ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్ | Sakshi
Sakshi News home page

ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్

Published Wed, Apr 2 2014 1:25 AM

ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్

* అపార ఖనిజ సంపద తెలంగాణ సొంతం
* పారిశ్రామిక ప్రగతి అన్ని జిల్లాలకూ విస్తరించాలి
* విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చాలి
* జిల్లాల్లోనూ విమానాశ్రయాలు నిర్మించాలి
* అప్పుడే నవతెలంగాణ సాధ్యం

 
 ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు పారిశ్రామిక రంగం.. ముఖ్యంగా వస్తూత్పత్తి రంగం ఆలంబన అవుతుంది. సమాచార సాంకేతికరంగం లాంటి సేవల రంగంలో హైదరాబాద్ విశిష్ట ప్రగతి సాధించింది. దేశంలోనే సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉంది. అయితే సేవల రంగం ఆధునిక ఉపాధి కల్పించినా అది పరిమితం. వస్తూత్పత్తి రంగమే ఉపాధి కల్పించి విస్తృత అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఔషధ పరిశ్రమలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్, మెషీన్‌టూల్స్, ఏరోనాటిక్స్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఆయా రంగాల్లో మరింత ప్రగతి, ఆధునికత సాధించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగాలి.
 
 ముడిపదార్థాలున్నా.. నిస్తేజంగా..
 ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో బొగ్గు గనులు, కొన్ని జిల్లాల్లో సిమెంట్ కర్మాగారాలు, మెదక్ జిల్లాలో మోటారు పరిశ్రమలు, నిజామాబాద్‌లో చక్కెర, బీడీ పరిశ్రమ, ఆదిలాబాద్‌లో జిన్నింగ్ మిల్లులు, నల్లగొండలో బియ్యం మిల్లులు మొదలుగునవి ఉన్నప్పటికీ, ఇతర అనేక పరిశ్రమల ఏర్పాటుకవసరమైన ముడి పదార్థాల లభ్యత తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర, కాగితం, పరిశ్రమల అభివృద్ధికి కూడా విస్తారమైన అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, నల్లగొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు అవకాశాలున్నా నిస్తేజంగా పడిఉన్నాయి. అద్భుత నైపుణ్యం ఉన్న నేతకారులు కళావిహీనులై నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడం నాగరికతకే తలవంపు.
 
యువతను ఊరిస్తున్న ఐటీఐఆర్

 ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీస్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి, నల్లమల అటవీసంపద వివిధ రకాల పరిశ్రమలకు అవకాశాలు ఇస్తున్నాయి. నిజామాబాద్‌లో పసుపు, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో మిర్చి, రంగారెడ్డిలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరీ కల్చర్‌కు ఉన్న అవకాశాలు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయగలవు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లోని టైర్-2, టైర్-3 నగరాలకు సమాచార సాంకేతిక పరిశ్రమను విస్తరించేందుకు అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్) నగర యువతను ఉవ్విళ్లూరిస్తోంది.  
 
మసిబారుతున్న యువత భవిత
 ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగనులు వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చి  జీవి తాలు మార్చాయి. కానీ ఈ గనుల్లో క్రమంగా ఉపాధి తగ్గి పోవడంతో స్థాని క యువత భవిత మసిబారుతోంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ గందరగోళంలో ఉంది. కాబట్టి సమగ్ర పారిశ్రామిక పునరుజ్జీవనాన్నీ, సరికొత్త పారిశ్రామికీకరణ కోసం నవతెలంగాణ ఎదురుచూస్తోంది.
 
