ఉనికి కోసం జేసీ అడ్డదారులు! | Sakshi
Sakshi News home page

ఉనికి కోసం జేసీ అడ్డదారులు!

Published Fri, Apr 4 2014 3:17 AM

Became citizens the right to vote freely

తాడిపత్రి, న్యూస్‌లైన్: పౌరులు తమ  ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న అధికారుల మాటలు ఆచరణకు నోచుకోకపోవడంతో తాడిపత్రి ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి మండల పరిధిలోని తలారిచెరువు, ఊరుచింతల గ్రామాల్లో 1340 మంది ఓటర్లు ఉన్నారు.
 
 పాదేశిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయని పక్షంలో వారికి ఓటు హక్కే లేకుండా చేస్తామని జేసీ సోదరులు మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. లేని పక్షంలో ఎవరూ ఓటింగ్‌లో పాల్గొనరాదని హెచ్చరించినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం జేసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు తలారిచెరువు సమీపంలోని పెన్నా సిమెంట్ ప్లాంట్ యాజమాన్యాన్ని కలిసి, ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది టీడీపీకి ఓటు వేసేలా చూడాలని, లేని పక్షంలో వారెవరూ ఓటింగ్‌కు వెళ్లకుండా చూడాలని అన్న ఆదేశించారంటూ చెప్పారు.
 
  పరిధిలో ఉన్న 600 ఓట్లు ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఇవి కీలకంగా మారాయి. సర్పంచ్ ఎన్నికల సమయంలో సైతం ఈ ఓటర్లు ఫ్యాక్టరీ కాంపౌండ్ దాటి బయటకు వెళ్లకుండా గేట్లు మూసేశారు. తమకు అనుకూలంగా ఓటు వేయకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందంటూ కార్మికులు, సిబ్బందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిసింది. వీటికి లొంగని పక్షంలో ఓటింగుకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌తోపాటు ఎస్పీ, కలెక్టర్‌లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
 

Advertisement
Advertisement