లొకేషన్‌లో పూజా హెగ్డే | Sakshi
Sakshi News home page

లొకేషన్‌లో పూజా హెగ్డే

Published Sat, Mar 4 2017 11:56 PM

లొకేషన్‌లో పూజా హెగ్డే

జగన్నాథమ్‌తో ఎన్నారై గర్ల్‌
నుదుట విభూతి... మెడలో రుద్రాక్ష... తెల్ల పంచె... ఎర్ర కండువా... సంప్రదాయానికి సింబల్‌ అన్నట్టున్నాడు జగన్నాథమ్‌. అతడికి పరిచయమైన అమ్మాయి మాత్రం అలా లేదు. స్కిన్‌ టైన్‌ జీన్స్‌... నడుము చూపించే చిన్న టాప్‌... హాట్‌ ఫీచర్స్‌తో మార్కెట్‌లో కొత్తగా దిగిన అల్ట్రా మోడ్రన్‌ బైక్‌లా ఉంది. మాట్లాడితే చాలు జగన్నాథమ్‌ బుగ్గలపై ముద్దులు మీద ముద్దులు పెడుతుందా అమ్మాయి. ‘ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామనుకుంటున్నావ్‌’ అనడిగినా వినదు. అమ్మాయి మేటర్‌ ఏంటా? అని ఆరా తీయగా... తను ఎన్నారై అమ్మాయని తెలిసింది! ఎన్నారై సంస్కృతిలో ముద్దులూ అవీ సహజమే కదా! అల్లు అర్జున్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్‌’. ఇందులో హీరోయిన్‌ పూజా హెగ్డే ఎన్నారై అమ్మాయిగా నటిస్తోంది! ప్రస్తుతం దుబాయ్‌లోని అబుదాబిలో షూటింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది షూటింగ్‌ స్పాట్‌లో తీసిన ఫొటోనే. బ్రాహ్మణ అబ్బాయితో ఈ ఎన్నారై అమ్మాయి ముద్దుల కథ, ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో మరి! అన్నట్టు... ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది.
‘దువ్వాడ జగన్నాథమ్‌’ లొకేషన్‌లో పూజా హెగ్డే















 

లేటెందుకు గురూ!
‘గురు’ షూటింగ్‌ను వెంకటేశ్‌ ఎప్పుడో పూర్తి చేశారు. కానీ, విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుందని చెబుతున్నారు. మధ్య మధ్యలో ఒక్కో సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల ఎందుకింత ఆలస్యమవుతోందనేది ప్రేక్షకులకు అంతుచిక్కని ఓ పజిల్‌లా తయారయింది. ఫిల్మ్‌నగర్‌లో మాత్రం ‘రెజ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ సూపర్‌ హిట్టయింది. వెంకీ ‘గురు’ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే... రెండూ స్పోర్ట్స్‌ మూవీస్‌ కాబట్టి ప్రేక్షకులు రెండిటి మధ్య ఎక్కడ పోలికలు వెతుకుతారోననే ఆలోచనతో ఈ చిత్రం విడుదల ఆలస్యం చేస్తున్నారు’ అనే గాసిప్‌ వినిపిస్తోంది. ‘గురు’ యూనిట్‌ ఈ గాసిప్‌ను ఖండించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశలో ఉందంటున్నారు. డబ్బింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ థియేటర్ల నుంచి ప్రేక్షకులు చూసే థియేటర్లకు రావడానికి ఎంతో టైమ్‌ పట్టదని క్లారిటీ ఇచ్చారు. రేపు ఈ సినిమాలోని ‘జింగిది...’ పాటను విడుదల చేస్తున్నట్టు దర్శక–నిర్మాతలు సుధ కొంగర, ఎస్‌. శశికాంత్‌ ప్రకటించారు.
దర్శకురాలు సుధ కొంగరతో హీరో వెంకటేశ్‌
















‘లేడీస్‌ టైలర్‌’ కొడుకు ఇప్పడేం చేస్తున్నాడు..?
32 సంవత్సరాల క్రితం వచ్చిన ‘లేడిస్‌ టైలర్‌’ గుర్తుందా? ఆ టైలర్‌గారి సందడిని అంత వీజీగా ఎలా మర్చిపోతాంలేండి. ఇప్పుడు లేడీస్‌ టైలర్‌ కొడుకు వస్తున్నాడు. ట్రెండ్‌ మారిపోయింది కదా. ఈ సన్‌ ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ అన్న మాట. అప్పుడు లేడీస్‌ టైలర్‌గా రాజేంద్రప్రసాద్‌ని చూపించిన దర్శకుడు వంశీ ఇప్పుడీ సీక్వెల్‌లో కొడుకు పాత్రకు సుమంత్‌ అశ్విన్‌ని తీసుకున్నారు. వంశీ మార్క్‌ టేకింగ్‌తో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘మధుర’ శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సుమంత్‌ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్‌ , మానస హిమవర్ష హీరో హీరోయిన్లుగా నటించారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ ఏం చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. రాజోలు పరిసర ప్రాంతాల్లోనూ, గోదావరి తీరంలోని పాపికొండల్లో 62 రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌తో సినిమా పూర్తయింది. వంశీ తనదైన స్టైల్లో డైరెక్ట్‌ చేశారు. హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ఆడియోను ఏప్రిల్‌లో, వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ సినిమాకి కెమెరా: నగేష్‌ బన్నెల్, మాటలు: కళ్యాణ్‌ రాఘవ్, సంగీతం: మణిశర్మ, పాటలు: శ్రీమణి, చైతన్యప్రసాద్, శ్రీ వల్లి, ఎడిటింగ్‌: బస్వా పైడిరెడ్డి, ఆర్ట్‌: డి.వై సత్యనారాయణ.
మధుర శ్రీధర్, వంశీ, సుమంత్‌ అశ్విన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement