అధికారిపై మండిపడ్డ రాములమ్మ | Sakshi
Sakshi News home page

అధికారిపై మండిపడ్డ రాములమ్మ

Published Wed, Apr 30 2014 11:51 PM

vijayashanti resentment on officers

మెదక్ రూరల్, న్యూస్‌లైన్:  రాములమ్మకు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయింది. ఎన్నికల అధికారివా?  టీఆర్‌ఎస్ నాయకుడు హరీష్‌రావు మనిషివా? అంటూ మండిపడ్డారు. దీంతో పది నిమిషాలపాటు పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుఓవడంతో సమస్య సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ మండల పరిధిలోని మద్దులవాయి పోలింగ్ కేంద్రంలో బుధవారం ఎన్నికలు కొనసాగుతుండగా గ్రామానికి చెందిన ఎల్లవొయిన గుండమ్మ అనే వృద్దురాలు ఓటు వేయడానికి వచ్చింది.

ఆమెకు కళ్లు సరిగా కనపడకపోవడంతో చేతిగుర్తుకు ఓటు వేయాలని గుర్తు ఎక్కడ ఉందో చూపాలని గుండమ్మ పీఓ మదన్‌మోహన్‌రావును కోరింది. అయితే ఈవీఎంపై భాగంలో ఉన్న కారు గుర్తుకు ఓటు వేయాలని పీఓ చెప్పి ఓటు వేయించారు. తాను చేతిగుర్తుకి ఓటు వేయాలనుకున్నా మీరు ఆలా ఎందుకు వేయించారని అధికారితో  వాపోయింది. అయితే ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రం బయట ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆమె తెలిపింది. దీంతో కార్యకర్తలంతా మూకుమ్మడిగా వెళ్లి పీఓతో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న పోలీసులు నాయకులను, కార్యకర్తలను సముదాయించడంతో వారు వెళ్లిపోయారు.

అనంతరం విషయం తెలుసుకున్న మెదక్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి విజయశాంతి తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వచ్చి హరీష్‌రావుు మనిషివి నీవేనా అంటూ... కారు గుర్తుకు ఓటు ఎలా వేయామంటావని అధికారిని నిలదీశారు. పీఓ మదన్‌మోహన్‌రావు టేబుల్‌పై ఉన్న ఓటర్ల జాబితాను తీసి కిందపడేశారు. దీంతో మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ తాను ఎవరికి ఓటు వేయమని చెప్పలేదని,  హరీష్‌రావుకు తనకు ఎలాంటి సంబం ధం లేదని బదులిచ్చారు. అయినా విజయశాంతి ఆగ్రహంతో ఊగిపోతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై వేణుకుమార్ తన సిబ్బందితో హూటహూటిన పోలింగ్ కేంద్రానికి వచ్చి విజయశాంతిని అక్కడి నుండి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

Advertisement
Advertisement