పెద్ద మనుషుల ఒప్పందం | Sakshi
Sakshi News home page

పెద్ద మనుషుల ఒప్పందం

Published Thu, Sep 1 2016 1:00 AM

పెద్ద మనుషుల ఒప్పందం

తెలంగాణ రక్షణలు
 జస్టిస్ ఫజల్ అలీ సారథ్యంలోని రాష్టాల పునర్విభజన కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) సిఫారసుల ప్రకారం.. 1962లో జరిగే ఎన్నికల వరకు తెలంగాణను ‘హైదరాబాద్ రాష్ట్రం’ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలి. ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తెలంగాణను ఆంధ్రాతో విలీనం చేసేందుకు అంగీకరిస్తేనే రెండు రాష్ట్రాలను కలపాలి. అయితే ఈ సిఫారసును పక్కన పెట్టి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణ నేతలపై ఒత్తిడి తెచ్చి రెండు ప్రాంతాల నాయకుల మధ్య ఒప్పందం కుదిరేలా చేశారు. దీన్ని పెద్ద మనుషుల ఒప్పందంగా పేర్కొంటారు. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఈ ఒప్పందం జరిగింది.  ఈ ఒప్పందంపై సంతకం చేసిన నాటి హైదరాబాద్ రాష్ట్ర మంత్రి కె.వి.రంగారెడ్డితన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న అంశాలు...
 
ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో 1956 ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. వీరు కుదుర్చుకున్నదే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న; తెలంగాణ ప్రాంతం నుంచి బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, జె.వి.నర్సింగరావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఏకీకరణ వల్ల ఉత్పన్నమయ్యే వివిధ అంశాలపై చర్చించి కింద పేర్కొన్న విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవి..
 
1రాష్ట్రానికి చెందిన కేంద్ర, సాధారణ పరిపాలనా వ్యయాలను ఉభయ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణ నుంచి లభించే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి. ఈ ఏర్పాటును ఐదేళ్ల తర్వాత సమీక్షించాలి. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కోరితే ఈ ఏర్పాటును మరో ఐదేళ్లు పొడిగించొచ్చు.
 
 2 తెలంగాణ శాసనసభ్యుల నిర్ణయం మేరకు తెలంగాణలో మద్య నిషేధాన్ని అమలుచేయాలి.
 3 తెలంగాణలో విద్యా సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. ఇవి ఆ ప్రాంత విద్యార్థులకే దక్కేలా చూడాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థలతో సహా అన్ని కళాశాలల్లో ప్రవేశాలను తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి లేదా రాష్ర్టం మొత్తం మీద మూడో వంతు ప్రవేశాలను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలి.
 
4 ఏకీకరణ వల్ల తప్పనిసరైనప్పుడు ఉద్యోగాల  రిట్రెంచిమెంటు ఉభయ ప్రాంతాల నిష్పత్తి ప్రకారం జరగాలి.
 
5 ఇకముందు ఉద్యోగాల్లో చేర్చుకోవడం ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై ఉంటుంది.
 
6 తెలంగాణలో పాలన, న్యాయ వ్యవస్థల్లో ఉర్దూ భాషకు ఉన్న హోదాను ఐదేళ్ల పాటు కొనసాగించాలి. తర్వాత ప్రాంతీయ మండలి పరిస్థితిని సమీక్షించి సవరించొచ్చు. ఉద్యోగాల కల్పనలో తెలుగు భాష తెలిసి ఉండాలన్న నిబంధన విధించకూడదు. అయితే ఉద్యోగం పొందిన తర్వాత రెండేళ్లలోగా నిర్ణీత తెలుగు పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావాలి.
 
 7 తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు పొందడానికి నివాస నిబంధనలు రూపొందించాలి. ఉదా: తెలంగాణ ప్రాంతంలో 12 ఏళ్లు నివశించి ఉండాలి.  
 
 8 తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి అధీనంలో ఉండాలి.
 
 తెలంగాణ ప్రాంత అవసరాలు, ఆవశ్యకతల దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి.
 
  10 ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులుంటారు.
 
 తెలంగాణలోని 9 జిల్లాల నుంచి తొమ్మిది మంది శాసనసభ్యులు; శాసనసభ లేదా పార్లమెంట్ నుంచి ఆరుగురు సభ్యులు; శాసనసభ సభ్యులు కాని సభ్యులు ఐదుగురు; వీరిని శాసనసభలోని తెలంగాణ ప్రతినిధులు ఎన్నుకుంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులందరూ ప్రాంతీయ మండలి సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి.. వీరిలో ఎవరు తెలంగాణ ప్రాంతం వారైతే వారు ప్రాంతీయ మండలి అధ్యక్షులుగా ఉంటారు. ఇతర కేబినెట్ మంత్రుల్ని కూడా సమావేశాలకు ఆహ్వానించొచ్చు.
 
 11(అ) ప్రాంతీయ మండలి చట్టబద్ధ సంస్థగా ఉంటుంది. ఆయా అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అధికారం దానికి ఉంటుంది. అలాగే ప్రణాళికా రచన, అభివృద్ధి వ్యవహారాలు, నీటిపారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామికాభివృద్ధి (ఇవన్నీ సాధారణ ప్రణాళికకు సంబంధించినవి), తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలను కూడా ప్రాంతీయ మండలి పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రాంతీయ మండలి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి.
 
 (ఆ) ముందుగా ఏదైనా ఒప్పందం ద్వారా సవరిస్తే మినహా ఈ ఏర్పాటుపై పదేళ్ల తర్వాత సమీక్ష చేస్తారు.
 
  12    మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60%, తెలంగాణ ప్రాంతం నుంచి 40% మందికి స్థానం కల్పించాలి. తెలంగాణ మంత్రుల్లో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం ఉండాలి.
 
 13    ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే.. తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే విధంగా తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆంధ్ర ప్రాంతం వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. కింద పేర్కొన్న శాఖల్లో రెండింటిని తెలంగాణ వారికి ఇవ్వాలి.  
 
 1. హోం శాఖ     2. ఆర్థిక శాఖ    3. రెవెన్యూ శాఖ
 4. ప్రణాళికలు, అభివృద్ధి వ్యవహారాలు
 5. వాణిజ్యం, పరిశ్రమల శాఖ
 
 14 1962 చివరి వరకూ తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోరారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి అభ్యంతరం లేదు.
 
 పైన పేర్కొన్న అంశాలను పెద్ద మనుషుల ఒప్పందంలో అంగీకరించారు.
 
 1956 ఫిబ్రవరి 20న కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా ‘తెలంగాణ రక్షణల’ నోట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బి.ఎన్.దాతర్ 1956 ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదేరోజు ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కూడా సభ్యులకు ఈ నోట్‌ను అందించారు.
 
 నోట్‌లోని అంశాలు
 
 1 ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం మొత్తానికి ఒక శాసనసభ ఉంటుంది. మొత్తం రాష్ట్రానికి అదే చట్టాలు చేస్తుంది. రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. మొత్తం పాలనలో రాష్ర్ట శాసనసభకు బాధ్యత వహిస్తున్న మంత్రి మండలి గవర్నర్‌కు సలహాలిస్తూ సాయపడుతుంది.
 
 2    కొన్ని ప్రత్యేక విషయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సులువుగా నిర్వహించడానికి తెలంగాణను ఒక ప్రాంతంగా పరిగణిస్తారు.
 
   3    తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉంటుంది. తెలంగాణ ప్రాంత మంత్రులతో సహా తెలంగాణ శాసనసభ్యులు అందులో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి అందులో సభ్యులు కాదు.
 
 4 ప్రత్యేక విషయాలకు సంబంధించిన శాసనాలను ప్రాంతీయ సంఘానికి నివేదిస్తారు. అలాగే ప్రత్యేక అంశాలపై శాసనాలు చేయాలని ప్రాంతీయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించొచ్చు.

 5ప్రాంతీయ సంఘం సలహాలను ప్రభుత్వం, రాష్ర్ట శాసనసభ ఆమోదిస్తాయి. అభిప్రాయ భేదాలు తలెత్తితే గవర్నర్‌కు నివేదించాలి. గవర్నర్‌దే తుది నిర్ణయం.
 
 ప్రాంతీయ సంఘం కింది అంశాల్ని పరిశీలిస్తుంది..
 రాష్ర్ట శాసనసభ రూపొందించిన సాధారణ విధానాలు, అభివృద్ధి, ప్రణాళికల వ్యవహారాలు.
 స్థానిక స్వపరిపాలనా వ్యవహారాలు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ల రాజ్యాంగాధికారాలు, ట్రస్టులు, జిల్లా బోర్డులు, స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన ఇతర అంశాలు.
 
 ప్రజారోగ్యం, పారిశుధ్యం, స్థానిక ఆసుపత్రులు.
 ప్రాథమిక, మాధ్యమిక విద్య
 తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలను క్రమబద్ధీకరించడం
 మద్యనిషేధం
 వ్యవసాయ భూముల అమ్మకం
 కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు
వ్యవసాయ సహకార సంఘాలు, అంగళ్లు, సంతలు.
 
నివాస నిబంధనలు:  తెలంగాణ ప్రాంతంలో సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు ఆ ప్రాంతంలో నివసించి ఉండాలనే తాత్కాలిక నిబంధనను రిక్రూట్‌మెంట్‌ల విషయంలో అమలు చేస్తారు. ప్రస్తుత హైదరాబాద్ నిబంధనల ప్రకారం నివాస షరతులకు అనుగుణంగా ఉన్నవారితోనే ఆయా ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
 
 ఉర్దూ భాష స్థాయి: రాష్ర్టంలో పాలన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో ఉర్దూ భాషకు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించేలా భారత ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి.  
 
 కొత్త రాష్ర్టంలో అదనంగా ఉన్న ఉద్యోగాల రిట్రెంచిమెంటు: ఉద్యోగాల్లో ఉన్నవారిని తొలగించాల్సి వస్తుందని, రిట్రెంచిమెంటు అవసరమవుతుందని భారత ప్రభుత్వం భావించడం లేదు. ఎలాంటి వడపోత లేకుండానే హైదరాబాద్ రాష్ర్ట ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ఉద్యోగాల్లోకి సాధ్యమైనంత వరకు చేర్చుకోవాలి. ఒకవేళ రిట్రెంచిమెంటు అవసరమైతే మొత్తం విశాల రాష్ర్ట ఉద్యోగులందరికీ అది ఒకే విధంగా వర్తిస్తుంది.
 
 ఠి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య ఖర్చు పంపిణీ: రాష్ట్రంలోని ఆర్థిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం, శాసన సభల అధికారంలోని వ్యవహారం. అయితే కొత్త రాష్ర్టం ఖర్చుల్ని రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం భరించి తెలంగాణ ఆదాయంలో మిగులును, ఆ ప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అంగీకరించారు. కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం పాటించవచ్చు. ముఖ్యంగా ఈ ఒప్పందం గురించిన అంశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని అమలుపరచాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.
 
 ఈ అంశాలపై అంగీకారం  కుదరలేదు
 1. కొత్త రాష్ట్రానికి పేరు: కొత్త రాష్ర్టం పేరు (ముసాయిదా బిల్లులో ప్రస్తావించినట్లు) ఆంధ్ర తెలంగాణమని ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. సంయుక్త సెలెక్ట్ సంఘం సవరించినట్లు ఆంధ్రప్రదేశ్ అని ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు విన్నవించారు.
 
 2. హైకోర్టు: హైకోర్టు ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉండి.. ఒక బెంచ్ గుంటూరులో ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. గుంటూరులో బెంచ్ అవసరం లేదని.. మొత్తం హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు అన్నారు.
 
 వి. ప్రకాష్
 ప్రెసిడెంట్, ప్రొ॥జయశంకర్
 తెలంగాణ ఆర్ అండ్ డీ సెంటర్

 

Advertisement
Advertisement