ఎన్నెన్నో అవకాశాలు
 తెలంగాణ ఖనిజాల గని. ఆదిలాబాద్  జిల్లాలో మాంగనీసు, ఖమ్మం, వరంగల్  జిల్లాల సరిహద్దులో ఇనుప ఖనిజం, ఉత్తర తెలంగాణలో బొగ్గు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో  బొగ్గు ఆధారిత మీథేన్(సీబీఎం) గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఇంకా గణనీయ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇవికాక చైనా క్లే, గ్రానైట్, స్పటికం, మైకా మొదలుగు నిక్షేపాలు మెదక్, నల్లగొండ లాంటి ఇతర తెలగాణ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామిక ముడి పదార్థాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సుమారు 45శాతం అటవీ సంపద తెలంగాణలోనే ఉంది. దేశంలోని మొత్తం బొగ్గు నిక్షేపాలలో 20శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అంచనా. వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తి పరిశ్రమలతో పాటు బయో టెక్నాలజీ లాంటి విజ్ఞాన ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు  కూడా అవకాశాలు ఎన్నెన్నో.
 
వెక్కిరిస్తున్న విద్యుత్ కొరత
 ముడి పదార్థాలున్నా, మురిపించే అవకాశాలున్నా ఆచరణలోకి రావాలంటే కావలసిందల్లా దార్శనికత గల రాజకీయ నాయకత్వమే. తెలంగాణ  రాష్ట్ర పారిశ్రామికీకరణకు అతిపెద్ద సవాల్ చాలినంత విద్యుత్ లేకపోవడమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ సామర్థ్యం 16,500 మెగావాట్లు. ఇందులో 10,500 మెగావాట్లు సీమాంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగిలిన విద్యుత్‌లో గణనీయమైన భాగం జలవిద్యుత్తే. దీని ఉత్పత్తికి నీటి వనరుల లభ్యత ఎప్పుడూ సమస్యే. విద్యుత్ కొరత పారిశ్రామికీకరణకు ఆటంకంగా మారక తప్పదు. అతి తక్కువ కాలంలో విద్యుత్ లోటునుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అధికారంలోకి రానున్న రాజకీయ నాయకత్వం ప్రణాళికలు రచించి అమలు చేయాలి. సమగ్ర జల విధానాన్ని అమలు చేయడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి, ఉపరితల జలాల వినియోగాన్ని పెంచి తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలి.
 
విమానయానం జిల్లాలకూ విస్తరించాలి
 హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక పారిశ్రామికీకరణకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ర్టంలో ఇతర నగరాలను కూడా  పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటే విమానయానరంగం విస్తరించాలి. ఆదిలాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో ఇప్పటికే విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు అభివృద్ధి కావాలి. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా నూతన పారిశ్రామిక యుగానికి  నవ తెలంగాణలో నాంది పలకాలి.
 - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్

 పొన్నాల లక్ష్మయ్య
 ఖిలాషాపురం, వరంగల్
 గిది మీ ఊరే..!
 
 -   సగం కూలిన ప్రాథమిక పాఠశాల భవనం.. ఆరుబయట చదువులు
 -    విద్య, వైద్యం, మంచినీటికి ఇబ్బందులు
 -    అద్దె ఇంట్లో ఆరోగ్య ఉపకేంద్రం
 -   వ్యవసాయ పరికరాలు నిల్వచేసుకునే స్థలంగా గ్రంథాలయ భవనం
 -    కంకరతేలి భయపెడుతున్న రోడ్లు
-    చెంతనే అశ్వరావుపల్లి రిజర్వాయర్ ఉన్నా తాగునీటికి ఇక్కట్లు
 -    పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడంతో కూలుతున్న సర్దార్ సర్వాయి పాపన్న కోట
-  మాదారం-ఖిలాషాపురం మధ్య వాగులో వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వాగుపొంగి సమీప గ్రామాలతో ఖిలాషాపురానికి తెగిపోతున్న సంబంధాలు
 
 ఒక్కడే...
 అనావుకుడిగా వచ్చి... అసెంబ్లీలో పాగ
 అవి జనతాపార్టీ గాలి ఉధృతంగా వీచే రోజు లు. ఎమ్మెల్యే టిక్కెట్ ట్రై చేద్దావూ! అనుకున్నా రు... మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ఓ ఆర్‌ఎంపీ జి.నర్సిములునాయుడు. అనుకు న్నదే తడవుగా జనతాపార్టీ టిక్కెట్ కోసం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చా కదా.. గాంధీభవన్‌ను చూసి వెళ్దాం’ అనుకుని అక్కడికి వెళ్లి ఎందుకైనా మంచిదనుకుని వెంట తెచ్చుకున్న దరఖాస్తును అక్కడ సమర్పించారు.
 
 అంతే ఆయున రొట్టె విరిగి నేతిలో పడింది. ‘ఇందిరా కాంగ్రెస్ టికెట్‌కు మీరొక్కరే దరఖాస్తు చేసుకున్నారు...టికెట్ మీకే వచ్చింది’అంటూ గాంధీభవన్ నుంచి అతనికి వర్తమానం వచ్చింది. దీంతో అనూహ్యంగా ఆయున కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగి 1978లో మక్తల్ ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఆర్‌ఎంపీ ఒక పార్టీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లి మరోపార్టీకి దరఖాస్తు సమర్పించి ఏకంగా ఎమ్మెల్యే  కావడం అప్పట్లో ఓ సంచలనం.
 -న్యూస్‌లైన్, నారాయణపేట
 
 సాకలోల్ల కట్టం తీరకచ్చె
 రాజులు బోవట్టే.. రాజ్యాలు బోవట్టే గని మా సాకలోల్ల బతుకుల సీమంత సుక మారకచ్చినై. మా తాతముత్తాతల కాడికెళ్లి గిదే బతుకు. పొద్దుగల్ల లేసి.. కారంబువ్వ దిని.. ఇళ్లిళ్లూ దిరిగి ఊళ్లె బట్టలన్నీ ముళ్లెగట్టుకుని చెరొడ్డుకు దీస్కచ్చి ఉతుకుడే దెలుసు. బట్టలకంటిన మైలైతే బోవట్టే గని మా బతుకు కట్టం తీరకచ్చె. ఇగ మా బతుకంతా చాకిరేవు కాడ్నే బోవట్టే. మాకు దెల్సింది గిదొక్కటే పని. గిది గుడ సక్కగ సేసుకోలేక పోతున్నం. బట్టల్ని ఉతుకుదమంటే నీళ్లుంట లేవు. చెరువుల, కుంటల కాడ ఉతకస్త లేదు. గా దోబిగాట్లు కట్టిపియుండ్రి సారూ.. అని పెద్దమనుషులందర్ని అడిగినం. ఇగ ఎలచ్చన్ల సంగతేందో.. గ లీడరుసాబుల ముచ్చటేందో. ఐదేండ్లకోపారి గిట్ల ఇంటిమొకాన అత్తరు. ఏమే అవ్వ మంచిగున్నాయే.. అని తియ్యగ మాట్లడతరు. ఈసారి గూడ నాకే ఓటు గుద్దే అవ్వ.. నీకు పించినిప్పిత్తా.. ఇళ్ల జాగ ఇప్పిత్తా అని జెప్తరు. ఓట్లేశేనాడు ఆటోల గూసుండ వెట్టి దీస్కపోతరు. తీస్కత్తరు. గంతే.. మల్ల ఒక్కనాడు సుక కన్పియ్యరు. మాకు పెద్దకోర్కెలు ఏముంటయ్ బిడ్డా.. కడుపుకింత తిండి, కట్టుకునతందుకు బట్ట, ఉండతందుకు ఇంత ఇల్లు సాలు. ఇగ గివి గూడ ఇయ్యకపోతే గౌర్నమెంటు ఎందుకు.. గీ లీడరుసాబులు ఎందుకు.
  - సాకలి లచ్చవ్వ, బూర్గుల్, నిజామాబాద్

Advertisement

తప్పక చదవండి

Advertisement