రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త(సం) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలిక, సార్వజనీన ఆరాధన. దీనికి ఎంతో ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా తెలుస్తోంది. పవిత్ర ఖురాన్లో దైవం ఇలా అంటున్నాడు. ‘‘విశ్వాసులారా! పూర్వ ప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా రోజాలు (ఉపవాసాలు) విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా ఉపవాసాలు విధిగా పాటించాలని నిర్ణయించాము.
దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’’(2–183) అంటే ఉపవాస వ్రతం కేవలం నేటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనవి కావని, పూర్వకాలం నుండి, ప్రవక్తలందరి అనుయాయులపై ఇవి విధిగా ఉండేవని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తోంది. నేడు కూడా ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని జాతులు, అన్ని మతాల వారిలో ఈ ఉపవాస వ్రత సాంప్రదాయం కొనసాగుతోంది. కాకపోతే ఒక నిర్దిష్టమైన, మార్గదర్శకమైన సాంప్రదాయ విధానం లేకపోవచ్చు. కానీ ఆ భావన... ఏదో ఒక రూపంలో ఆచరణా ఉన్నాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత, సామాజిక నేపథ్యం కలిగినటువంటి ఉపవాసాల ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని కూడా దైవం చాలా స్పష్టంగా విశదీకరించాడు.
– షేఖ్ అబ్దుల్ హఖ్