ప్రేమపాఠం | Sakshi
Sakshi News home page

ప్రేమపాఠం

Published Sun, Aug 9 2015 10:26 PM

ప్రేమపాఠం - Sakshi

తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాల్సొస్తున్న రోజులివి. పెళ్లయిన తర్వాత కూడా అమ్మానాన్నలను... మీ దగ్గరే ఉంచుకోండి అని నివేదించవలసి వస్తున్న రోజులివి. మనకోసం చేసుకున్నది వాళ్లకు పెట్టడం కాకుండా, ప్రత్యేకంగా వాళ్ల కోసమే వండిపెట్టమని అభ్యర్థించాల్సి వస్తున్న రోజులివి. మన పిల్లల్ని చూసుకోవడానికి కాకుండా, మనం వాళ్లని పిల్లలుగా ప్రేమించాలని  ప్రాధేయపడాల్సి వస్తున్న రోజులివి. ఇంతగా... ఇన్నిసార్లు... ఇన్ని రకాలుగా... పెద్దలను చూసుకోమని చెప్పే బదులు ఈ అమ్మ కథ మీకు చూపిస్తే
 బాగుంటుందనిపించింది. చూశారా!  65 ఏళ్ల గిరిజమ్మ... 75 ఏళ్ల భర్తను,  25 ఏళ్ల కూతుర్ని, 35 ఏళ్ల కొడుకును  ఇంకా పసిపిల్లల్లా సాకుతూ ఉంది!    అయినా ఒక్కసారైనా ఇది కష్టమని చెప్పుకోవడం లేదు. అదృష్టంగానే భావిస్తోంది.  ఏదో మీలాంటి మారాజులెవరైనా ఆ పిల్లలకు వచ్చిన జబ్బు నయం చేసే సాయం ఏమైనా చేస్తారేమో అని ఎదురుచూస్తోంది. అంతే... వాళ్లని పెంచడం కష్టమని మాత్రం చెప్పుకోవడం లేదు.  మీ తల్లిదండ్రులు ఈ తల్లి కంటే ఏమాత్రం తక్కువ కాదు.  వాళ్ల గుండెల్లో కూడా  మీ పట్ల అంతే ప్రేమ ఉంటుంది.
 గిరిజమ్మ తన పిల్లల్ని చూసుకున్నట్లు...  మన అమ్మని మనం అలా చూసుకుంటే... జన్మ ధన్యం.
 
 వృద్ధులైన తల్లిదండ్రులను వీధుల పాలు చేసే బిడ్డలున్న ఈ లోకంలోనే.. బిడ్డలకు ఎంత వయసొచ్చినా తల్లికి భారం కాదని చాటి చెబుతున్న ఓ అమ్మ... గిరిజమ్మ కథ ఇది. అనంతపురం జిల్లా అగళి మండలంలోని ఓ మారుమూల గ్రామం ముత్తేపల్లి. ఈ గ్రామానికి చెందిన గిరిజమ్మ ఓ నిరుపేద. వయసు 65 దాటింది. ఆమెకన్నా పదేళ్లు పెద్దవాడైన ఆమె భర్త పేరు దాసప్ప. వీరి కుటుంబాన్ని ఓ వింత వ్యాధి ఏళ్లకేళ్లుగా నరకయాతన పెడుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు సంతానానికీ నరకయాతన చూపించింది. ఇప్పటికే నల్గురిని మింగేసిన ఆ జబ్బు, మరో ఇద్దరిని జీవచ్ఛవాలుగా మిగిల్చింది.

 యాభై ఏళ్ల క్రితం...
 ముత్తేపల్లి గ్రామంలో దాసప్ప, గిరిజమ్మలు ఉన్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. వారికి తొలి సంతానంగా మగపిల్లవాడు, ఆ తర్వాత ఆడపిల్ల పుట్టారు. పుట్టిన పిల్లలు చక్కగా ఎదుగుతుంటే తమ జీవితాలకు ఏ ఢోకాలేదనుకున్నారు. కానీ, కక్షకట్టినట్టుగా విధి వారి జీవితాలను ఓ అగాధంలోకి తోసేసింది.

‘‘పెళ్లయిన రెండేళ్లకే మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత ఆడిపిల్ల పుట్టింది. ఎనిమిదేళ్ల వయసు వరకు అందరిలాగే బుడి బుడి నడకలతో సంతోషంగా ఆరోగ్యంగానే ఉన్నారు. తొమ్మిదేళ్లు వచ్చేసరికి అదేం రోగమో.. కాళ్లూ చేతులు చచ్చుబడి పోయాయి. తుమ్కూరు తీసుకెళ్లాం. బెంగుళూరు ఆసుపత్రిలో చూపించాం. ఏవో మందులు రాశారు.. అయినా ప్రయోజనం లేదు. మాయదారి రోగం వారిని గడపదాటనివ్వలేదు. ఎముకలగూడులై ఆ పిల్లలు కన్నుమూశారు. ఆ తర్వాత ఆరేళ్లలో మరో నలుగురు పిల్లలు కలిగారు. మిగిలిన పిల్లలైనా బాగుంటే అంతే చాలని, మొక్కని దేవుడు లేడు. కానీ, ఏ దేవుడూ కనికరించలేదు. ఎనిమిదేళ్లు నిండుతాయనగా వారూ వరుసగా మంచం పట్టారు. శరీరాలు ఎముకల గూళ్ళల్లా మారాయి. ఏళ్లు వచ్చినా అందరికీ మంచమ్మీదే అన్ని పనులూ చేసేదాన్ని. ఎందుకీ కష్టం అని ఏడ్వని రోజు లేదు. కానీ, దేవుడిచ్చిన కష్టం.. ఏం చేయను. అందరు పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే.. నా పిల్లలే ఇలా...’’ అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఏడ్చేసింది గిరిజమ్మ.

