మానవీయతే సర్వమత సారాంశం | Sakshi
Sakshi News home page

మానవీయతే సర్వమత సారాంశం

Published Fri, Sep 20 2013 12:18 AM

మానవీయతే సర్వమత సారాంశం

అందాలు జాలువారే మన భారతదేశం ఎన్నో కులాలకు, మతాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఉన్నన్ని కులాలు గాని, మతధర్మాలు గాని ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అందమైన నందనవనంలో వివిధ రకాల పుష్పాలు వికసించి, పరిమళిస్తున్నట్లుగా ఈ దేశంలో వివిధ మతవర్గాల ప్రజలు అనాదిగా సహజీవనం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా కలసిమెలసి సామరస్యంతో సాగిపోవడమే ఇక్కడి ప్రత్యేకత.

ఈ దేశ ప్రజలకు వారి మతధర్మాలు బోధిస్తున్న సహజీవన సామరస్య సూత్రం కూడా ఇదే. అన్ని మతాలు... మంచిని, మానవత్వాన్నే బోధిస్తాయి. ద్వేషభావాన్ని నూరిపోసే మతాలు అసలు మతాలే కావు. ఇతరులను, ఇతర మతధర్మాలను ద్వేషించేవి, దూషించేవి మతం అని పిలిపించుకునే అర్హతను కలిగి ఉండవు. నాస్తికుల మాటల్లో చెప్పాలంటే అలాంటి మతాలు నిజంగా మత్తుమందుతో సమానం... కాదు..! ఇంకా అంతకన్నా ఎక్కువ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నారు ఏసుక్రీస్తు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అంటుంది హిందూమతం.

‘నువ్వునీకోసం ఏ స్థితిని కోరుకుంటావో, నీతోటివారికోసం కూడా అలాంటిస్థితినే కోరుకో’మన్నారు ముహమ్మద్ ప్రవక్త (స). ‘సమస్త మానవాళి పరస్పరం సోదరులే. అందరినీ ప్రేమించండి. పరుల ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం, అది పాపం, అది నరకం’ అంటోంది ఇస్లాం ధర్మం.

 కనుక పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందరూ నిష్పక్షపాతంగా ఒకరి మతధర్మాలను ఒకరు అధ్యయనం చెయ్యాలి. అవగాహన పెంచుకోవాలి. మతధర్మాల్లో చెడుకు అవకాశమే ఉండదు కాబట్టి, అందులోని మంచిని గ్రహించాలి. దాన్ని స్వీకరించాలి.

 ఒకవేళ ఎందులోనైనా వైర, విద్వేష బోధనలున్నట్లయితే అది మతం కాదని గ్రహించాలి. వెంటనే దాన్ని విసర్జించాలి. అంతేకాని మతం పేరుతో దాన్ని అనుసరించకూడదు. స్వార్థ, మత ఛాందస బోధకుల మాయమాటలకు లొంగకుండా ఉండేందుకు సైతం అధ్యయనం అవసరమవుతుంది. గుడ్డిగా ఎవరి మాటలూ వినకూడదు. దైవం మనకు ప్రసాదించిన వివేకం, విచక్షణ జ్ఞానాన్ని వినియోగించి ఆలోచించాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి, సామరస్య వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని అల్లకల్లోలానికి గురి చేసి, అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అలాంటి మతోన్మాద శక్తుల ఉచ్చులో పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్ని సత్కార్యాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలి. ఈ విషయాన్ని పవిత్రఖురాన్‌కూడా ఇలా చెబుతోంది...

 ‘మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనుల్లో అందరితోనూ సహకరించండి. పాపకార్యాల్లో, అత్యాచారాల్లో ఎవరికీ సహకరించకండి. దైవానికి భయపడండి. దైవభక్తి పరాయణతకు ఇది నిదర్శనం’

 సాటివారి బాధను సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు. ఇతరుల మనోభావాలను గాయపరచడం అత్యంత ఘోరమైన పాపం. మనం ఏ స్థితిలో ఉన్నా పరుల క్షేమాన్ని, శ్రేయాన్ని కాంక్షిస్తూ ఉండాలి. ఏ విషయంలో అయినా హింసాదౌర్జన్యాలు పరిష్కారమార్గాలు కానే కావు. అవి ప్రగతికి, మన ఉనికికి ప్రమాదాలు, అవరోధాలు.

కరుణామయుడైన అల్లాహ్ మనకు ఉనికినిచ్చాడు. చక్కటిరూపాన్నిచ్చాడు. అద్భుతమైనటువంటి జ్ఞానసంపత్తిని ప్రసాదించాడు. మంచిచెడుల విచక్షణ తెలిపాడు. మంచి మార్గమేదో, చెడు మార్గమేదో ఎరుకపరిచాడు. శారీరక శక్తిని, బుద్ధిబలాన్ని అనుగ్రహించాడు. సృష్టిలోని ఏ జీవరాశికీ ఇలాంటి సుగుణాలు లేవు. మనం వీటన్నింటినీ సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలి. లేకపోతే మనకూ, జంతుజాలానికీ తేడా ఉండదు. ఏ జంతువూ మరోజంతువుపై అకారణంగా దాడి చేయదు. గాయపరచదు. మరి విచక్షణ సంపన్నులమైన మనం అకారణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోగలమా? ఒకరి మనసునొకరు గాయపరచుకోగలమా? మనం మన బుద్ధిని ఉపయోగించాలి. విచక్షణాజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మానవత్వం కలిగిన మానవులుగా మసలుకోవాలి.

 అనాదిగా వస్తున్న ఈ సామరస్య వారసత్వాన్ని అప్రతిహతంగా కొనసాగించాలి. తులసివనంలో గ ంజాయి మొక్కల్లా ఉన్న మతోన్మాదులను కూకటివేళ్లతో పెకిలించి, మన అందాల నందనవనాన్ని కాపాడుకోవాలి. అల్లాహ్ సమస్త మానవాళికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక!

 - యండి. ఉస్మాన్‌ఖాన్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement