వేయిస్తంభాల గుడి నిర్మాత ఎవరు? | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల గుడి నిర్మాత ఎవరు?

Published Sat, Dec 6 2014 11:07 PM

వేయిస్తంభాల గుడి నిర్మాత ఎవరు? - Sakshi

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మధ్యభాగంలో సగర్వంగా కనిపించే స్వాగతద్వారం తెలుగు ప్రజలను మహోన్నతంగా పాలించిన కాకతీయ రాజులను స్ఫురణకు తెస్తుంది.ఏకశిలతో రూపొందించిన ఆ స్వాగత తోరణం కాకతీయుల విజయ చిహ్నం. ఇది ఏకశిల నగర నిర్మాతల పటిష్టమైన, ప్రజారంజక పాలనను ఘనంగా చాటుతోంది. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను సమున్నతంగా నిలబెడుతోంది.

ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థ స్వయం సమృద్ధితో నిలకడగా ఉందంటే దానికి కారణం కాకతీయులు తవ్వించినచెరువులు, కాలువలు, సరస్సులే. నేటికీ తెలుగువారి సామాజిక, ఆర్థిక జీవన విధానంలో కాకతీయుల పాలనా ముద్ర సజీవంగా ఉంది. తెలంగాణలోని ప్రతి పల్ల్లె పచ్చగా ఉండటానికి కారణం కాకతీయులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలోని అనేక శిలలు,  సుందరమైన దేవాలయాలు, వైవిధ్యభరితమైన కళలు కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. నేటికీ ఎందరో కవుల రచనలు, కళాకారుల  గళాల ద్వారా వీరి పాలనా వైభవం కీర్తి పొందుతూనే ఉంది.
 
కాకతీయులు
శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాన్నంతా సమైక్యం చేసి పాలనతో వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటు పడిన రాజులు కాకతీయులు. వీరు భిన్న మతాల మధ్య సఖ్యత నెరపి, తెలుగు ప్రజల ప్రగతికి కృషి చేశారు.  రెడ్డి రాజులు, విజయనగర రాజపాలకులకు మార్గదర్శకులయ్యారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులకు సేనానులుగా పనిచేస్తూ తెలుగు ప్రాంతంలో స్థిరపడ్డారు. తర్వాత తమ బలాన్ని పెంచుకొని తూర్పు చాళుక్యులకు సామంతరాజులుగా వరంగల్ జిల్లాలోని మానుకోట దగ్గరలో ఉన్న ‘కొరివి’ ప్రాంతాన్ని పాలించారు.

కాకతీయుల ప్రస్తావన మొదటిసారిగా తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుని ‘మాగల్లు శాసనం’ (క్రీ.శ. 956)లో ఉంది. ఈ శాసనంలో దానార్ణవుడు తనకు రాష్ట్రకూట సేనాని కాకర్త్యగుండన సహాయం చేశాడని ప్రస్తావించాడు. ఈ కాకర్త్యగుండన రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడి ఆదేశాల మేరకు దానార్ణవునికి సహాయపడ్డాడు. దానార్ణవుని మరణం తర్వాత గుండన స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ కేంద్రంగా పాలించిన ముదిగొండ చాళుక్యులు గుండన స్వతంత్రతను అంగీకరించలేదు.

గుండన వారిని ప్రతిఘటించాడు. పశ్చిమ చాళుక్యులు కూడా గుండన స్వతంత్రతను ఒప్పుకోలేదు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పశ్చిమ చాళుక్యుల సేనాని  ‘విరియాల ఎర్ర భూపతి’ చేతిలో గుండన మరణించాడు. ఇతడి పాలనాకాలం క్రీ.శ. 955 నుంచి 995. ఇతడు పాలించిన ప్రాంతం పశ్చిమ చాళుక్యుల ఆధీనంలోకి వెళ్లింది.

ఆ సమయంలో గుండన కుమారుడైన మొదటి బేతరాజు, ఎర్ర భూపతి భార్య కామసాని సహాయంతో ‘అనమకొండ’ (హన్మకొండ) విషయాన్ని (ప్రాంతం) పశ్చిమ చాళుక్యుల నుంచి పొందాడు. వీరికి సామంతునిగా ఉండి క్రీ.శ. 1000 నుంచి తన పాలనను ప్రారంభించాడు. ఈ వివరాలన్నీ కాకతీయ రాజు గణపతిదేవుని చెల్లెలైన మైలమదేవి వేయించిన బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తున్నాయి.

కాకతీయ వంశ నామం: కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్ననృపుడు. ఇతని పాలనాకాలం క్రీ.శ. 800-815 మధ్య ఉంటుందని బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తోంది. ఈయన ‘కాకతిపురం’ నుంచి పాలన సాగించాడని, అందువల్ల ఈ వంశానికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. కానీ నాడు ‘కాకతి’ అనే నగరం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ‘కాకతి’ అనే దేవిని పూజించడం వల్ల వీరిని కాకతీయులుగా పిలిచారని మరికొందరి అభిప్రాయం. కాకతీయులు మొదట జైనమతాన్ని అవలంభించారు.

ఆ తర్వాత రెండో ప్రోలరాజు కాలంలో సుప్రసిద్ధ శైవమతాచార్యుడైన రామేశ్వర పండితుని సూచన మేరకు శైవ మతాన్ని స్వీకరించారు. తొలి కాకతీయులు ‘కాకతమ్మ’ అనే జైన దేవత విగ్రహాన్ని ప్రతిష్టించిన వరంగల్ పట్టణమే ‘కాకతిపురం’గా ప్రసిద్ధి చెందిందని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం, వినుకొండ వల్లభాచార్యుడి ‘క్రీడాభిరామం’ గ్రంథాల్లోని అంశాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి.
     
కాకతీయ రాజులు - వారి పాలన
మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 - 1030): కాకతీయుల గురించి తెలిపే శాసనాధారాలు మొదటగా బేతరాజు పాలన గురించే వివరిస్తున్నాయి. ఇతడు పశ్చిమ చాళుక్యుల సామంతునిగా అనమకొండ ప్రాంతాన్ని పాలించాడు. నేతవాడి, కొరివి ప్రాంతాలు బేతరాజు పాలనలోనే ఉండేవి. ఇతడు కాకతిపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈ విషయాలన్నీ కాజీపేట శాసనం ద్వారా తెలుస్తున్నాయి.
 
మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1030 - 1075): పశ్చిమ చాళుక్యరాజైన మొదటి సోమేశ్వరుడికి అనుంగు మిత్రుడైన ప్రోలరాజు ‘అనమకొండ’పై పూర్తి అధికారాన్ని సాధించాడు. చక్రకూట రాజులతో జరిగిన యుద్ధాల్లో సోమేశ్వరుడికి ప్రోలరాజు చాలా సహాయపడ్డాడు. కాకతీయుల్లో సొంతంగా నాణేలు ముద్రించుకున్న మొదటి రాజు ప్రోలరాజే. ఇతడికి ‘అరిగజకేసరి’ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజు కాకతీయ రాజుల్లో వ్యవసాయాభివృద్ధికి తొలిసారిగా చెరువులు తవ్వించాడు. ఇతడు ‘జగత్ కేసరి’ అనే చెరువును తవ్వించాడు. పశ్చిమ చాళుక్యులు ఇతడికి అనమకొండపై వంశ పారంపర్య హక్కులు కూడా ఇచ్చారు.
 
రెండో బేతరాజు (క్రీ.శ 1075 - 1108): పశ్చిమ చాళుక్యుల వారసత్వ పోరులో విక్రమాదిత్యుడి పక్షం వహించిన రెండో బేతరాజు ‘విక్రమ చక్రి’, ‘త్రిభువనమల్ల’ అనే బిరుదులు పొందాడు. విక్రమాదిత్యుడి అనుమతితో రెండో బేతరాజు తన సైన్యాధికారైన ‘వైజ్యనుడు’ చేసిన కృషితో ‘సబ్బి’ మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) ఆక్రమించుకున్నాడు. ముదిగొండ (ఖమ్మం) ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాజీపేట శాసనం ఇతడి వీరత్వం గురించి వర్ణిస్తుంది. అనమకొండ ప్రాంతంలో మొదటగా శివాలయాలను కట్టించిన కాకతీయరాజు రెండో బేతరాజు. శైవమతాన్ని ఆదరించిన మొదటి కాకతీయ రాజు కూడా ఇతడే. ఇతని కాలం నుంచే అనమకొండ కాకతీయులకు రాజధాని అయింది.
 
రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157): రెండో ప్రోలరాజు కంటే ముందు దుర్గనృపతి పాలించాడు. ఇతడికి ‘చలమర్తిగండ’ అనే బిరుదు ఉంది. రెండో ప్రోలరాజు కాకతీయ రాజుల్లో మొదటి స్వతంత్ర రాజు. అనమకొండపై పశ్చిమ చాళుక్యుల పెత్తనాన్ని ఎదిరించాడు.  మిగతా చాళుక్య సామంతరాజులనూ ఓడించాడు. వీరిలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పాలకుడు తైలరాజు, నేలకొండపల్లిని పాలించిన గోవిందరాజు, మంథని (కరీంనగర్) పాలకుడు గండరాజు, పోలవలస గిరిజన రాజ్యపాలకుడైన మేడరాజు, వేములవాడ ప్రభువు జగద్దేవుడు ముఖ్యులు.

