ఇదేంది వా(బా)సు! | Sakshi
Sakshi News home page

ఇదేంది వా(బా)సు!

Published Tue, Apr 15 2014 3:45 AM

Meeting again Waugh (Ba), Su!

టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిపై  తెలుగుతమ్ముళ్ల గుస్సా
మరో పాళెం కానున్నారని  సీనియర్ నేతల ఆవేదన
సొంత కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం
నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు

 
 ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మెరుపు తీగలే అధికమయ్యాయా? పార్టీ ఉన్నతి కోసం, శ్రేణులకు అండగా ఉండే నాయకులు కనుమరుగయ్యారా? కడప పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి (వాసు) మరో పాళెం కానున్నారా? అనే  ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అందుకు కారణం పార్టీ కోసం కష్టపడకుండానే ఎంపీ టికెట్ దక్కడం ఒక ఎత్తయితే, అభ్యర్థిగా ప్రకటించాక ఒంటెత్తు పోకడలకు పోతుండటం మరో కారణంగా చెప్పుకొస్తున్నారు.

వెరసి జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు. రాజకీయాలకు దూరంగా కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డ శ్రీనివాసులరెడ్డిని కడప పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. రాజకీయ వాసన అంతగా పట్టని వాసు ఒక్కమారుగా అభ్యర్థి కావడం వెనుక డబ్బే ఏకైక అర్హతగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి తనయుడిగా గుర్తింపు ఉన్న వాసు ఇంతకాలం ప్రత్యక్షంగా ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. పెపైచ్చు లక్కిరెడ్డిపల్లెలో దివంగత రాజగోపాల్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు రమేష్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అయితే ఒక్కమారుగా వాసుకు రాజకీయ కాంక్ష ఏర్పడింది. దాంతో ముందుగా రమేష్‌రెడ్డి స్థానంలోకి వచ్చేందుకు తీవ్రప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే రాజగోపాల్‌రెడ్డి బంధువులు, సన్నిహితులు అన్నదమ్ముళ్లు ఇరువురి మధ్య చర్చలు జరిపి వారించినట్లు తెలుస్తోంది. దీంతో రాయచోటిని వదలి, కడప పార్లమెంటు వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 వ్యూహాత్మకంగా అడుగులేసిన వాసు...

 తెలుగుదేశం పార్లమెంటు సీటు కోసం వాసు వ్యూహాత్మకంగా అడుగులు వేసి సఫలీకృతుడయ్యాడని పలువురు పేర్కొంటున్నారు. ఆ మేరకే సీనియర్ నేతల్ని కాదని ఆయనకు పార్టీ టికెట్ దక్కినట్లు భావిస్తున్నారు. కీలెరిగి వాత పెట్టాలనే విధంగా చంద్రబాబు ఆయువు పట్టును పట్టుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు కోటరీని మేనేజ్ చేయడంతో టీడీపీలో సభ్యత్వమే లేని శ్రీనివాసులరెడ్డి సునాయాసంగా కడప పార్లమెంటు టికెట్ దక్కించుకున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కోటరీ సూచనల మేరకు రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డిలను కాదని టికెట్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ తతంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్న దివంగత రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సన్నిహితులు సైతం నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. రాయచోటి పరిధిలోని లక్కిరెడ్డిపల్లెకు చెందిన వాసు కడప పార్లమెంటు పరిధివాసి కాకపోయినా పార్టీ టికెట్ దక్కించుకోవడం వెనుక అదనపు అర్హత డబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 
 

Advertisement
Advertisement