అసెంబ్లీకి ఏడు కొత్త ముఖాలు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి ఏడు కొత్త ముఖాలు

Published Sat, May 17 2014 1:57 AM

Seven new faces in the Assembly

సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఏడుగురు కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ తరఫున ఒకరు అసెంబ్లీకి తొలిసారి ఎన్నిక తమ నియోజకవర్గాల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
 
జిల్లా నుంచి ఏకైక మహిళ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పామర్రు  నుంచి బరిలో దిగిన ఉప్పులేటి కల్పన గెలుపొందారు. ఆమె గతంలో రెండుసార్లు నిడుమోలు, పామర్రు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. మూడోసారి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై విజయం సాధించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీచేసిన ఏకైక మహిళా అభ్యర్థి కల్పన కావడం విశేషం.
 
నాటి సర్పంచ్.. నేడు అసెంబ్లీకి...

వైఎస్సార్‌సీపీ తరఫున తిరువూరు అసెంబ్లీ బరిలో నిలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయన వల్లూరుపాలెం సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు.
 
తొలిసారిగా తిరువూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బోడె ప్రసాద్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయన గతంలో పెనమలూరు సర్పంచ్‌గా పనిచేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావు కూడా పోటీ చేయడం తొలిసారి.
 
ఎంపీ అభ్యర్థిగా విఫలమై.. ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచి...
 
గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీమోహన్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 2009లో గన్నవరం నుంచే సీటు ఆశించిన ఆయన దాసరి బాలవర్ధనరావుకు అక్కడ సీటు కేటాయించడంతో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ ఓటమి చవిచూశారు. టీడీపీ తరఫున మచిలీపట్నం నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నుంచి పోటీచేసిన పోటీచేసిన ఆయన అప్పట్లో ఓటమిచెందారు.
 
లోక్‌సభకు కేశినేని...

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కేశినేని శ్రీనివాస్ (నాని) కూడా ఎన్నికల బరిలో తొలిసారి దిగారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై గెలుపొంది లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టబోతున్నారు.
 

Advertisement
Advertisement