చంద్రబాబుది మాయా కూటమి | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది మాయా కూటమి

Published Sat, May 3 2014 1:59 AM

Candrababu magical alliance

- గట్టు రామచంద్రరావు

కృత్తివెన్ను/బంటుమిల్లి, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుది మాయాకూటమి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృత్తివెన్ను, బంటుమిల్లి వచ్చిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న సంగతి ముందే తెలుసని అందుకే బీజేపీతో, పవన్‌కల్యాణ్‌లను కలుపుకొన్నాడన్నారు. తాను ఓడిపోయిన తరువాత నింద వీరిపై మోపడానికే ఇది ముందస్తు ఎత్తుగడని అభివర్ణించారు.

సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కింగ్ అని, తెలంగాణలో కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తుందని చెప్పారు. సీమాంధ్రలో 140 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. పవన్‌కల్యాణ్ సినిమా బుక్కింగ్ లాంటివాడని, ప్రస్తుతం ఆయనను టీడీపీ ఇతరులను దూషించడానికి బుక్ చేసుకుందన్నారు. 32 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలను సీమాంధ్రలో ఒక్క సామాజిక వర్గానికి కేటాయించిన మంచి మనిషిగా జగన్‌ను అభివర్ణించారు.

వైఎస్‌ఆర్ సీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల గుండెలను తాకిందని, ఇప్పటికే ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్నారు. ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి వేదవ్యాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మరింత మెరుగుగా అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలన్నారు. రాబోయే రోజుల్లో జగన్ సారధ్యంలో ఈప్రాంతంలో రెండు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామన్నారు.
 

Advertisement
Advertisement