అమలాపురం, న్యూస్లైన్ :ఇచ్చిన మాటకు కట్టుబడని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాదిగ సామాజికవర్గం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. మాట ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఓడించడంతో పాటు చంద్రబాబు కోనసీమ పర్యటనను అడ్డుకుని తీరుతామని దండోరా నాయకులు హెచ్చరించడం ఈ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాలో మాదిగ సామాజిక వర్గానికి ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తానని ‘మీ కోసం వస్తున్నా’ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సామాజికవర్గం వారు పి.గన్నవరం స్థానంపై ఆశపడ్డారు. తీరా ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి కేటాయించడంతో మాదిగ సామాజికవర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అమలాపురం, రాజోలు రిజర్వ్ స్థానాల్లో కూడా అవకాశం దక్కే పరిస్థితి కనిపించకపోవడంపై వారు మండిపడుతున్నారు.
‘ఇన్నాళ్లూ తమతో పార్టీ పల్లకీ మోయించుకుని, తీరా తాము ఎక్కేసరికి’ సామాజిక సర్దుబాట్ల పేరుతో చేతులు ఎత్తివేయడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము టిక్కెట్ ఆశించిన పి.గన్నవరంలోనే కాకుండా రాజోలు, అమలాపురం నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించి తీరుతామని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే పలుచోట్ల ఆ సామాజికవర్గం నేతలు సమావేశాలు నిర్వహించి.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, టిక్కె ట్ ఆశిస్తున్న వారు కలవరపడుతున్నారు. దండోరా నాయకులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానంగా పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఆ పార్టీపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే స్థానిక పోరులో చతికిలబడ్డ తెలుగుదేశం పార్టీకి దండోరా నాయకుల చేసిన హెచ్చరికలు గుండెల్లో రైళ్లను పరుగెట్టిస్తున్నాయి.
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం
తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న కోనసీమలో నిర్వహించే యాత్రను అడ్డుకుంటామని మాదిగ దండోరా జిల్లా నాయకులు తీర్మానించడం టీడీపీ నాయకులకు మింగుడు పడడంలేదు. దండోరా కోనసీమ అధ్యక్షుడు ఆకుమర్తి ఆశీర్వాదం అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో జిల్లాలోని 4 లక్షల మంది మాదిగలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని దండోరా పెద్దలు పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో మాదిగలను స్వతంత్ర అభ్యర్థులుగా నిలపాలని నిర్ణయించింది. పి.గన్నవరం నియోజకవర్గంలో 25 వేలుంది మాదిగలున్నారని, తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు చూపుతామని నాయకులు హెచ్చరించారు.అలాగే ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మోకాటి నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం అమలాపురంలో జరిగిన కోనసీమ మాదిగ దండోరా సమావేశంలో సైతం చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని నాయకులు నిర్ణయిం చారు. మాదిగలను చిన్నచూపు చూసినందుకు నినసనగా టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని వారు పిలుపునిచ్చారు.