ఉత్తమ్‌ను చిత్తుగా ఓడించండి | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌ను చిత్తుగా ఓడించండి

Published Tue, Apr 22 2014 2:46 AM

general elections campaign

గరిడేపల్లి, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గరిడేపల్లి మండలం ఎల్‌బీనగర్, కోదండరాంపురం, మర్రికుంట, గడ్డిపల్లి, కుతుబ్‌షాపురం, వెలిదండ, తాళ్లమొల్కాపురం, గరిడేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఐదేళ్లలో నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ్ పాలనలో పేకాట క్లబ్‌లు, కోడి పందేలు, బెల్లం షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాయని ఆరోపించారు. ఆయన చెప్పుకుంటున్న వేల కోట్ల అభివృద్ధి కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితమన్నారు. 610 జీఓ అమలు కమిటీ చైర్మన్‌గా తెలంగాణ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
 
  తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను పరామర్శించలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను తెలంగాణ వాదినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ముస్లింలకు వెన్నుపోటు పొడిచి కోదాడ స్థానాన్ని తన సతీమణికి ఇప్పించుకున్న చరిత్ర ఉత్తమ్‌దేనన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లను మూసివేయించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
 
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు పేదలందరికీ అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు శ్రీకాంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బొల్లగాని సైదులుగౌడ్, పెదపోలు సైదులుగౌడ్, కర్నాటి నాగిరెడ్డి, కొత్త రామకృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, బొమ్మనాగమ్మ, మట్టపల్లి సైదులు, కీత వెంకటేశ్వర్లు, ఆకుల శ్రీనివాస్, బట్టిపల్లి నాగయ్య, కీత అరవింద్, సురభీ అరవింద్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement