టీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ గాలం? | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ గాలం?

Published Fri, May 9 2014 6:28 PM

టీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ గాలం? - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో తమకు మెజారిటీ సీట్లు రావని అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ ఆంగ్ల ప్రతిక వెల్లడించింది.

ఒకవేళ మెజారిటీకి దగ్గరగా తాము సీట్లు గెల్చుకుంటే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే మంత్రి పదవులు ఇస్తామని ఆశ జూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్... టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ధ్రువీకరించారు. చాలా మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తమ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారని వెల్లడించారు.

దాదాపు 20 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్లో ఉన్నారని పొన్నాల లక్ష్మయ్య చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. వారి పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారని చెబుతున్నారు. అయితే తమ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వచ్చిన కథనంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.

Advertisement
Advertisement