‘‘ఆస్తులు లేకపోయినా, రెక్కల కష్టమ్మీద బతికే మేం పిల్లలకు వచ్చిన ఈ రోగాన్ని నయం చేయించడానికి చేతనైనన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లాం. వెళ్లిన చోటల్లా డాక్టర్లు మందులు రాసిచ్చారు. చెప్పిన ట్టల్లా వాడాం. ఉన్న కాస్త పొలం ఎప్పుడో కరిగిపోయింది. కానీ, ఆరోగ్యం మాత్రం బాగుకాలేదు. రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ తలో ముద్ద తినలేం. అలాంటిది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఎక్కడ చూపించేది?! ఈ అమ్మకు భారమనుకున్నారో, దేవుడే కరుణించాడో తెలియదు (కన్నీటిని తుడుచుకుంటూ...) మరో ఇద్దరు పిల్లలు ఈ మాయదారి రోగంతోనే చనిపోయారు’’ అని గిరిజమ్మ వివరించింది.

 గడపదాటలేదు...
 ‘‘కెంచమ్మ (ఇప్పుడున్న బిడ్డ. చేత్తో ఆమె తలనిమురుతూ) కు పాతికేళ్లు దాటాయి. ఓబులప్ప(కుమారుడు) కు 35కు పైనే ఉన్నాయి. ఇంకా పసిపిల్లలల్లాగే.. ఒంటేలుకు తీసుకుపోవాలి. స్నానం చేయించాలి. ఒంటిమీద ఎక్కడైనా చీమ కుట్టినా రుద్దుకోలేరు. అంత పసిపిల్లలు. అందుకే, కళ్లలో పెట్టి చూసుకుంటున్నా.. దాదాపు 50 ఏళ్లుగా ఈ ఇంట్లోనే.. పిల్లలతో పాటు నేనూ మా ఆయన. మంచైనా చెడైనా బంధువుల ఇళ్లకు వెళ్లింది లేదు. పిల్లలకు ఏ అవసరమొస్తదో తెలియదు. పిల్లలే కాదు నేనూ పదేళ్ల క్రిందటి దాకా ఈ ఇంటి గడపదాటలేదయ్యా!

 మా తర్వాత ఎవరు...
 కడుపున పుట్టిన పిల్లలకు ఎన్నేళ్లు వచ్చినా తల్లికి భారం కారయ్యా! దేముడికి సేవ చేస్తున్నట్టుగా చేస్తున్నా, అది నా అదృష్టమే. కానీ, మా ఆయన (దాసప్ప) ముసలోడయ్యాడు. కూలికి వెళ్లేటంత సత్తువ ఆయనలో లేదు. అందుకే, పిల్లలను చూసుకోవటానికి మా ముసలాయన్ను ఉంచి నేనే కూలి పనులకు పోతున్నా. పొద్దున్నే లేచి, ఇంటి పనులు చూసుకొని, పిల్లలకు ముఖాలు కడిగి, స్నానాలు చేయించి, ఇంత తినిపించి కూలికి వెళతా! పింఛన్ డబ్బులతో, కూలి చేసి ఈ సంసారాన్ని నెట్టుకొస్తున్నా. కానీ, వయసు మీద పడటం వల్లనేమో ఈ మధ్య నడుం నొప్పి విపరీతంగా బాధిస్తోందయ్యా! నా పిల్లలకు బుక్కెడు తిండి పెట్టడానికి ఈ వయసులో పడరాని పాట్లు పడుతున్నాను. నా బాధల్లా ఒక్కటే! మా ముసలోడు, నేను సచ్చిపోతే మా పిల్లలకు దిక్కెవరయ్యా! ఆళ్లనెవరు చూసుకుంటారు? ఇప్పుడే పిల్లలకు ఏదైనా దారి దొరికితే అంతే చాలని కనపడని దేవుళ్లకల్లా మొక్కుతున్నానయ్యా!’’ అంటూ పొంగుకు వస్తున్న దుఃఖం ఆపుకోలేక వలవల ఏడ్చేసింది గిరిజమ్మ. వీరి ఆవేదన వింటున్నంతసేపు, వారి పిల్లలను చూస్తున్నంతసేపూ ఎవరి కళ్లయినా చెమర్చుతూనే ఉంటాయి.

తన తర్వాత పిల్లల గతి ఏమిటని గిరిజమ్మ ఆవేదన. తన కష్టాన్నే అదృష్టంగా భావిస్తూ పిల్లలకు సేవ చేస్తున్న ఈ వృద్ధురాలి భారం దిగేదెన్నడు. ఆ భారాన్ని దించేదెవరు? ఈ పెద్దపిల్లల కష్టాన్ని పెద్ద మనసుతో తీర్చేదెవ్వరు? మనసున్న మారాజులు తమ పిల్లలకు వైద్యం చేయించి ఆదుకుంటే జన్మజన్మలకు రుణపడి ఉంటాం అని రెండుచేతులూ ఎత్తి మొక్కుతోంది గిరిజమ్మ.
 - గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం
 
 

Advertisement
Advertisement