చెరువుంది.. చేపల్లేవ్‌! | Sakshi
Sakshi News home page

చెరువుంది.. చేపల్లేవ్‌!

Published Tue, Jul 11 2017 12:15 AM

చెరువుంది.. చేపల్లేవ్‌!

నేడు పాపులేషన్‌ డే

జనాభా పెరిగే చోట పెరుగుతూ పోతుంటే, తగినంత జనాభా లేక బాధపడుతున్న దేశాలూ ప్రపంచంలో ఉన్నాయి. అధిక జనాభా గల దేశాలు.. ఇద్దరు లేక ఒక్కర్ని మించి పిల్లల్ని కంటే.. ‘మీకు అవి కట్‌ చేస్తాం, ఇవి కట్‌ చేస్తాం’  అని హెచ్చరిస్తుంటే.. జనాభా కొరతగా ఉన్న దేశాలు.. ‘పిల్లల్ని కనండి బాబూ.. మీకు అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అని తమ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. అలా ప్రోత్సహిస్తున్న దేశాలేవో, అవి ఎలా ప్రోత్సహిస్తున్నాయో చూస్తే విడ్డూరంగా అనిపిస్తుంది.  

ఏడున్నరకే లైట్స్‌ ఆఫ్‌!
దక్షిణ కొరియా కష్టించి పనిచేసే దేశం. 24 గంటలు కష్టపడినా అక్కడి ఆఫీసులలో పని ఒక కొలిక్కి రాదు. కారణం.. ఆ దేశంలో తగినంత జనాభా లేకపోవడం. ఉద్యోగాలుంటాయి. చేసేందుకు మనుషులుండరు. సకల సౌకర్యాలూ ఉంటాయి. అనుభవించేందుకు మనుషులు ఉండరు. దాంతో అక్కడి గవర్నమెంట్‌ ఓ ప్లాన్‌ వేసింది. నెలలో ప్రతి మూడవ బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం ఏడున్నరకే ౖలñ ట్స్‌ ఆఫ్‌ చేసి ఉద్యోగులను ఇంటికి పంపించేస్తోంది. అలాగైనా కొద్ది గంటలు దాంపత్య జీవితం గడిపితే జనాభా కరువు తీరుతుందని దక్షిణ కొరియా ఆలోచన. అలాంటప్పుడు మూడో బుధవారమే ఎందుకు? అన్ని బుధవారాలూ ఇవ్వొచ్చు కదా! ఐడియా బాగానే ఉంది కానీ, ఆఫీస్‌ పని ఆ మాత్రమైనా జరక్కపోతే మళ్లీ అదో ప్రాబ్లం.

మొదటి బిడ్డకు లక్షా పదివేలు!
జపాన్‌ ప్రభుత్వం పనిగట్టుకుని మరీ.. పిల్లల్ని కనేవాళ్లకు డబ్బూదస్కం ఇవ్వడం లేదు కానీ, స్థానిక సంస్థలు వాటికై అవే ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. మొదటి బిడ్డకు లక్షా పదివేల రూపాయలు (మన రూపాయల లెక్కలో), రెండో బిడ్డకు 65 వేలు, మూడో బిడ్డకు 75 వేలు, నాలుగో బిడ్డకు కొన్ని వార్డుల్లోనైతే మూడు లక్షల రూపాయల దాకా ‘ఎంకరేజ్‌మెంట్‌ మనీ’ అందుతుంది.

కంటూ ఉంటేనే దేశభక్తి ఉన్నట్లు!
సింగపూర్‌లో పన్నులు (టాక్సెస్‌) పేలిపోతాయి. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, పిల్లల్ని కంటూ ఉండేవాళ్లకు ఆ.. పన్నులలో మినహాయింపు ఉంటుంది. డిస్కౌంట్‌ ఉంటుంది. ‘పిల్లల్ని కనండి ప్లీజ్‌’ అని ప్రభుత్వం ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోవడంతో జనాభా అధికారులు ఆఖరికి ‘దేశభక్తి’ని సీన్‌లోకి తెచ్చారు. ఒక వీడియోను తయారు చేసి యూట్యూబ్‌లోకి ఎక్కించారు. ఆ వీడియోలోని ఒక లైన్‌ ఇలా ఉంటుంది: ‘‘నేను దేశభక్తి ఉన్న భర్తను. నువ్వు దేశభక్తి ఉన్న నా భార్యవు. జీవితాన్ని ఉత్పత్తి చేయడం అనే పౌరధర్మాన్ని మనిద్దరం కలిసి నిర్వర్తించుదాం’’.

వర్కింగ్‌ ఉమన్‌ అని చెప్పుకోకండి
2016లో ఈజిప్టు అధ్యక్షుడు ఎర్డోగన్‌ దేశ మహిళలకు ఒక విజ్ఞప్తి చేశారు. ‘‘అమ్మలాలా.. మీకు దండం పెడతాను. కనీసం ముగ్గురు పిల్లల్నైనా కనండి’’ అని. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ‘‘మీరు వర్కింగ్‌ ఉమన్‌ అని చెప్పుకోకండి. అలా చెప్పుకుంటే మీరు మాతృత్వాన్ని నిరాకరిస్తున్నారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు’’ అని ఒక వివాదాస్పద కామెంట్‌ కూడా చేశారు. అయితే ఈజిప్టు పౌరులెవరూ దీనిపై విరుచుకుపడలేదు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? దేశానికి తగినంత జనాభా కావాలి కదా అని సర్ది చెప్పుకున్నారు. అన్నట్లు... ఫస్ట్‌ టైమ్‌ బిడ్డను కంటే ఈజిప్టు ఓ గోల్డ్‌ కాయిన్‌ని కూడా గిఫ్టుగా ఇస్తోంది.

మీరు కనండి.. మేం పెంచుతాం
ఆహా! ఫ్రాన్స్‌ ఎంత గొప్ప దేశం! íపిల్లల్ని, పిల్ల తల్లుల్ని అపురూపంగా చూసుకోవడంలో ఫ్రాన్స్‌ తర్వాతే ఏ దేశమైనా. తల్లికి ఆరు నెలల ప్రసూతి సెలవు ఇస్తుంది. తల్లి ఆరోగ్యానికి అవసరమైన అన్ని వైద్యసేవల్నీ ఉచితంగా అందిస్తుంది. ఇక బిడ్డనైతే తనే తల్లై పెంచుతుంది. అంటే.. పెంపకంలో ఇబ్బందుల్లేకుండా ఆర్థికంగా చేయూతనిస్తుంది.

Advertisement
Advertisement