ప్రతి జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్స్‌ నిర్మిస్తా | Sakshi
Sakshi News home page

ప్రతి జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్స్‌ నిర్మిస్తా

Published Thu, Apr 3 2014 8:36 PM

ప్రతి జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్స్‌ నిర్మిస్తా - Sakshi

శ్రీకాకుళం:వచ్చే ఎన్నికలు ప్రజల తలరాతలను మార్చే ఎన్నికలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునే వారికే పట్టం కట్టాలని ఆయన తెలిపారు. ఎలాంటి సీఎం కావాలో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలన్నారు.  జిల్లాలోని టెక్కలి ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన జగన్.. వైఎస్సార్ సీపీకి అధికారం అప్పచెబితే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించి ఆరోగ్య శ్రీ పథకాన్నిగొప్ప పథకంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. మరో 35 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని ప్రతి ఒక్కరూ తమ భవితవ్యాన్ని ప్రశ్నించుకుని వైఎస్సార్ సీపీకి ఓటేయాలని తెలిపారు.

 

ఆ దివంగత మహానేత వైఎస్ ఎక్కడున్నారంటే చెయ్యి గుండెవైపు చూపిస్తుందని జగన్ గుర్తు చేశారు. ఆ మహానేత ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై జగన్ మండిపడ్డారు. ఆనాటి బాబు పాలనను తలుచుకుంటే భయమేస్తుందన్నారు.తమ పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అనే విషయాన్ని ఆయన ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత అన్నపదానికి అర్థం తెలియదన్నారు. పది మందికి మేలు చేయని బాబు.. ఈనాడులో సొంత డబ్బా కొట్టించుకోవడం ఒకేటే తెలసని ఎద్దేవా చేశారు.

చంద్రబాబులా సాధ్యం కాని హామీలు ఇవ్వడం నాకు చేతకాదని..ఏ పథకాలైతే అమలు చేస్తానో అవే తాను హామీలు ఇస్తున్నానని జగన్ తెలిపారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీ ఉండదని బాబుకు తెలుసని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజీపైనే తలరాతను మార్చే ఐదు సంతకాలు చేస్తానన్నారు.అక్కచెల్లెమ్మలు తమ పిల్లల చదువుగురించి భయపడాల్సిన అవసరం లేదని.. అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం చేసి వారికి అండగా నిలుస్తానని జగన్ తెలిపారు. అవ్వాతాతలు కూలికి వెళ్లకుండా రెండొందల పెన్షన్‌ను ఏడొందలు చేస్తూ రెండో సంతకం చేస్తానన్నారు. రైతన్నలకు 3వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేస్తానని, పేదవాళ్లు అడిగిన ప్రతివారికి ఏ కార్డు కావాలన్నావెంటనే ఇచ్చేలా ఐదో సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇల్లులేని నిరుపేదకు హామీ ఇస్తున్నావచ్చే 2019వ సంవత్సరం వచ్చేవరకు వచ్చే ఐదేళ్లలో పేదవారికి 50లక్షల ఇళ్లు కట్టిస్తానన్నారు.


రాష్ట్ర విభజనతో మనకు రెండు నష్టాలు జరిగాయని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేయడం మొదటిదైతే.. హైదరాబాద్ ను సీమాంధ్రులకు కాకుండా చేయడం రెండోదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నాటికి రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేస్తానన్నారు.రైతన్నలకు 7 గంటల కరెంట్ పగటిపూట ఇచ్చేలా చూస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్ధిగా శ్రీనుని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా శాంతిని వైఎస్ జగన్ ప్రకటించారు.

Advertisement
Advertisement