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. రాజకీయ నాయకులు స్వీయ కార్యకలాపాల కోసం మరింత క్రియాశీల అధికార పరిధిని కోరుకుంటారు. విద్యావేత్తల్లో లేదా ఇతర రంగాలకు చెందిన నిపుణులైతే ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తారు అని రాజ్యాంగ సభలో పండిట్ జవహర్లాల్ వ్యక్తీకరించిన అభిప్రాయం అక్షర సత్యం.
గవర్నర్ పాత్ర
గవర్నర్ పదవి కేంద్రంలోని రాష్ట్రపతి పదవిని పోలి ఉంది. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అధిపతిగా రెండు సున్నితమైన, క్లిష్టమైన పాత్రలను నిర్వహిస్తాడు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించేలా చర్యలు తీసుకుంటాడు. అత్యవసర పరిస్థితిలో (ప్రకరణ 356) పాలనలో నిరంతరతను కొనసాగిస్తాడు. రాజ్యాంగపర, సందర్భానుసారం తన విచక్షణాధికారాలను వినియోగించి రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తాడు. అందుకే ఈ పదవిలో నియమించే వ్యక్తికి లౌకిక దృక్పథం, ఔన్నత్యం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉత్తమ లక్షణాలు అనివార్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఇది చాలా అవసరం. లేకపోతే మాజీ ప్రధాని వాజ్పేయి వ్యాఖ్యానించినట్లు గవర్నర్లు దినసరి కూలీలుగా తమ పదవికి భద్రత లేకుండా నిరంతరం అభద్రతతో మెలగాల్సి ఉంటుంది.
గవర్నర్ల నియామకం... రాజకీయ వివాదం
Published Thu, Jun 26 2014 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement