అన్నం వండి ఆర్సెనిక్‌ వార్చేయండి!  | Sakshi
Sakshi News home page

అన్నం వండి ఆర్సెనిక్‌ వార్చేయండి! 

Published Thu, Mar 1 2018 12:19 AM

There is terrible poison in the food - Sakshi

మీరు నమ్మినా, నమ్మకున్నా మనం తినే అన్నంలో భయంకరమైన విషం ఉందంటున్నారు ఆహార, రసాయన నిపుణులు. దాని పేరే ఆర్సెనిక్‌. ఆ విషం విషయమేమిటో తెలుసుకోవాలంటే అసలు ముందుగా ఆర్సెనిక్‌ అంటే ఏమిటో తెలుసుకుంటే మంచిది.  పూర్వకాలంలో రాజరిక పరిపాలన సమయంలో, అంతఃపుర కుట్రల్లో ప్రత్యర్థులను నిశ్శబ్దంగా మట్టుబెట్టడానికి ఉపయోగించే విషమే ఆర్సెనిక్‌. ఇది ఎంత ప్రభావవంతమైనదంటే నెమ్మదిగా ఇస్తూపోతే స్వాభావిక మరణంలా అనిపించేలా మృత్యువు పాలవుతారు. లేదా పెద్దమోతాదులో ఇస్తే ఠక్కున మృతిచెందుతారు. ప్రముఖ నియంత నెపోలియన్‌ ఆర్సెనిక్‌ పాయిజనింగ్‌తో మరణించాడనే మాట ఒకటి ప్రచారంలో ఉంది. ఇక జేమ్స్‌బాండ్‌ సినిమాల్లోని గూఢచారులు శత్రువుల చేతికి చిక్కినప్పుడు ఒక విషపు మాత్రను నోట్లో వేసుకొని మరణిస్తుంటారు. ఇందుకోసం ఉపయోగించే విషాలలో ఒకటి సైనైడ్‌ కాగా రెండోది ఆర్సెనిక్‌. అయితే శత్రువులను తుదముట్టించడం కోసం ఉపయోగించేందుకు ఆర్సెనిక్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్నం పెడితే సరిపోతుందా అన్న పరిస్థితి ఇటీవల మన సమాజం ముందుంది. కాస్త అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఆహార, రసాయన నిపుణులు. రసాయన ఎరువులు, పురుగుమందులతో మట్టిలోకి అన్ని విషాలతో పాటు ఆర్సెనిక్‌ ఇంకుతోంది. అది మళ్లీ మొక్కల్లోంచి మనుషుల దేహాల్లోకి వచ్చి ప్రమాదఘంటికలను మోగిస్తోందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవడం ఎలాగో కూడా సూచిస్తున్నారు. ఆ విషయాలను తెలుసుకునేందుకు పుణేలోని నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీకి చెందిన నిపుణులు చెబుతున్న అంశాలివి... 

 రసాయనిక ఎరువుల, పురుగుమందుల విస్తృత ఉపయోగంతో మనం తినే వరి అన్నం, బంగాళదుంపలు తదితర ఆహార పదార్థాల్లోకి విషం... అందునా ప్రమాదకరమైన ఆర్సెనిక్‌ విషం చేరే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్‌ వ్యాధులు వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు  పుణేలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఓ. జి. బి. నంబియార్‌. మనం తినే ఆహారంలోని విషపదార్థాలపై అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు. మన దేహం నుంచి వ్యర్థాల రూపంలో విసర్జితమైపోయే ఆర్సెనిక్‌తోపాటు మనకు అవసరమైన థయామిన్‌ పోషకం దేహం నుంచి అతిగా బయటకు వెళ్లిపోతుండడం వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే దీనికి విరుగుడు కూడా ఆయన సూచిస్తున్నారు. వరి అన్నం వండినప్పుడు గంజి వార్చితే బియ్యంలోని ఆర్సెనిక్‌ విషం చాలా వరకు పోతుందని ఒక పరిష్కారం  చెబుతున్నారు. అయితే మరికొన్ని  ప్రత్యామ్నాయ ఆహారాలను ఆయన సూచిస్తున్నారు. థయామిన్‌ పుష్కలంగా ఉండే కొర్రలు వంటి చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటే ఆర్సెనిక్‌ బాధ తప్పుతుందని, థయామిన్‌ కొరత ఉండదు కాబట్టి డయాబెటిస్‌ సమస్య కూడా రాకుండా ఉంటుందని ఆయన అంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రకృతి ఆహారోత్సవంలో పాల్గొన్న డాక్టర్‌ నంబియార్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.  వివరాలు.. ఆయన మాటల్లోనే.. 

►మనిషి దేహంలోకి వరి అన్నం, బంగాళదుంపల ద్వారా ఆర్సెనిక్‌ విషం ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించే ఆ ఆర్సినిక్‌ రక్తంలోని థయామిన్‌ను మూత్రం ద్వారా అతిగా బయటకు వెళ్లిపో యేలా చేస్తుం టుంది. ధయామిన్‌ మనకు ఉపయోగకరమైన, అత్యంత కీలకమైన పోషకం. అది పోవడం మనకు నష్టం. 

►ఆహారంలో ఆర్సినిక్‌ ఉన్నప్పుడు థయామిన్‌ ఎంత ప్రభావపూర్వకంగా పనిచేయాలో అంతగా పనిచేయదు. దాంతో మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్‌ కూడా ఎంత ప్రభావవంతగా ఉండాలో అంత ప్రభావవంతంగా తన కార్యకలాపాలు సాగించలేదు. ఫలితంగా ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’ వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిణామమే టైప్‌–2 డయాబెటిస్‌లోనూ ఉంటుంది. 

►ఇక డయాబెటిస్‌ రోగుల దేహంలో వారి అవసరాలతో పోలిస్తే కేవలం 20% మాత్రమే థయామిన్‌ అందుబాటులో ఉంటుంది. 

►థయామిన్‌ గ్లూకోజ్‌తో జత చేరినప్పుడే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అయితే థయామిన్‌ లోపం వల్ల జీవక్రియలు సక్రమంగా జరగకపోవడంతో పాటు  అనేక వరస పరిణామాలు సంభవిస్తాయి. 

►2012–15 మధ్యకాలంలో అమెరికాకు చెందిన ఎఫ్‌.డి.ఎ. 1200 రకాల వరి బియ్యంపై అధ్యయనం చేసి... వరి బియ్యంలో అధికపాళ్లలో ఆర్సెనిక్‌ విషం ఉందని నిర్ధారణ చేసింది. 

►చాలా మంది ఆరోగ్యం కోసం పాలిష్‌ చేసిన బియ్యం కంటే పాలిష్‌ చేయని ముడిబియ్యాన్ని వాడుతుంటారు. పాలిష్‌ చేసిన బియ్యంలో పోషకాలు వెళ్లిపోతాయని, అదే ముడిబియ్యంలో పోషకాలు చాలావరకు పోవని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. అయితే పాలిష్‌ చెయ్యని ముడిబియ్యంలో ఆర్సెనిక్‌ విషం మరింత ఎక్కువగా ఉంటుంది. బియ్యం పైపొరలో ఆర్సెనిక్‌ విషం ఎక్కువగా ఉంటుంది.  

ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి 
ఆర్సనిక్‌ విష ప్రభావాలు తగ్గించే దిశగా  మరికొన్ని పరిశోధనలూ జరుగుతున్నాయంటున్నారు 
డాక్టర్‌ నంబియార్‌. వాటి గురించి ఆయన చెబుతున్న అంశాలివి... 
► రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నప్పటి నుంచి, అధిక దిగుబడి వరి వంగడాలను వాడుతున్నప్పటి నుంచి ఆర్సెనిక్‌ విషం వరి అన్నంలో ఎక్కువ మోతాదులో ఉంటున్నదేమో అనే విషయంపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ∙ఒక బాక్టీరియా ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా వరి మొక్కల వేళ్లు ఆర్సెనిక్‌ విషాన్ని మట్టి నుంచి పీల్చుకోకుండా ఉండే ఒక సాగు పద్ధతిపై నా అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. ఇది విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే ఈ పరిశోధన పూర్తికావడానికి ఇంకా కొన్నాళ్ల సమయం పడుతుంది ∙ వరి బియ్యం, బంగాళదుంపలు, ఇతర ధాన్యాలు, మూత్రం, నీరు, గోళ్లు, వెంట్రుకలలో ఆర్సెనిక్‌ ఎంత ఉన్నదీ 20 నిమిషాల్లో తెలిపే ఒక కిట్‌  (క్వాంటిటేటివ్‌ ఆర్సెనిక్‌ మోనిటర్‌)ను నేను కనుగొన్నాను. యునిసెఫ్‌ ఆర్థిక సహాయంతో బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో తాగునీటిలో ఆర్సెనిక్‌పై పరిశోధనలో భాగంగా 2000 సంవత్సరంలో దీన్ని కనుగొన్నాను. దీన్ని సాధారణ వ్యక్తి ఎవరైనా ఉపయోగించి ఆయా ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు ∙డయాబెటిక్‌ రోగులు బెన్‌ ఫో థయామిన్‌ (విటమిన్‌ బి1) 200 ఎం.జి. టాబ్లెట్‌ను భోజనంతో పాటుగా (రోజుకు రెండు) తీసుకోవచ్చు. వట్టి థయామిన్‌ మాత్ర తీసుకోవడం కన్నా కొవ్వులో కరిగే థయామిన్‌ డెరివేటివ్‌ను వాడటం మంచిది.

భయం లేదు... జాగ్రత్తలివే...
►కొర్రలు వంటి చిరుధాన్యాలు థయామిన్‌ అధికపాళ్లలో కలిగి ఉంటాయి గాకీ ఆర్సెనిక్‌ను ఏమాత్రం కలిగి ఉండవు. ఇలాంటి విషం లేని వాటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటే సమస్య ఉండదు. అయితే, వరి బియ్యం తినటం అనేది అనాదిగా మన ఆహారపు అలవాటు. వరి బియ్యం తినటాన్ని వెంటనే మానుకోలేం. కాబట్టి వరి బియ్యాన్ని ఆరు రెట్లు ఎక్కువ నీరు పోసి ఉడికించి... గంజి వార్చి పారబోస్తే అన్నంలోని ఆర్సెనిక్‌ చాలా వరకు పోతుంది. అయితే ఇలా వార్చిన గంజి పశువులకు కూడా మంచిది కాదు. ∙వరి మొక్కల వేళ్ల మారిదిగానే బంగాళదుంప మొక్కల వేళ్లు కూడా ఆర్సెనిక్‌ విషాన్ని మట్టి నుంచి ఎక్కువగా గ్రహిస్తుంటాయి. బంగాళదుంపల్లో 70 శాతం నీరుంటుంది. బంగాళదుంప చిప్స్‌లో ఆర్సెనిక్‌ విషం పాళ్లు ఎక్కువగా ఉంటాయి.  బంగాళదుంపను కోసి బాగా కడిగితే ఆర్సెనిక్‌ పోతుంది. కడగకుండా అలాగే వేపితే ఆర్సెనిక్‌ అందులోనే ఉండిపోతుంది. ∙గర్భవతులు వరి బియ్యంతో వండిన అన్నం అసలు తినకుండా చిరుధాన్యాలు తదితర ఆహార ధాన్యాలు తినటం మంచిది. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వరి అన్నం తినిపించకుండా ఉంటేనే మంచిది. వారికి మొదటినుంచి చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినిపించడం మంచిది.  

Advertisement
Advertisement