బీజం వేసింది మనమే! | Sakshi
Sakshi News home page

బీజం వేసింది మనమే!

Published Fri, Sep 19 2014 11:53 PM

Asia in the past history of the 'field' Special

ఒలింపిక్స్... నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా పండుగ... పేరుకు ప్రపంచ క్రీడలే అయినా ఒకప్పుడు ఒలింపిక్స్‌లో పతకాల సాధనలోనూ, ప్రాతినిధ్యంలోనూ పాశ్చాత్య దేశాలదే పైచేయి. ఏడు ఖండాల్లో ఆసియా పెద్దదైనప్పటికీ పాశ్చాత్య దేశాల ముందు దిగదుడుపే. ఒకటో అరో మినహాయిస్తే ఆసియా దేశాలు అప్పట్లో ఒలింపిక్స్‌లో పెద్దగా సాధించిందేమీ లేదు.. పేదరికం... క్రీడలపై అనాసక్తి... అరకొర వసతులు... ప్రపంచ క్రీడల్లో ఆసియాను వెనక్కినెట్టేశాయి. ఓటమే విజయానికి తొలిమెట్టు అన్నట్లు... ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలవడం ఆసియా క్రీడలకు బాటలు వేసింది. తమకూ ఒలింపిక్స్‌లా క్రీడలు ఉండాలన్న ఆలోచన ఏషియాడ్‌కు నాంది పలికేలా చేసింది. ఇంచియాన్‌లో క్రీడలు ఘనంగా ప్రారంభమైన నేపథ్యంలో  ఏషియా గత చరిత్రపై ‘మైదానం’ స్పెషల్.
 - శ్యామ్ తిరుక్కోవళ్లూరు
 
‘గురుదత్ సోంధి’ పరిచయం లేని పేరు.. 66 ఏళ్ల కిందట లండన్‌లో గురుదత్ మెదడులో మెదిలిన ఆలోచన క్రీడల్లో ఆసియా జాతకాన్నే మార్చేసింది. ఒలింపిక్స్‌లో పాశ్చాత్య దేశాల జోరు కొనసాగుతున్న రోజుల్లో మనకంటూ ఓ క్రీడ ఉండాలని.. ఆసియా దేశాల ప్రతిభ చాటేందుకు అవి ఉపయోగపడాలని భావించారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే ‘ఆసియా క్రీడలు’.. ఇంతింతై అన్నట్లు ఆ ఏషియాడే ఇప్పుడు ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో ఆసియా దేశాల హవా కొనసాగేలా చేస్తోంది.
 
లండన్‌లో పునాది

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియాకు చెందిన చాలా దేశాలు స్వాతంత్య్రం సాధించాయి. ఈ సమయంలోనే ఆసియా క్రీడలకు పునాది పడింది. లండన్ ఆతిథ్యమిచ్చిన 1948 సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులు ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ను పునరుద్ధరిస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. అయితే భారత్‌కు చెందిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి గురుదత్ సోంధి మాత్రం ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావించారు. ఈ గేమ్స్ స్థానంలో కొత్తగా పోటీలను నిర్వహించాలని ఆసియా  ప్రతినిధులకు సలహా ఇచ్చారు. ఈ సలహానే ఆసియా క్రీడలకు నాంది పలికినట్లయింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఏడాదికి ఆసియా గేమ్స్ సమాఖ్య ఏర్పాటైంది. అలా తొలి ఆసియా క్రీడలను నిర్వహించే అవకాశం న్యూఢిల్లీ దక్కించుకుంది. 1951లో తొలిసారిగా ఏషియాడ్‌ను నిర్వహించారు. ఒలింపిక్స్ తరహాలో నాలుగేళ్లకోసారి ఆసియా క్రీడలను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే రెండో ఆసియా గేమ్స్ మాత్రం మూడేళ్లకే అంటే 1954లో జరిగాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నాలుగేళ్లకోసారి ఆసియా పోటీలను జరుపుతున్నారు.
 
ఏషియాడ్‌కు ముందు...

ఆసియా క్రీడలు 1951లో మొదలైనప్పటికీ అంతకంటే ముందే ఒలింపిక్స్ తరహాలో మెగా టోర్నీ నిర్వహించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ పేరుతో జపాన్, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు 1912లో పోటీలకు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాతి ఏడాది (1913లో) మనీలాలో తొలిసారిగా ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ జరిగాయి. రెండేళ్లకోసారి 1934 వరకు మరో పదిసార్లు ఈ పోటీలను నిర్వహించారు. అయితే కొన్ని కారణాలతో చైనా తప్పుకోవడంతో 1938లో ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ రద్దయ్యాయి.
 
భవిష్యత్తులో మార్పులు...

1954 నుంచి సరిసంఖ్య ఏడాదిలో ఆసియా క్రీడల్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అయితే త్వరలోనే ఇది బేసి సంఖ్య ఏడాదిలో నిర్వహించేందుకు ఓసీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఒలింపిక్స్‌కు రెండేళ్ల ముందు పోటీలను నిర్వహిస్తుండగా.. ఏడాది ముందే ఏషియాడ్‌ను నిర్వహించాలని ఆసియా ఒలింపిక్ మండలి నిర్ణయించింది. దీంతో వచ్చే ఆసియా క్రీడలు 2019లో జరగాల్సి ఉన్నప్పటికీ ఇండోనేషియాలో ఎన్నికల కారణంగా.. 2018లోనే ఏషియాడ్ జరిగే అవకాశాలున్నాయి. నిజానికి  ఈ క్రీడల్ని వియత్నాం నిర్వహించాల్సి ఉంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ దేశం నిర్వహణపై గతంలోనే చేతులెత్తేసింది. దీంతో ఇండోనేషియా పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఇక 19వ ఆసియా క్రీడలను 2022కు బదులుగా 2023లో నిర్వహిస్తారు. ఒలింపిక్స్ కంటే ఏడాది ముందే ఈ పోటీలు జరిగేలా షెడ్యూల్‌లో మార్పులు చేశారు.
 
సూపర్ పవర్ చైనా...

ఆసియా క్రీడల్లో ఒకప్పుడు జపాన్ ఆధిపత్యం ప్రదర్శించినా... ప్రస్తుతం పతకాలు కొల్లగొడుతోంది చైనానే. ఎప్పుడు ఆసియా క్రీడలు జరిగినా పైచేయి ఆ దేశానిదే. మిగతా దేశాలవి ఆ తర్వాతి స్థానాలే. ఆసియా క్రీడల్లో ఇప్పుడు చైనాది రారాజు పాత్ర. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల నుంచి ఆ దేశం ఆధిపత్యం చాటుతూ వస్తోంది. మొత్తంగా చైనా ఏషియాడ్‌లో 1191 బంగారు పతకాలతో అగ్రస్థానంలో ఉంది. ఇక ఆసియా క్రీడల చరిత్రలో ఏ దేశం కూడా ఇప్పటిదాకా కనీసం వెయ్యి స్వర్ణాలు గెలవలేకపోయింది. క్రీడల్లో తమ దేశానికి ఉన్న ఆసక్తికి ఈ పతకాలే నిదర్శనమని చైనా క్రీడాకారులు గర్వంగా చెబుతారు. జపాన్ 910 బంగారు పతకాలతో చైనా తర్వాతి స్థానంలో ఉంది.
 
ఏషియాడ్‌లో అవీ ఇవీ

1951, 54, 58 ఆసియా క్రీడలు పెద్దగా వివాదాలేమీ లేకుండా జరిగినా... ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన 1962 ఏషియాడ్‌ను మాత్రం వివాదాలు చుట్టుముట్టాయి. రాజకీయ, మతపరమైన కారణాలతో ఇజ్రాయెల్, చైనా దేశాలను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా ఇండోనేసియా అడ్డుకుంది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏషియాడ్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడమే కాకుండా ఇండోనేసియాపై నిషేధం విధించింది.
     
1970లో దక్షిణ కొరియా ఆర్థిక ఇబ్బందులు, ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా ఆసియా క్రీడలను నిర్వహించలేకపోయింది. దీంతో థాయ్‌లాండ్ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. ఇక 1970 నుంచే ఆసియా క్రీడలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతున్నాయి.
     
1974లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో చైనా, ఉత్తరకొరియా, మంగోలియా, ఇజ్రాయెల్ దేశాలు పాల్గొన్నాయి. అరబ్ దేశాలు వ్యతిరేకించినప్పటికీ ఇజ్రాయెల్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది.
     
