200 ఏళ్లకు ఒక అమ్మాయి జన్మించింది | Sakshi
Sakshi News home page

200 ఏళ్లకు ఒక అమ్మాయి జన్మించింది

Published Tue, Feb 10 2015 10:31 PM

200 ఏళ్లకు  ఒక అమ్మాయి జన్మించింది

సమ్‌థింగ్  స్పెషల్

‘అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది...’ అంటూ ల్యారీల కుటుంబం రెండువందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ నాన్నలాంటి అబ్బాయిలే పుడుతూ వస్తున్నారు. ఈ పరంపర రెండు వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు తాజాగా ఆ ఇంట ఒక బుజ్జిపాప పుట్టింది. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు ఉబ్బితబ్బిబయిపోతోంది. ల్యారీల వంశ వృక్షాన్ని రెండువందల ఏళ్లుగా పరిశీలించి చూస్తే ఒక్క అమ్మాయంటే ఒక్క అమ్మాయీ ఉండదు.

 1809లో చివరగా  ఆ ఇంట ఒక పాప జన్మించింది. అప్పటి నుంచి తరాలు మారిపోతున్నా.. ఆ ఇంట మగశిశువులు తప్ప ఆడశిశువుల జాడ లేదు. అబ్బాయిలు పుడుతున్నారు.. పెద్ద అవుతున్నారు, వారికి  పెళ్లిళ్లు అవుతున్నాయి... సంతానం కలుగుతోంది. ఆ సంతానమంతా అబ్బాయిలే! కొన్ని తరాల కిందటే ల్యారీల వంశం తమ ఇంట్లో ఆడశిశువుల జననం కలగడం లేదని అర్థం చేసుకొంది. కుటుంబం విస్తరిస్తున్నా.. ఏ ఒక్కరికీ అమ్మాయి పుట్టలేదు. అన్నీ గడ్డాలూ, మీసాలే!

ఒక అక్క కావాలి, ఒక చెల్లి ఉండాలి, కూతురు కావాలి... అనే తపన మొదలైంది. ల్యారీల ఇంటికి వచ్చిన కోడళ్లను కూడా లోటు వేధించసాగింది. ఆడపిల్ల కోసం ఆ కుటుంబం పరితపించింది. ఐదు తరాల ఈ ఆవేదనను తీరుస్తూ ఇటీవలే ఆ ఇంట్లో పాపపుట్టింది. ల్యారీల వంశంలోని మార్క్‌కు నలుగురబ్బాయిల తర్వాత ఐదో సంతానంగా పాపపుట్టింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం చాలా ఆనందపడుతోంది. ఐదు తరాలుగా తమ ఇంట్లో అమ్మాయిలే లేరని.. ఇప్పుడు పాప పుట్టడంతో తమ కుటుంబం మొత్తం ఎంత ఆనందిస్తోందో చెప్పడానికి మాటలు చాలడం లేదని మార్క్ అంటున్నాడు. తన భార్య హన్నా వల్ల ఈ అదృష్టం కలిసి వచ్చిందని మార్క్ మెరుస్తున్న కళ్లతో చెబుతున్నాడు!

Advertisement
Advertisement