ఈ విధంగా మొత్తం తెలంగాణా ప్రాంతాన్ని జయించి తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. ఇతడి విజయాల గురించి రుద్రదేవుడు వేయించిన అనమకొండ శాసనం, గణపాంబ వేయించిన గణపవరం శాసనం వివరిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు మండలాలను జయించాలనుకున్న రెండో ప్రోలరాజు అక్కడి పాలకుడైన బోధరాజు (వెలనాటి వంశం) చేతిలో మరణించాడు. ఈ విషయాన్ని ద్రాక్షారామం శాసనం తెలియజేస్తోంది.
 
రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు): క్రీ.శ. 1158 నుంచి 1195 వరకు పాలించాడు. ప్రాంతీయ రాజ్యంగా ఉన్న కాకతీయ రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. వెలనాటి రాజులను ఓడించి ద్రాక్షారామం, శ్రీశైలం, త్రిపురాంతకాలను ఆక్రమించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత దొమ్మరాజును (కరీంనగర్ ప్రాంతరాజు), మైలగిదేవుడు (జగిత్యాల ప్రాంత రాజు)లను ఓడించాడు. తెలంగాణలో పశ్చిమ చాళుక్యుల పాలనను పునఃప్రతిష్ట చేయాలనుకున్న కాలాచూరి బిజ్జలుడు, పోలవలస రాజు మేడరాజుతో కలిసి ప్రణాళిక రచించాడు. అది తెలిసిన రుద్రదేవుడు మేడరాజును ఓడించాడు. (మేడరాజు గోదావరిని దాటి అడవుల్లోకి పారిపోయినట్లుగా చెబుతారు).

అప్పుడు బిజ్జలుడు వెనుకడుగు వేశాడు. రుద్రుడి ఈ విజయ యాత్రల్లో వెల్లకి గంగాధరుడనే మంత్రి పాత్ర గణనీయమైంది. దీనికి ప్రతిఫలంగా గంగాధరున్ని సబ్బి మండలానికి (కరీంనగర్ ప్రాంతం) అధిపతిగా చేశాడు. కాకతీయరాజ్యం తెలంగాణా ప్రాంతం దాటి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన గోదావరి నది, పశ్చిమాన కళ్యాణి, దక్షిణాన రాయలసీమ సరిహద్దుల వరకు విస్తరించింది. క్రీ.శ. 1176 నుంచి 1182 మధ్య కాలంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయంగా రుద్రుడు తన సైన్యాన్ని పంపాడు.

కందూరు పాలకుడైన ఉదయచోళుడిని ఓడించిన రుద్రదేవుడు పానగల్లులో రుద్ర సముద్రం అనే చెరువును తవ్వించాడు. తర్వాత పాలమూరు, ధరణికోట, వెలనాడులోని చాలా ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉన్న యాదవరాజులు, కాకతీయుల మాదిరిగానే స్వతంత్ర రాజులై ‘దేవగిరి’ రాజధానిగా పాలిస్తున్నారు. వీరు కాకతీయుల రాజ్య విస్తరణ భవిష్యత్తులో తమకు ప్రమాదమని భావించారు.

యాదవరాజు జైతుగి (జైత్రపాలుడు) క్రీ.శ. 1195లో కాకతీయ రాజ్యంపై దండెత్తి రుద్రదేవున్ని వధించాడు. కాకతీయ రుద్రుడు మంచి వాస్తు కళాభిమాని. అతడు అనమకొండలో రుద్రేశ్వరాలయాన్ని కట్టించాడు. పక్కనే వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించారు. ప్రసన్న కేశవాలయం వద్ద గంగాచీయ సరస్సును నిర్మించాడు. విశాల సామ్రాజ్యానికి రాజధానిగా అనమకొండ చిన్నదిగా ఉందని ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు స్వయంగా కవి. ఇతడు సంస్కృతంలో ‘నీతిసారం’ గ్రంథాన్ని రచించాడు.

ఇతడు రెండో ప్రోలరాజు విజయాలను తెలుపుతూ క్రీ.శ. 1163లో ‘అచితేంద్ర’ రచించిన అనమకొండ శాసనాన్ని చెక్కించాడు. రుద్రదేవుడికి సంబంధించిన అనేక విషయాలు అనమకొండ శాసనం, గణపతి దేవుడు వేయించిన ఉప్పరపల్లి శాసనం, రుద్రమదేవి వేయించిన మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. రుద్రదేవుడి మరణం తర్వాత అతడి తమ్ముడు మహాదేవుడు అధికారంలోకి వచ్చాడు.
 
మహాదేవుడు (క్రీ.శ. 1195-1199): యాదవరాజు జైతుగీపై పగ తీర్చుకోవడానికి దేవగిరిపై దండయాత్ర చేశాడు. ఇతడు జైతుగీ చేతిలో మరణించాడు. మహాదేవుడి కుమారుడైన గణపతిదేవుడు జైతుగీకి చిక్కి, బందీ అయ్యాడు.  మహాదేవుడికి మైలాంబ, కుదాంబిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మైలాంబదేవి బయ్యారం శాసనాన్ని వేయించారు.
 

Advertisement
Advertisement