1978లో తొలుత సింగపూర్, ఆతర్వాత పాకిస్థాన్‌కు ఆసియా క్రీడల్ని నిర్వహించే అవకాశం వచ్చింది. కానీ ఇవి చేతులెత్తేయడంతో మరోసారి ఆసియా క్రీడలు బ్యాంకాక్‌లో జరిగాయి. తైవాన్, ఇజ్రాయెల్‌లను ఈ పోటీల్లో పాల్గొనకుండా గేమ్స్ ఫెడరేషన్ అడ్డుకుంది. మరోవైపు కొన్ని దేశాలు పోటీలకు ముందు క్రీడల నుంచి తప్పుకున్నాయి.
     
1981లో ఆసియా గేమ్స్ సమాఖ్య స్థానంలో ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) ఏర్పాటైంది. ఓసీఏ ఆధ్వర్యంలోనే 1982లో ఢిల్లీలో ఆసియా క్రీడలు జరిగాయి.
     
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కజకిస్థాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కెమినిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు 1994 ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కింది.
 
పోటీలకు మహిళలు దూరం

సౌదీ అరేబియా మహిళల ప్రాతినిధ్యం లేకుండానే ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతోంది. 199 మంది సభ్యుల బృందంలో ఒక్క క్రీడాకారిణికి కూడా చోటు దక్కలేదు. అయితే క్రీడల్లో పోటీపడే సత్తా తమ క్రీడాకారిణుల్లో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా అధికారులు చెప్పారు. కానీ అధికారులు కావాలనే మహిళల్ని ఎంపిక చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత పరమైన అడ్డంకుల వల్లే మహిళల్ని పోటీలకు దూరంగా ఉంచారని మానవ హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండేళ్ల కిందట లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో సౌదీ అరేబియా తరఫున ఇద్దరు మహిళలు బరిలోకి దిగారు. ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్లకే మళ్లీ క్రీడాకారిణుల్ని దూరంగా ఉంచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
శాంతి వివాదం

2006 దోహా ఆసియా క్రీడల సందర్భంగా భారత అథ్లెట్ శాంతి సౌందరాజన్ వివాదాల్లో నిలిచింది. మహిళల 800 మీటర్ల పరుగులో శాంతి.. రజత పతకం సాధించింది. అయితే శాంతి సౌందరాజన్ మహిళ కాదనే వాదనలు మొదలయ్యాయి. దీంతో శాంతికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఆ పరీక్షలో శాంతి విఫలం కావడంతో నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన దగ్గరి నుంచి శాంతికి కష్టాలు మొదలయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆమె సాధించిన విజయాలు గుర్తించింది. ఫలితంగా శాంతి ఇప్పుడు అథ్లెటిక్స్ కోచ్‌గా సేవలందించగలుగుతోంది.
 
సాక్స్‌లో సెన్సర్
 
గ్వాంగ్జౌ ఏషియాడ్‌లో తైవాన్ క్రీడాకారిణి యాంగ్ షు చన్ తైక్వాండో పోటీల సందర్భంగా ఆమె వేసుకున్న సాక్స్‌లో అదనపు సెన్సర్ ఉన్నట్లు గ్రహించారు. దీంతో షు చన్‌పై మూడు నెలల నిషేధం విధిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజానికి తైక్వాండోలో క్రీడాకారులు వేసుకునే సాక్సుల్లో సెన్సర్లను ఉంచుతారు. ప్రత్యర్థిపై దాడి చేసినప్పుడు వారు సాధించిన పాయింట్ల కోసం వీటిని ఉపయోగిస్తారు. అయితే షు చన్ మాత్రం అదనపు సెన్సర్లను వినియోగించినట్లు తొలి రౌండ్ పోటీ సందర్భంగా బయటపడింది. అప్పటికే ఆమె 9-0తో ఆధిక్యంలో ఉంది. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది.
 
గుర్రంపై నుంచి కిందపడి...
 
ఆసియా క్రీడల్లో విషాదకర ఘటన 2006 దోహా పోటీల సందర్భంగా చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈక్వెస్ట్రియన్ క్రీడాకారుడు కిమ్ హ్యుంగ్ చిల్ క్రాస్ కంట్రీ కోర్స్ సందర్భంగా ఎనిమిదో జంప్‌లో హఠాత్తుగా గుర్రంపై నుంచి కిందపడి పోయాడు. ఆ సమయంలో అతనిపై గుర్రం కూడా పడిపోయింది. స్పృహ కోల్పోయిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆసియా క్రీడల్లో ఒక క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.
 

Advertisement
Advertisement